Former DSP Nalini Health condition: చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని.. రాజకీయ లబ్ది కోసం మాత్రం వాడుకోవద్దు- బహిరంగ లేఖ వైరల్
Ex DSP Nalinis Viral Facebook Post | తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్సీ నళిని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, సరైన వైద్యం అందకపోతే త్వరలో తాను చనిపోతానని బహిరంగ లేఖ పోస్ట్ చేశారు.

Ex DSP Nalini Health condition |హైదరాబాద్: తాను అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నానని, త్వరలో చనిపోబోతున్నానని మాజీ డీఎస్పీ నళిని చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీగా ఆమె ఫేమస్. ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా, రాజకీయవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నెల రోజులుగా నా ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదని పేర్కొన్న నళిని.. తాను రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నట్లు తెలిపారు.
సమస్య ఏంటంటే..
డీఎస్పీ నళినికి 8 ఏళ్ల కిందట Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు బారిన పడ్డారు. దీన్ని Blood cancer+ Bone Cancer అని చెప్పవచ్చు. గత రెండు నెలలుగా డెంగ్యూ, చికెన్ గున్యా, టైపాయిడ్ వల్ల అనారోగ్యం మరింత పెరిగింది. కణకణం పేలిపోతున్నట్లు ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి వస్తుందని, తట్టుకోలేక పోతున్నానని తెలిపారు. 2018లో మొదట్లో ఈ జబ్బు వచ్చిన సమయంలో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉండి ఆరోగ్యం బాగుచేసుకున్నాను. ఇప్పుడు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరడానికి డబ్బు కూడా లేదు అన్నారు.
నా శరీరం 25 ఏళ్ల కిందటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మసిస్టును కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు తెలుసు. 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే ఎంచుకున్నాను. యోగ, ధ్యానం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా కనిపించాను. కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతోంది. దానివల్ల ఆరోగ్యం మరింతగా క్షీణిస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఇంగ్లీష్ మందులు వాడకంతో.. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని దిగజార్చాయి.
తెలంగాణ ఉద్యమంతో నిలువెల్లా గాయాలే
తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే. నా గతమంతా వ్యధ భరితం. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ సస్పెన్షన్ వేటు వేసింది. సహాయం చేసేవాడు కనిపించక 12 ఏళ్లు అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయతో ఆధ్యాత్మిక మార్గానికి వెళ్లా. యజ్ఞ బ్రహ్మగా VYPS ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగాను. నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకుని నళిని మళ్ళీ వికసించింది.
ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నా ఫైల్ ను ఎందుకో తెరిచారు. సహాయం చేస్తానని ప్రకటించారు. తన సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్కకట్టి (సుమారు 2 కోట్లు) ఇవ్వాలని 16 పేజీల రిపోర్ట్ ను ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ ఇవ్వాలని కోరారు. ( రెండోది వారి పార్టీ పాలసీ కి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది). 6 నెలల తర్వాత నా పిటిషన్ చెత్త బుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపినా ఇప్పటి వరకు స్పందన లేదు.
నా పేరుపై ఉన్న ఇంటి స్థలం vypsకు దక్కాలి. దేశ ప్రధానిని కలవలేక పోయా. నా మరణానంతరం ప్రధాని నా లక్ష్య సాధన కోసం ఏమైనా చేయాలనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వాలని మనవి. మోక్ష సాధనను మరో జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకొనే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న Facebookకు ధన్యవాదాలు.
చనిపోతే అలా మాత్రం రాయవద్దు..
తాను చనిపోయే సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయవద్దని, రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి , యజ్ఞ బ్రహ్మ అని సంభోదించాలని మీడియాకు రిక్వెస్ట్. నా అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. తెలంగాణ పోరాట విషయంలో ఏ నేత సన్మానించలేదు. నేను చనిపోయాక అవార్డులు, రివార్డులు ఇవ్వవద్దు. బతికుండగా లేనిది, చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.
ఖరీదైన వైద్యం అందితే బతుకుతాను
నా దయనీయ స్థితి కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే నాకు సరైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. ఇంకా 3,4 పుస్తకాలు రచించాలని, 100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయడం. ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించాలనుకున్నాను. మోక్ష సాధన తీవ్రతరం చేయాలని భావించగా.. నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు అని డీఎస్పీ నళిని తన పోస్టులో రాసుకొచ్చారు.






















