Roja Tamil politics: రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్తారా ..? డీఎంకే తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారు?
Roja: రోజా డీఎంకే తరపున ప్రచార బరిలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Will Roja enter Tamil politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా డీఎంకే తరపున ప్రచార బరిలోకి దిగడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఒకవైపు ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో బీజేపీకి పరోక్ష మద్దతుదారుగా ముద్ర పడగా, రోజా మాత్రం బీజేపీకి బద్ధశత్రువైన డీఎంకే ఇండియా కూటమి తరపున ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.
ఇబ్బందిలో వైసీపీ హైకమాండ్
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , బీజేపీకి వ్యతిరేకంగా ఏ పనీ చేయరన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో, తన పార్టీకి చెందిన ఒక కీలక నేత, పొరుగు రాష్ట్రంలో బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి వ్యతిరేకంగా, డీఎంకే తరపున ప్రచారం చేయడం జగన్కు మింగుడుపడని అంశం. ఇది జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఆందోళన వైసీపీలో ఉంది. అయినప్పటికీ, రోజాను వారించే పరిస్థితిలో ప్రస్తుతానికి పార్టీ నాయకత్వం లేకపోవడం ఆమెకున్న ప్రత్యేకతను చాటుతోంది.
స్టాలిన్ కుటుంబంతో రోజాకు స్నేహ సంబంధాలు
రోజాకు తమిళనాడులో నటిగా ఎంత క్రేజ్ ఉందో, రాజకీయంగా కూడా అక్కడి నేతలతో అంతే బలమైన సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుటుంబంతో ఆమెకు దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో స్టాలిన్ ఇంటి వేడుకల్లో ఆమె చురుగ్గా పాల్గొనడమే కాకుండా, స్టాలిన్ను తన అన్నగా భావిస్తానని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యక్తిగత అనుబంధమే ఇప్పుడు ఆమెను డీఎంకే ప్రచార వేదికల వరకు తీసుకెళ్లింది. ఏపీలో గత ఎన్నికల ఫలితాల తర్వాత రోజా రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ఆమె తమిళనాడు రాజకీయాల్లో స్థిరపడాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో డీఎంకే ద్వారా పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రచారం ఆ దిశగా ఆమె వేస్తున్న మొదటి అడుగుగా చూడవచ్చు.
భాష, ప్రాంతీయతకు ప్రాధాన్యత
రోజా ప్రచారంలో ప్రధానంగా తమిళ ఆత్మగౌరవం అనే నినాదం కనిపిస్తోంది. ద్రావిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే డీఎంకేకు మద్దతు ఇవ్వడం ద్వారా, తాను తమిళ బిడ్డనని అక్కడి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. నిజానికి రోజా చిత్తూరుకు చెందిన వారు. ఆమె భర్త సెల్వమణి తమిళుడు. సినీ దర్శకుడు. అయితే రోజాకు తమిళనాడు ప్రజల్లో గుర్తింపు ఉంది. ఏపీలో వైసీపీ నేతగా ఉన్నా, తమిళనాడులో మాత్రం డీఎంకే వాణిని వినిపించడం ద్వారా రెండు చోట్లా తన ఉనికిని చాటుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇది ఆమెకు వ్యక్తిగతంగా లాభించినా, వైసీపీకి మాత్రం రాజకీయంగా సంకట స్థితిని తెచ్చిపెట్టింది.
కూటమి లెక్కలకు అతీతంగా..
సాధారణంగా ఒక పార్టీలో ఉన్న నేత వేరే కూటమికి ప్రచారం చేయడం క్రమశిక్షణారాహిత్యం కిందికి వస్తుంది. కానీ రోజా విషయంలో వైసీపీ మౌనం వహించడం వెనుక మరేదైనా వ్యూహం ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. లేదా ఆమెకున్న ఫాలోయింగ్ను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతానికి ఆమె వ్యక్తిగత నిర్ణయాలకు జగన్ అడ్డు చెప్పడం లేదని భావించవచ్చు. ఏదేమైనా, ఒకే సమయంలో రెండు విభిన్న భావజాలాలు కలిగిన పార్టీల మధ్య రోజా చేస్తున్న ఈ డ్యూయల్ రూల్ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రోజా డీఎంకే ప్రచారం వెనుక వైసీపీ ప్రయోజనాల కంటే ఆమె వ్యక్తిగత రాజకీయ పునరావాస ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం ఆమెకు తమిళనాడులో కొత్త రాజకీయ ద్వారాలను తెరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















