టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ అంతటా దాడులు చేసి, కుళ్లిన కోడిగుడ్లతో బేకరీ పదార్థాలు, రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న యూనిట్లను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో 9 మందిని అరెస్టు చేసి, భారీ మొత్తంలో కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Food Safety: హైదరాబాద్లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Hyderabad Food Safety: హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రాణాంతక రసాయనాలను ఉపయోగిస్తూ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న కేంద్రాలపై అధికారులు మెరుపుదాడులు చేశారు.

Hyderabad Food Safety: హైదరాబాద్ ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫీయా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం నగరం అంతటా నిర్వహించిన వరుస దాడుల్లో కుళ్లిన కోడిగుడ్లు, నిషేధిత రసాయనాలు వాడుతున్న బేకరీ కేంద్రాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్లను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 9 మందిని అరెస్టు చేసి, భారీ మొత్తంలో కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ మాఫియా ఆగడాలు- అసలేం జరిగింది?
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రాణాంతక రసాయనాలను ఉపయోగిస్తూ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న కేంద్రాలపై సిటీ టాస్క్ ఫోర్స్, ఫుడ్ అడల్టరేషన్ విభాగం అధికారులు మెరుపుదాడులు చేశారు. ఈ దాడుల్లో ప్రదానంగా చిన్న పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్లు, కేకులు మొదలు కొవి ప్రతి వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు అన్నీ కల్తీ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు.
కాటేదాన్, రాజేంద్రనగర్, బేగంబజార్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లో సాగుతున్న ఈ అక్రమ దందాను అరికట్టేందుకు పోలీసులు ఏక కాలంలో దాడులు చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో లక్షల రూపాయల విలువలైన నిల్వలు, యంత్రాలు సీజ్ చేశారు.
కుళ్లిన కోడిగుడ్లుతో బేకరీ పదార్థాల తయారీ!
కాటేదాన్ పరిధిలోని ఇంద్ర సొసైటీలో ఉన్న మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీలో జరుగుతున్న తయారీ విధానం అధికారులను విస్మయానికి గురి చేసింది. ఇక్కడ చిన్న పిల్లలు తినే డోనట్సస్, కేకులు, బిస్కెట్ల తయారీలో పచ్చిగా కుళ్లిపోయిన కోడిగుడ్లను వాడుతున్నట్టు గుర్తించారు.
ఈ కేంద్రంలో సూపర్వైజర్ అఫ్రిదీ అన్సారీ, మేనేజ్ యాసిన్, ఖత్రేషన్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ కల్తీ వ్యాపారాన్ని నడుపుతున్నారు. వీరి వద్ద నుంచి కుళ్లిన కోడిగుడ్లు, పాడైపోయిన డోన్స్, కేకులు, డాల్డా, మిల్క్ పౌడర్, సోడియం బెంజోయెట్ , సోర్బిక్ యాసిడ్, పొటాషియం, సోర్బేట్, అమ్మోనియా సల్ఫేట్ వంటి ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రసాయనాలు మోతాదుకు మించి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా పిల్లల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు.
యాసిడ్లతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ
నిత్యం ఇంట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఓ బ్యాచ్ విషతుల్యం చేస్తున్నారు. రాజేంద్రనగర్, ఎంఎం పహాడీ ప్రాంతాల్లో డెక్కన్ ట్రేడర్స్ పేరుతో రెండు గోడౌన్లను నడుపుతున్న సోహెల్ చానియా, రహీమ్ చరానియా, అమిత్ చరానియాను పోలీసులు అరెస్టు చేశారు. వీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో శాంటానిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్లను వాడుతున్నారు. అల్లం, వెల్లుల్లి కంటే ఎక్కువగా వెల్లుల్లి పొట్టును కలిపి ఈగలు ముసురుతున్న అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పేస్ట్ తయారు చేస్తున్నారు. సుమారు 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్ను, యాసిడ్ టిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేస్ట్ను నగరంలోని హోల్సేల్ దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీస్లకు సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.
బ్రాండెడ్ పేరుతో నాసిరకం కొబ్బరి పొడి
బేగం బజార్లో చేతక్ అనే ప్రముఖ బ్రాండ్ పేరుతో నాసిరకం కొబ్బరి పొడిని విక్రయిస్తున్న నకుల్ మరోటియా అనే వ్యక్తిని గోషామహాల్ పోలీసులు అరెస్టు చేశారు. అతను కర్నాటక నుంచి అత్యంత తక్కువ ధరకు లభించే నాణ్యత లేని కొబ్బరి పొడిని తెచ్చి, బ్రాండెడ్ కవర్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. సుమారు 21 లక్షల విలువై 8,300కిలోల కొబ్బరి పొడిని పోలీసులు సీజ్ చేశారు.
నకిలీ ఐస్క్రీమ్ పార్లర్ల ఆగడాలు
అత్తాపూర్లో జైబోలేనాథ్ అనే పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండానే ఐస్క్రీమ్ పార్లర్ను నిర్వహిస్తున్న కేంద్రంపై కూడా అధికారులు దాడులు చేశారు. అసలైన కంపెనీ పేరును వాడకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బీసే రంగులు, తక్కువ నాణ్యత గల క్రీములో ఐస్క్రీమ్ తయారు చేస్తున్నారు. అసలైన కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఇద్దర్ని అరెస్టు చేశారు.
Frequently Asked Questions
హైదరాబాద్లో ఆహార కల్తీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
బేకరీ పదార్థాల తయారీలో ఎలాంటి కల్తీని గుర్తించారు?
కాటేదాన్ పరిధిలోని ఒక బేకరీలో చిన్న పిల్లలు తినే డోనట్స్, కేకులు, బిస్కెట్ల తయారీలో కుళ్లిపోయిన కోడిగుడ్లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదకర రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ఎలాంటి కల్తీ జరుగుతోంది?
రాజేంద్రనగర్ ప్రాంతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో శాంటానిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్లను వాడుతున్నారు. ఈగలు ముసురుతున్న అపరిశుభ్ర వాతావరణంలో పేస్ట్ తయారు చేసి, హోల్ సేల్ దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నారు.
బ్రాండెడ్ పేరుతో ఎలాంటి నాసిరకం ఉత్పత్తిని విక్రయిస్తున్నారు?
బేగం బజార్లో 'చేతక్' అనే బ్రాండ్ పేరుతో కర్నాటక నుంచి తెచ్చిన నాణ్యత లేని కొబ్బరి పొడిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 21 లక్షల విలువైన కొబ్బరి పొడిని పోలీసులు సీజ్ చేశారు.























