IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
శ్రీలంక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్ను తీసుకోవడం సమంజసమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండో టెస్టు గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.

IND VS SL 2nd Test Latest Updates: శ్రీలంకతో ఆదివారం నుంచి కొలంబోలోని ఎస్ఎస్ సీ మైదానంలో ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తుది జట్టు ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. గాలే టెస్టులో విజయం సాధించిన జట్టులో మార్పులు ఉంటాయా లేదా అనే ప్రశ్నలు అభిమానుల మదిని తొలుస్తున్నాయి. ముఖ్యంగా తొలి టెస్టులో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ను తుది జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమేనని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ లాంటి అనుభవజ్ఞులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆఫ్ స్పిన్నర్ కీలకం..
గాలే టెస్ట్ గణాంకాలను పరిశీలిస్తే శ్రీలంక జట్టు సాధించిన మొత్తం 465 పరుగుల్లో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే ఏకంగా 300 పరుగులు చేయడం విశేషం. ఇది ఆ జట్టు మొత్తం స్కోరులో దాదాపు 64.5 శాతానికి సమానంగా ఉంది. దీనికి విరుద్ధంగా ఇండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఆడించింది. ఇందులో కుల్దీప్ 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ మాత్రమే పడగొట్టాడు. "గత మ్యాచ్లో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉండటం వల్ల ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ వస్తే భారత స్పిన్ అటాక్లో వైవిధ్యం నమోదవుతుంది. డీఆర్ఎస్ నిబంధనల దృష్ట్యా టెస్ట్ క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్ ఎంతో కీలకం అని చెప్పక తప్పదు" అని మంజ్రేకర్ తన తాజా వీడియోలో వ్యాఖ్యానించాడు.
పడిలేచిన కెరటం కుల్దీప్..
కుల్దీప్ను తప్పించాల్సి రావడం బాధాకరమైన విషయమే అయినా అతడు తన బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవాలని మంజ్రేకర్ పేర్కొన్నాడు. "కుల్దీప్ యాదవ్ జట్టు నుంచి డ్రాప్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది, అతడి కెరీర్లో ఇది తరచుగా ఎదుర్కొంటున్న సమస్య. అయితే గత మ్యాచ్లో తను బౌలింగ్ చేసిన విధానాన్ని కుల్దీప్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గాల్లో బంతి వేగం, ఫ్లైట్ పై వచ్చిన విమర్శల వల్ల అతడు ఫ్లాట్గా, వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. కానీ పిచ్ నుంచి బంతి అనుకున్నంత వేగంగా బ్యాటర్ మీదికి రాకపోవడం మైనస్ గా మారింది. దీని నుంచి అతడు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది" అని వ్యాఖ్యానించాడు.
రెండో టెస్టుకు భారత తుదిజట్టు (అంచనా):
కొలంబో పిచ్ పొడిగా ఉండే అవకాశాలు ఉండటంతో ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భారత ప్రెడిక్టెడ్ లెవన్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉండే చాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో కుల్దీప్ బెంచ్ కే పరిమితమవ్వక తప్పదు.
ట్రెండింగ్ వార్తలు



















