WPL 2026 ఫైనల్లో ఆర్సీబీ వీరవిహారం; రికార్డు ఛేజింగ్తో ఢిల్లీపై విజయం, రెండోసారి టైటిల్ కైవసం!
WPL 2026 Final:కెప్టెన్ స్మృతి మంధాన వీరోచిత ఇన్నింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి రెండోసారి WPL టైటిల్ను ఆర్సీబీ ఎగరేసుకుపోయింది

WPL 2026 Final: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ ముగింపు అద్భుతమైన మలుపులతో, ఉత్కంఠభరిత పోరాటంతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. వడోదర వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, మహిళల ప్రీమియర్ లీగ్లో రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన వీరోచిత ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చగా, ఢిల్లీ క్యాపిటల్స్కు మాత్రం మరోసారి ఫైనల్ గండం తప్పలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ - భారీ స్కోరుతో సవాల్
ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరును చేసింది. ఫైనల్ ఒత్తిడిని ఏమాత్రం లెక్కచేయకుండా మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడింది. 204 పరుగుల లక్ష్యం అంటే మహిళా క్రికెట్లో అది కూడా ఫైనల్ మ్యాచ్లో అత్యంత కష్టతరమైందిగా భావించారు. అయితే, బెంగళూరు బౌలర్లు మధ్యలో కొన్ని వికెట్లు తీసి కట్టడి చేసినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి స్కోరు బోర్డు పరుగులు తీసింది.

మంధాన మెరుపులు.. ఆర్సీబీ రికార్డు ఛేజింగ్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంధాన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మంధాన కేవలం 87 పరుగులు చేసి జట్టును విజయపు ముంగిట నిలిపారు. ఆమెకు తోడుగా జార్జియా వేర్హామ్, ఇతర బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

చివరి ఓవర్ల వరకు మ్యాచ్ ఊగిసలాడింది. 19వ ఓవర్లో సెట్ బ్యాటర్ స్మృతి మంధాన అవుట్ కావడంతో మ్యాచ్లో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో బెంగళూరుకు గెలుపు కోసం చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఒత్తిడిలో కూడా బెంగళూరు బ్యాటర్లు సంయమనం కోల్పోకుండా ఆడి, 19.4 ఓవర్లలోనే 204/4 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగోసారి కూడా రన్నరప్గానే
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇది ఒక పీడకలలా మిగిలిపోయింది. మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా నాలుగు సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా ఢిల్లీ రికార్డు సృష్టించింది. కానీ, దురదృష్టవశాత్తు ఆడిన నాలుగు ఫైనల్స్లోనూ ఓటమి పాలై రన్నరప్కే పరిమితమైంది. ఇది ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. లీగ్ స్టేజ్లో అద్భుతంగా ఆడి, ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరిన ఢిల్లీ, చివరి మెట్టుపై బోల్తా పడింది.

లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు ఆర్సీబీ ప్రస్థానం
ఈ సీజన్ ప్రారంభం నుంచి ఆర్సీబీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్లలో 6 విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 12 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచిన ఆర్సీబీ, లీగ్ దశలో ఢిల్లీ, ముంబై చేతుల్లో ఓడిపోయింది. ఫైనల్లో మాత్రం ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకుంది. గతంలో 2023-24 సీజన్లో తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ, ఇప్పుడు 2026లో రెండో టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది.





















