Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తగిన స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.

Telangana Rising Global Summit 2025 | హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2027 అజెండాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సోమవారం, మంగళవారాల్లో (డిసెంబర్ 8, 9) ఫ్యూచర్సిటీ వేదికగా ఈ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ రైజింగ్ గ్లోబల్ సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించేలా అజెండా ఖరారైంది.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని ‘ఫ్యూచర్ సిటీ’లో 100 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు సదస్సుకు హాజరై కీలక ప్రసంగాలు చేయనున్నారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధం చేస్తున్నారు.

డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ను ముఖ్య అతిథి ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనుంది. సదస్సులో ప్రసంగించనున్న ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వేత్తలు
- నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ
- వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి
- బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా
- ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్
ఫేమస్ క్రీడాకారులు, సినీ ప్రముఖులు
ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, మాజీ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా పాల్గొననున్నారు. క్రియేటివ్ సెషన్లో సినీ ప్రముఖులు, టాలీవుడ్ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్, గుణీత్ మోంగా, అనుపమ చోప్రా పాల్గొంటారు.
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని, అతిథులు, సంస్థల ప్రతినిధులకు తగిన వసతులు కల్పించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాంగణాన్ని గంటకుపైగా ఆయన పరిశీలించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న ప్రాంగణాన్ని రేవంత్ రెడ్డి శనివారం సందర్శించారు. తొలుత హెలికాఫ్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాంగణానికి చేరుకున్న రేవంత్ రెడ్డి ప్రతి హాల్ను.. వివిధ సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లను నిశితంగా పరిశీలించారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవనం, ఇతర కార్యకమాలకు సంబంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్ను వీక్షించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సీఎం అధికారులకు సూచించారు.
సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంశంపైనా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాంగణం మొత్తాన్ని గంటకుపైగా కలియతిరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






















