Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Harish Rao criticizes Revanth: బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వాటికి రేవంత్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు బహిరంగలేఖ విడుదల చేశారు.

Harish Rao criticizes CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన భవనాలకు రిబ్బన్ కటింగ్లు చేయడానికేనని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది అంటూ ఎద్దేవా చేసిన హరీశ్ రావు, శిలాఫలకాలపై రేవంత్ పేరు ఉండొచ్చు కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాలపై కేసీఆర్ పేరే ఉంటుందని స్పష్టం చేశారు. నర్మెట్టలో ప్రారంభించబోయే రూ. 300 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నుండి ఆయుష్ ఆస్పత్రి, జిల్లా జైలు వరకు అన్నీ గత ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పూర్తి చేసినవేనని ఆయన గుర్తు చేశారు.
నాడు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి, ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏ ముఖం పెట్టుకుని ప్రారంభిస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసి, కాళేశ్వరం కాలువను పొడిగించి నీరందించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆయుష్ ఆస్పత్రి, పీహెచ్సీ భవనాలు అన్నీ తాను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించినవేనని, సిబ్బందిని నియమించకుండానే కేవలం ప్రచారం కోసం శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను ఆపేసిన అని చెప్పేందుకు సిద్దిపేటకు వస్తున్నావా రేవంత్ రెడ్డి?
— Team of Harish Rao (@THRCONSEPTS) March 21, 2026
– డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు@BRSHarish pic.twitter.com/rr0hUyC2z6
రైతు రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రిని హరీశ్ రావు నిలదీశారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, రుణమాఫీ పేరుతో రైతులను వంచించారని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 52 శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదని, సీఎం పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులు దీని కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. వరుసగా మూడు సీజన్ల రైతుబంధు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షతో సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1070 కోట్ల విలువైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా సిద్దిపేటలో పనులు మొదలైన వెటర్నరీ కాలేజీని ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు తరలించుకుపోవడం ఆయన స్థాయికి తగదని విమర్శించారు. రంగనాయక సాగర్ టూరిజం, శిల్పారామం, ఫోర్ లేన్ రోడ్లు వంటి ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించాలని హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















