Harish Rao Challenges Revanth Reddy: రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాడ్లాడుతూ రేవంత్ రెడ్డిని రంగనాయక సాగర్లో బండ కట్టి ఎత్తేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను హరీష్ రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 'సీఎం రేవంత్ రెడ్డి "కాళేశ్వరం కూలిపోయింది... కేసీఆర్, హరీష్ రావులను బండకేసి కొట్టాలి" అంటూ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..
ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ బహిరంగ సవాల్ విసిరారు. "రేవంత్ రెడ్డి... మా సిద్దిపేటకు రా. రంగనాయక సాగర్లో బండ కట్టి నిన్ను ఎత్తేస్తా. నువ్వు మునుగుతావో.. తేలుతావో చూద్దాం. రంగనాయక సాగర్లో నీళ్లుండి నువ్వు మునిగితే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టు అనుకోవాలి. ఒకవేళ నువ్వు తేలితే కాళేశ్వరం కూలినట్టు" అంటూ హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు మానుకోవాలని, నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ముఖ్యంగా, మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, రైతు సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు.
హరీష్ రావు మాట్లాడుతూ, చిన్నకోడూరు ప్రాంతంలో 450 మంది రైతులకు దాదాపు 59 రోజులుగా రూ. 45 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'మాది రైతు ప్రభుత్వం' అని చెబుతున్నప్పటికీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చి 50 రోజులు గడిచినా చెల్లింపులు జరగలేదని విమర్శించారు. దీంతో యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకే తమ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయిపడ్డ రూ. 450 కోట్లు విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుబంధు, రుణమాఫీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కౌంటర్
రైతు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు చీరలు ఇచ్చిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. అంతేకాక, రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఓటు అడగాలంటే, ముందుగా మహిళలకు బకాయిపడ్డ రూ. 60 వేల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు బోనస్ పడాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, వచ్చే ఏడాది నుంచి పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని ఆయన అంటున్నారని, ఇప్పటికీ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని హరీష్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. 'కాళేశ్వరం కూలిపోయింది... కేసీఆర్, హరీష్ రావులను బండకేసి కొట్టాలి' అని రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తుచేస్తూ, ఆయనకు బహిరంగ సవాల్ విసిరారు. "రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రా. రంగనాయక సాగర్లో బండ కట్టి నిన్ను ఎత్తేస్తా. నువ్వు మునుగుతావో తేలుతావో చూద్దాం. రంగనాయక సాగర్లో నీళ్లుండి నువ్వు మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు. నువ్వు తేలితే కాళేశ్వరం కూలినట్టు," అని హరీష్ రావు సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలన్నీ అబద్ధాలని, ఆయన చిల్లర మాటలు మానుకోవాలని హరీష్ రావు హెచ్చరించారు.






















