KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Delimitation Impact On Southern States | డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గిపోతాయని, నియోజకవర్గాలు సైతం తగ్గిపోతాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు.

KTR About Delimitation | చెన్నై: డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని, దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల నేతల సమావేశానికి హాజరయ్యేందుకు కేటీఆర్ తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రతినిధి బృందం చెన్నైకి వెళ్లింది.
కేటీఆర్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుంది. దేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతనిథ్యం తగ్గడం అన్యాయం. జనాభా నియంత్రణ కోసం కేంద్రం చెప్పిన సూచనలు పాటించి, పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు.
డిలిమిటేషన్ ప్రతిపాదనను బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశం పైన అందరం గట్టిగా కొట్లాడాలి.. వ్యతిరేకించాలి లేకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని ఎప్పటికీ క్షమించవు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. అత్యంత కీలకమైన ఈ సమయంలో దక్షిణాది రాష్ట్రాలు, నేతలు అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తు రాజకీయాలను సమూలంగా మార్చే ఈ పరిణామం పైన దక్షిణాది రాష్ట్రాల నేతలు అందరూ మాట్లాడాలని కేటీఆర్ సూచించారు.
కేటీఆర్ ఆధ్వర్యంలో BRS ప్రతినిధి బృందం, డీలిమిటేషన్ విధానంపై చర్చించేందుకు చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరైంది. డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగునున్న, భవిష్యత్తులో జరగబోయే నష్టాలను ఎండగట్టనున్నారు. దక్షిణాదికి జరగనున్న అన్యాయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.
డీలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

