Revanth Reddy CREDAI: ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ గుర్తొచ్చేలా నిర్మిస్తా - పెట్టుబడులకు లాభాలు వచ్చేలా చూస్తా - క్రెడాయ్ సమావేశంలో సీఎం భరోసా
Future City: ఫ్యూచర్ సిటినీ అద్భుతంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ అంటే తన పేరు గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు.

CM Revanth : కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారు, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మించారు, హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు.. వాళ్లు ఇక్కడ లేకపోయినా వారి పేర్లు చెప్పుకుంటున్నాం.. వారిని గుర్తు చేసుకుంటున్నాం .. అలాగా ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ పేరు గుర్తుకు వచ్చేలా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సంపాదించింది ఎవరైనా తీసుకెళతారేమో కానీ సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరన్నారు. నాకు వేరే కోరికలేం లేవు… హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా.. భవిష్యత్ లో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, తపన ఉంది నాకు వయసు ఉంది, ఓపిక ఉంది.. అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని క్రెడాయ్ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని.. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి .. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని గుర్తు చేశారు. నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు తావిస్తుంది .. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది అని భరోసా ఇచ్చారు.
రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరేనని.. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చానన్నారు. ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము… ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం?.పెట్టుబడుల విషయంలో మీకే మా మొదటి ప్రాధాన్యత.. అని హామీ ఇచ్చారు. కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదని.. అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చునన్నారు.
నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను.. కానీ పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదన్నారు.
జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చింది .. పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు .. అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేదన్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నామన్నారు. మాటి మాటికి ఢిల్లీ వెళ్తున్నారని కొందరంటున్నారని ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికేనని.. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానన్నారు.
26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించానన్నారు. అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నానని.. ఇదినా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయమన్నారు. తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా.. మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇన్ఫ్రా స్రక్చర్ ఎలా అభివృద్ధి అవుతుంది .. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.





















