Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న రాజకీయ శైలిలో వస్తున్న మార్పులను స్వయంగా విశ్లేషించుకుంటున్నారు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో రాజకీయాలు చేస్తానని అంటున్నారు.

Revanth Reddy New Strategy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అంటేనే గళం, బలం. ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన ప్రసంగాలు ఎంత ఆవేశంగా ఉండేవో అందరికీ తెలిసిందే. సీఎం అయిన తర్వాత కూడా కేసీఆర్, కేటీఆర్ మాటలకు అంతే ఘాటుగా బదులిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మాటల్లో మార్పు కనిపిస్తోంది. రాజకీయ ఉపన్యాసాల్లో ఆవేశంగా ఉండే నా పనితీరు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక మారింది" అని ఆయన చేసిన వ్యాఖ్యలు మార్పు ను సూచిస్తున్నాయి. పీసీసీ బాధ్యత వేరు, రాష్ట్రాన్ని పాలించే బాధ్యత వేరని.. పదవి ఇచ్చే హుందాతనం తన శైలిని మార్చుకునేలా చేసిందని ఆయన పరోక్షంగా అంగీకరించారు.
హుందా అయిన రాజకీయాలకే ప్రాధాన్యం
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నా పనితీరులో మార్పులు చేసుకున్నాను అని చెప్పడం ద్వారా, వ్యక్తిగత రాజకీయాల కంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు ఒక గ్రోత్ ఇంజిన్ అని భావిస్తున్న రేవంత్, తనలో ఏదో చేసి చూపించాలన్న తపనను బహిరంగంగానే చాటుకున్నారు. ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును లూటిఫికేషన్ అని విమర్శిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఆవేశపడకుండా అంతే హుందాగా సమాధానమిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించడం ఆయన నాయకత్వ లక్షణాల్లోని మార్పును సూచిస్తోంది.
మాటతీరుపై ఆత్మవిమర్శ
గతంలో కేసీఆర్, కేటీఆర్ వంటి రాజకీయ ప్రత్యర్థులపై ఆయన వాడిన ఘాటు భాష పలుమార్లు వివాదాస్పదమైంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అంతటి కఠిన పదజాలం వాడటం సమంజసం కాదన్న విమర్శలు మేధావుల నుంచి, రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ కారణంగా ఆవేశం కంటే బాధ్యత ముఖ్యం అని గుర్తించిన రేవంత్, తన భాషకు స్వస్తి పలికి అభివృద్ధి మంత్రం పఠించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.రాజకీయాల్లో ప్రతిచర్య అనేది సహజం. రేవంత్ రెడ్డి గతంలో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినప్పుడు, బీఆర్ఎస్ నేతలు కూడా అంతకు మించి అన్నట్లుగా ప్రతిదాడి చేసేవారు. ఈ పరస్పర దూషణల వల్ల అసలు ప్రజా సమస్యలు పక్కకు వెళ్లి, వ్యక్తిగత విమర్శలే హైలైట్ అయ్యేవి. ఇప్పుడు రేవంత్ తన భాషను మార్చుకోవడం ద్వారా, బీఆర్ఎస్ నేతలకు ఆ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. తను మౌనంగా ఉండి పని చేసి చూపిస్తే, ప్రతిపక్షాలు చేసే విమర్శలు అర్థరహితంగా మారుతాయని ఆయన వ్యూహంగా ఉంది.
నిర్మాణాత్మక రాజకీయాలకు ఆహ్వానం
మూసీ పునరుజ్జీవనం వంటి భారీ ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. కేవలం పట్టుదలకు పోకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే తీసుకుంటాను అని ప్రకటించడం ద్వారా అందరినీ కలుపుకుని పోయే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన హుందాతనాన్ని కాపాడుతూనే, వివాదాలకు దూరంగా ఉండి ఫలితాలు సాధించాలన్న తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత హోదా కాదు, అది ఒక బాధ్యత అని రేవంత్ భావిస్తున్నారు. మూసీ ప్రక్షాళన వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కేవలం రాజకీయాలు సరిపోవని, అందరి మద్దతు అవసరమని ఆయన గుర్తించారు.
రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్న ఈ సానుకూల మార్పు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని చల్లబరిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి తన భాషను నియంత్రించుకోవడం వల్ల, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు దారితీస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇదే శైలిని కొనసాగిస్తే, ప్రత్యర్థులు కూడా విమర్శల స్థాయిని తగ్గించక తప్పదు. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలకే మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.























