AP Politics: జగన్ శాశ్వత మిత్రుడన్న వివాదంతో బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు?
Alliance Government: నేరుగా అమిత్ షా పేరు వాడుకుని జగన్కు బీజేపీ శాశ్వత స్నేహితుడని ప్రచారం చేస్తే బీజేపీ నేతలు స్పందించడం లేదు.దీనిపై పవన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మనసులో ఏముంది?

Pawan Kalyan: "బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు" అంటూ ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన విశ్లేషణ తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. అయితే, ఈ వివాదంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బీజేపీ వైఖరి. ఏపీలో కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేనలు విశ్లేషకుడిపై యుద్ధం ప్రకటిస్తుంటే, బీజేపీ మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది. జగన్ విషయంలో తమ వైఖరి ఏంటనేది స్పష్టం చేయకుండా బీజేపీ సైలెంట్గా ఉండటం, కూటమిలోని ఇతర పార్టీలకు మింగుడుపడటం లేదు. అసలు నాగేశ్వర్ వ్యాఖ్యలను బీజేపీ ఎందుకు ఖండించడం లేదు? జగన్ తమకు మిత్రుడు కాదని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతోంది? ఇదే విషయాన్ని నేరుగా పవన్ ప్రశ్నించారు.
పవన్ నిలదీత.. సమాధానం ఎవరి దగ్గర?
మంగళగిరి వేదికగా పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలు నేరుగా బీజేపీ వైఖరిని కూడా తట్టిలేపేలా ఉన్నాయి. ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ఆయన సూటిగానే ప్రశ్నించారు. "మేము ఢిల్లీ వెళ్తే కేవలం జగన్ అరెస్టు గురించే మాట్లాడతామా?" అని పవన్ ప్రశ్నించడం ద్వారా, తాము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పారు. కానీ, వాళ్లు ఆరోపించినట్లు.. బీజేపీ అధిష్టానం నిజంగానే వైసీపీ పట్ల మెతక వైఖరితో ఉందా? అనే అనుమానం సామాన్య ప్రజల్లో కూడా మొదలైంది. పవన్ అడిగిన ప్రశ్నలకు రాజకీయంగా విలువున్నా, దానికి అసలైన సమాధానం చెప్పాల్సింది మాత్రం బీజేపీ నాయకత్వమే. అయితే, వారు నోరు మెదపకపోవడం పవన్ వంటి మిత్రపక్ష నేతలను ఆత్మరక్షణలో పడేస్తోంది.
మురళీధర్ రావు ట్విస్ట్.. కూటమిలో చిచ్చు?
ఏపీ బీజేపీ నేతలు మౌనంగా ఉంటే, తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత మురళీధర్ రావు ఏకంగా నాగేశ్వర్ను సమర్థించడం కూటమిలో కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం నాగేశ్వర్ వ్యక్తిగత గౌరవం గురించిన విషయమా లేక బీజేపీ అంతర్గతంగా వైసీపీకి అనుకూలంగా ఉందనే సంకేతమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేనలతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ, తెలంగాణకు వచ్చేసరికి భిన్నమైన గొంతు వినిపించడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. నాగేశ్వర్పై కేసులు పెట్టడాన్ని తప్పుబట్టడం ద్వారా, ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెబుతోంది.
తెలంగాణ వర్సెస్ ఏపీ.. ప్రాంతీయ చిచ్చు
ఈ వివాదాన్ని తెలంగాణ 'ప్రైడ్' ఇష్యూగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. నాగేశ్వర్ వంటి మేధావిపై ఏపీ పోలీసులు కేసు పెట్టడాన్ని తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా ఇక్కడి నేతలు అభివర్ణిస్తున్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారి, రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉంది. నాగేశ్వర్ను అరెస్టు చేస్తారనే ప్రచారం తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ అదే జరిగితే, తెలంగాణలో ఉన్న ఏపీ వ్యతిరేక శక్తులకు అది పెద్ద ఆయుధంగా మారుతుంది. విశ్లేషణలో నిజముందో లేదో పక్కన పెడితే, ఇంత తీవ్రంగా స్పందించడం వల్ల "జగన్-బీజేపీ రహస్య స్నేహం" అనే వార్తకు ప్రభుత్వం తానే స్వయంగా ప్రాచుర్యం కల్పించినట్లయింది.
చివరికి తేలేదేమిటంటే.. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏపీ పోలీసుల దగ్గరో లేక కోర్టుల దగ్గరో లేదు, అది కేవలం బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరే ఉంది. జగన్ తమకు మిత్రుడు కాదని వారు బహిరంగంగా ప్రకటించే వరకు నాగేశ్వర్ వంటి విశ్లేషకులు చేసే వ్యాఖ్యలకు బలం చేకూరుతూనే ఉంటుంది. ఈ గ్యాప్ను భర్తీ చేయడంలో బీజేపీ విఫలమైతే, అది కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల ప్రతిష్టకు తీరని నష్టం కలిగిస్తుందని అనుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















