Ashu Reddy : బంగారం, కార్లు, ఫ్లాట్స్ కొనిపించుకుంది - పెళ్లి పేరుతో 9 కోట్లు దోచేసింది... బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డిపై కేసు
Ashu Reddy Case : బిగ్ బాస్ ఫేం, హీరోయిన్ అషు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి పేరిట మోసం చేసిందన్న ఎన్ఆర్ఐ ఫిర్యాదులో ఆమె కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైంది.

Case Registered Against Actress Ashu Reddy : హీరోయిన్, బిగ్ బాస్ ఫేం అషు రెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరిట తనను మోసం చేసిందంటూ ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం... హైదరాబాద్ షేక్ పేట్కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వై వి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా వర్క్ చేస్తున్నారు. 2018లో భారత్కు వచ్చిన టైంలో అతనికి అషు రెడ్డి పరిచయమైంది. అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలిపింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల కోసం డబ్బులు అడగడం ప్రారంభించింది.
బంగారం, కారు, ఆస్తులు కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుంది. ఆ తర్వాత అషు రెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధం ఖాయం చేస్తున్నామంటూ పండితుడిని పిలిచి హడావుడి చేశారు. అనంతరం పెళ్లి పేరెత్తితే ముఖం చాటేస్తున్నారని బాధితుడు వెల్లడించారు.
రూ.9.35 కోట్లు మోసం
తమను మొత్తం రూ.9.35 కోట్ల మేర మోసం చేశారని బాధితులు ఆరోపించారు. 2025 వరకూ అషు రెడ్డి తన కుమారుడి నుంచి రూ.9.35 కోట్ల విలువైన బంగారం, నగదు, ఫ్లాట్స్, వాహనాలు కొనుగోలు చేయించుకుందని... అదనంగా ఆమె సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకున్నట్లు ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అషు రెడ్డి... ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్తో మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ట్రెండింగ్ వార్తలు























