Reaction on Tejaswi Surya: తేజస్వీసూర్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైర్ - తెలంగాణను అవమానించారని ఆగ్రహం
Tejaswi Surya: లోక్సభలో పునర్విభజనబిల్లుపై చర్చలు రాష్ట్ర విభజనను తేజస్వీ సూర్య వివాదాస్పద అంశాలతో పోల్చడం రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన తీరును కాంగ్రెస్, బీఆర్ఎస్ ఖండిస్తున్నాయి.

BRS and Congress fire on Tejaswi Surya: లోక్సభ వేదికగా నియోజకవర్గాల పునర్విభజన చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చిచ్చు రేపాయి. తెలంగాణ ఏర్పాటు, విభజన ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ముక్తకంఠంతో ఖండించాయి.
తేజస్వీ సూర్య అసలు ఏమన్నారు?
లోక్సభలో ప్రసంగిస్తూ తేజస్వీ సూర్య.. ఆంధ్రప్రదేశ్ విభజనను బ్రిటిష్ వారు దేశాన్ని విడగొట్టిన తీరుతో పోల్చారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత అశాస్త్రీయంగా, ఘోరంగా రాష్ట్రాన్ని చీల్చిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తక్కువ చేసేలా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. భారత్ పాక్లను విడగొట్టినట్లుగా తెలంగాణ విభజన చేసినట్లుగా చెప్పడాన్ని ఖండిస్తున్నారు.
హరీష్ రావు ఘాటు స్పందన
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించడం బీజేపీకి అలవాటుగా మారింది. గతంలో ప్రధాని మోదీ పార్లమెంటులో తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే, ఇప్పుడు ఈ ఎంపీ అంతకంటే ఘోరంగా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. వందలాది మంది బలిదానాలతో, దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన తెలంగాణను బ్రిటిష్ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
The @BRSparty strongly condemns the highly insensitive and irresponsible remarks made by @Tejasvi_Surya Member of Parliament from the @BJP4India
— Harish Rao Thanneeru (@BRSHarish) April 16, 2026
His comparison of the formation of Telangana state with the creation of Pakistan is not only factually incorrect but also deeply…
పొన్నం ప్రభాకర్ కౌంటర్
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తేజస్వీ సూర్యపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దీనిని అశాస్త్రీయం అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మోడల్ను విమర్శించే ముందు, దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి కడుతున్న పన్నుల వాటాపై తేజస్వీ సూర్య అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
నిజంగా తెలంగాణ రక్తం ఉంటే, మిస్టర్ కిషన్ రెడ్డి, బండి సంజయ్.. మీ mp మాటలను ఖండించండి- మంత్రి పొన్నం ప్రభాకర్ #PonnamPrabhakar #BandiSanjay #KishanReddy #TejaswiSurya pic.twitter.com/4XTp75d2gQ
— The Political Concepts (@paddu501) April 16, 2026
రాజకీయ రంగు పులుముకున్న విభజన సెగ
మొత్తంగా తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న భయం ఒకవైపు ఉంటే, మరోవైపు తెలంగాణ ఏర్పాటునే తప్పుబట్టేలా మాట్లాడటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీ తీరును ఎండగడుతుండటంతో, రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















