KTR SIT Questioning: "అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా తప్పు చేయలేదు, ఎవర్నీ వదిలి పెట్టను" ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ కామెంట్స్
KTR SIT Questioning: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై దుష్ప్రచారం చేశారని ఇప్పుడు విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

KTR SIT Questioning: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో విచారణకు హాజరుకానున్నారు. అంతకు ముందు ఆయన తెలంగాణ భవన్కు వచ్చారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆయన విచారణకు వెళ్తున్న సందర్భంగా మహిళా నేతలంతా తిలకం దిద్ది పంపించారు. సీనియర్ నేతలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జరుగుతన్న విచారణ కేవలం టైంపాస్ కోసం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి అనుక్షణం ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమించామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడు వేధింపులకు పాల్పడలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేన్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. వచ్చిన మొదటి రోజు నుంచి వివిధ కుంభకోణాలు అంటూ ప్రచారం చేశారని అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"నా అంతరాత్మ సాక్షిగా నేను పుట్టిన నేల సాక్షిగా నేను తప్పు చేయలేదని ధైర్యంగా చెప్తున్నా... రెండేళ్లుగా నా మీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరికీ భయపడకుండా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న." అని అన్నారు.
డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని కూడా దుష్ప్రచారం చేశారని కేటీఆర్ అన్నారు. వీటికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కావడం లేదని ఎవరైనా అధికారుల చెప్పగలరా అని సవాల్ చేశారు. అసాంఘిక శక్తులను కట్టడి చేయడానికి కచ్చితంగా పోలీసులు ఫోన్లు ట్యాప్ చేస్తారని అన్నారు. గతంలో తమ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వానికి కూల్చేందుకు డబ్బులతో తిరిగిన వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్నారని అన్నారు. తన లాగే అందరూ ఉంటారనే ఇలా బురద జల్లుతున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కోల్ టెండర్లు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేశారని దాన్ని బయటపెట్టినందుకే ముందుగా హరీష్రావుపై కక్ష కట్టారని కేటీఆర్ అన్నారు. అందుకే మొదట ఆయనకు నోటీసులు ఇచ్చి పిలిచారని ఇప్పుడు తన వంతు వచ్చిందని చెప్పుకొచ్చారు. అక్రమ, అనైతిక పనులు ఎప్పుడూ చేయలేదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా డైవర్షన్ కోసమే జరుగుతుందని అన్నారు. మొత్తం కేబినెట్ దండుపాళ్యం మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు.
నా అంతరాత్మ సాక్షిగా
— KTR News (@KTR_News) January 23, 2026
నేను పుట్టిన నేల సాక్షిగా
నేను తప్పు చేయలేదని ధైర్యంగా చెప్తున్న.
రెండేళ్లుగా నా మీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరికీ భయపడకుండా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న.@KTRBRS pic.twitter.com/6O68tuzgO6
ఈ కేసును ఎవరు వదిలి పెట్టినా తాను మాత్రం విడిచిపెట్టబోనని కేటీఆర్ స్పష్టం చేశారు. తన క్యారెక్టర్ను దెబ్బ తీసేలా చేసిన రేవంత్ రెడ్డిని, కొందరు పోలీసు అధికారులను దోషులుగా నిలబెడతానని అన్నారు. ఎవరు ఎన్ని కక్ష సాధింపులకు దిగినా తమ పోరాటం ఆగబోదని చెప్పారు. కచ్చితంగా కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే వరకు విశ్రమించబోమని తేల్చి చెప్పారు.
సిట్ కార్యాలయంలో పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థి విభాగం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బిఆర్ ఎస్ వి నేతలను అర్ధరాత్రి నుంచే అరెస్టు చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ నేతలను ఇంటి నుంచి రాకుండా కట్టడి చేశారు.























