Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
iPhone 16 Record Sales: ఈ ఏడాది ఐఫోన్ 16 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్గా నిలిచింది. వివో Y29 5G రెండో స్థానంలో, ఐఫోన్ 15 మూడో స్థానంలో నిలిచాయి.

ఆపిల్ కంపెనీ ఈ సంవత్సరం ఒక కొత్త మైలురాయిని సాధించింది. ఈ సంవత్సరం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్గా ఆపిల్ ఐఫోన్ 16 నిలిచింది. ఈ ఐఫోన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను అధిగమించి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలో ప్రజలు ఇప్పుడు ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని ఇది సూచిస్తుంది. ఐఫోన్ 16 2024లో విడుదల కావడం తెలిసిందే. ఐఫోన్ 17 వచ్చిన తరువాత సైతం ఐఫోన్ 16 అమ్మకాలలో మెరుగ్గా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా కస్టమర్లు ఐఫోన్ 16 కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో యాపిల్ ఈ ఘనత సాధించింది.
ఐఫోన్ 16 అమ్మకాలు 6.5 కోట్ల యూనిట్లు
కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2025లో మొదటి 11 నెలల్లో ఆపిల్ ఐఫోన్ 16 మొబైల్స్ 6.5 కోట్ల యూనిట్లను విక్రయించింది. ఈ జాబితాలో రెండవ స్థానంలో వివో Y29 5G ఉంది. వివోకు చెందిన ఆ మోడల్ సుమారు 4.7 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఐఫోన్ 16 ధర Y29 5G కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ వ్యత్యాసం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా అత్యధికంగా అమ్ముడయ్యే ఫోన్ల జాబితాలో ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. ఆపిల్ ఐఫోన్ 15 ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం భారతదేశంలో విక్రయాలు జరుపుకున్న మొత్తం స్మార్ట్ఫోన్లలో 8 శాతం కేవలం ఐఫోన్ 16, ఐఫోన్ 15 మాత్రమే.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు
సెప్టెంబర్ 2024లో విడుదలైన ఐఫోన్ 16 ఫోన్ 6.1 అంగుళాల OLED డిస్ప్లేతో వస్తుంది. A18 ప్రాసెసర్తో కూడిన ఈ ఐఫోన్ మల్టీటాస్కింగ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సులభంగా నిర్వహిస్తుంది. అధిక పనితీరుతో పాటు, ఈ ప్రాసెసర్ సమర్థవంతమైనది. రాబోయే సాఫ్ట్వేర్ అప్డేట్లకు అనుకూలమైనది. దీని వెనుక 48MP + 12MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం దీని ముందు భాగంలో 12MP కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే, పూర్తి ఛార్జింగ్తో ఈ ఐఫోన్ 22 గంటల వీడియో ప్లేబ్యాక్కు సపోర్ట్ చేస్తుంది.
భారతదేశంపై ఆపిల్ స్పెషల్ ఫోకస్
గత కొంతకాలంగా ఆపిల్ భారతదేశంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆపిల్ కంపెనీ తన అసెంబ్లీ లైన్లను చైనా నుండి భారతదేశానికి తరలిస్తోంది. దీనితో కంపెనీ భారతదేశం నుండి దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతేకాకుండా, ఆపిల్ ఈ సంవత్సరం బెంగళూరు, పూణే, నోయిడాలో మూడు కొత్త స్టోర్లను కూడా ప్రారంభించడం తెలిసిందే. భారత్ మీద అమెరికా ఆంక్షలు, టారిఫ్ ల సమయంలో ఆపిల్ నేరుగా భారత్లో ఉత్పత్తులు పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.






















