IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
Ind vs NZ Final | మార్చి 8న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. అయితే వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే విజేతగా నిలిచే జట్టు ఏంటని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.

IND vs NZ Final Reserve Day Rule: టీ20 వరల్డ్ కప్ 2026 సరిగ్గా నెల రోజుల క్రితం ప్రారంభమైంది. 54 మ్యాచ్ల ఉత్కంఠ తర్వాత ఇక విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్ సమయం దగ్గర పడింది. ఇందులో భారత్, న్యూజిలాండ్ (IND vs NZ Final) జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్గా నిలవగా, న్యూజిలాండ్ తన తొలి టైటిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అయితే, వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇక్కడ అందిస్తున్నాం.
వర్షం పడితే ఏమవుతుంది?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. ఒకవేళ మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, అప్పుడు రిజర్వ్ డే రూల్ వర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. అయితే, మొదట మార్చి 8వ తేదీనే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తారు.
రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే విజేత ఎవరు ?
ఒకవేళ మార్చి 9న కూడా వర్షం వల్ల, ఇతర కారణాల వల్ల నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కు ఆటంకం కలిగితే కనీసం 10 ఓవర్ల ఆట నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ఐసీసీ ఈవెంట్స్ నాకౌట్ మ్యాచ్లలో రిజల్ట్ రావాలంటే ప్రతి ఇన్నింగ్స్లో కనీసం 10 ఓవర్ల ఆట తప్పనిసరి. ఒకవేళ మొదటి రోజు కొన్ని ఓవర్ల ఆట జరిగినట్లయితే, రిజర్వ్ డే రోజు అక్కడినుంచే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది.
ఒకవేళ రిజర్వ్ డే కూడా పూర్తిగా వర్షార్పణం అయితే, భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా (Joint Winners) ప్రకటిస్తారు. ఐసీసీ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్లో వర్షం కారణంగా ఆట జరగని సందర్భాలు చాలా తక్కువ. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇలాగే జరిగింది. ఆ సమయంలో భారత్, శ్రీలంకలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. గంగూలీ కెప్టెన్సీలో భారత్ విజేతగా నిలిచేలా కనిపించింది. కానీ వరుణుడు భారత ఆశలపై నీళ్లుచల్లడంతో లంకతో కలిసి ట్రోఫీని షేర్ చేసుకోవాల్సి వచ్చింది.





















