![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nallala Odelu Joined Congress: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఝలక్- కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్
Nallala Odelu joined Congress: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరారు.
![Nallala Odelu Joined Congress: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఝలక్- కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ Former BRS MLA Nallala Odelu joined Congress in the presence of Revanth Reddy Nallala Odelu Joined Congress: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఝలక్- కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/16/2dd0417a68c9462ec8f1a74fa9ee40d91694861553891861_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nallala Odelu Joined Congress: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆ పార్టీలో సీటు దక్కని నేతలతో పాటు ఎంతోకాలంగా అసంతృప్తితో ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. అలాంటివారిలో కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ చర్చలు జరుపుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి.
బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండటం, వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీనే బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్లోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరగా.. తాజాగా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న ఆయన భార్య భాగ్యలక్ష్మి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజ్కృష్ణ హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వారిద్దరు కాంగ్రెస్ గూటికి చేరారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి నల్లాల ఓదెలు దంపతులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి చేరిక చెన్నూరు నియోజకవర్గంలో పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. చెన్నూర్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతోనే ఆ పార్టీలోకి నల్లాల ఓదెలు వెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారు. అయితే చెన్నూర్ టికెట్ కోసం ఇప్పటికే కాంగ్రెస్లో భారీ పోటీ నెలకొంది. నూకల రమేష్తో పాటు రాజా రమేష్, రామిల్ల రాధిక, దాసరపు శ్రీనివాస్, దుర్గం భాస్కర్ వంటి నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరి పేర్లను స్క్రీనింగ్ కమిటీకి టీపీసీసీ పంపించింది. వీరిని కాదని ఓదెలకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని మరికొందరు చెబుతున్నారు.
అయితే గత ఏడాది నల్లాల ఓదెలు దంపతులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సమక్షంలో కండువా కప్పుకున్నారు. కానీ కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్తో ఓదెలు దంపతులకు గత కొంతకాలంగా పొసగడం లేదు. తమకు పదవులు రాకుండా బాల్క సుమన్ అడ్డుకుంటున్నారని, తమకు పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఓదెలు దంపతులు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికల వేళ ఎట్టకేలకు హస్తం గూటికి చేరారు.
హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాల వేళ కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఉదయం బీఆర్ఎస్కు తుమ్మల రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఒక లేఖ రాశారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల కాంగ్రెస్లో చేరుతున్న విషయం తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)