CM Revanth Musi Revival Project: అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
Musi Politics: తెలంగాణలో రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి ప్రాజెక్టు చుట్టూ అనేక రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ రేవంత్ ముందుకెళ్తున్నారు. పనుల్లో ఇంకా ప్రాథమిక దశ కూడా దాటలేదు.

CM Revanth plans for Musi revival project : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి నదిని లండన్ లోని థేమ్స్ నదిలా మారుస్తామని, నదీ తీరాన్ని ఆర్థిక హబ్గా మారుస్తామని భారీ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారు. ఇటీవలే రూ.7,000 కోట్లతో మొదటి విడత పనుల మాస్టర్ ప్లాన్ను కూడా ఆవిష్కరించారు. అయితే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, పనులు ఇంకా ప్లానింగ్ , సర్వే దశలోనే ఉన్నాయి. 55 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు కేవలం భూసమీకరణ నోటిఫికేషన్లు , కొన్ని ప్రాథమిక నిర్మాణాలకే పరిమితం కావడం ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తోంది.
వివాదాల సుడిగుండంలో నిర్వాసితులు
ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద అడ్డంకి నిర్వాసితుల సమస్య. నది పరివాహక ప్రాంతంలోని దాదాపు 10,000 పేద కుటుంబాలను తరలించడం అనేది ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. మూసి జన ఆందోళన వంటి వేదికల ద్వారా బాధితులు తమ నిరసనలు తెలుపుతుండగా, ప్రతిపక్షాలు దీనిని లూటిఫికేషన్ అని విమర్శిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ, తమ జీవనోపాధి దెబ్బతింటుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయంగా ఈ వ్యతిరేకతను అధిగమించడం రేవంత్ సర్కార్కు పెద్ద సవాలు.
వెంటాడుతున్న నిధుల సమస్య
ప్రభుత్వ పదవీకాలంలో మిగిలి ఉన్న రెండున్నరేళ్ల సమయం ఈ భారీ ప్రాజెక్టుకు చాలా తక్కువ. 2027-28 నాటికి మొదటి విడత పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, నిధుల సమీకరణ, వాస్తవ నిర్మాణం వంటి క్లిష్టమైన దశలు దాటాల్సి ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థల నుంచి నిధులు ఆశిస్తున్నప్పటికీ, అవి సకాలంలో అందడం, పనుల్లో వేగం పెంచడంపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
రాజకీయ పరపతికి పందెం
ప్రజలు కేవలం విజన్ను చూసి ఓట్లు వేయరు, ఫలితాలను బట్టి నిర్ణయించుకుంటారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం రాజకీయంగా ప్రయోజనం చేకూర్చవచ్చు కానీ, సామాన్య ప్రజలు మాత్రం క్షేత్రస్థాయిలో మార్పును కోరుకుంటారు. ఒకవేళ వచ్చే రెండున్నరేళ్లలో కనీసం 50 శాతం పనులు కూడా పూర్తి కాకపోతే, ఇది కేవలం మాటల సీఎం అనే విమర్శకు ఆస్కారం ఇస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇలాంటి ప్రకటనలు వచ్చి ఆగిపోయిన చరిత్ర ఉండటంతో, రేవంత్ రెడ్డిపై ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంది.
పనుల్లోవేగం పెంచాలి !
కేవలం గ్రాఫిక్ డిజైన్లు, ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం తక్షణమే పనులను పట్టాలెక్కించాలి. నదిలో మురికినీరు కలవకుండా చేసే ఎస్టీపీల (STPs) నిర్మాణం, నదీ గర్భం ప్రక్షాళన వంటి ప్రాథమిక పనులు కంటికి కనిపిస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో పారదర్శకత పాటిస్తూ, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా పనుల పురోగతిని చూపడమే రేవంత్ రెడ్డి ముందున్న ఏకైక మార్గమన్న అభిప్రాయం వినిపిస్తోంది.























