Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
Austerity Measures: ప్రదాని మోదీ సెవన్ అప్పీల్స్ పై జరుగుతున్న ప్రచారం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దేశం మరో ఆర్థిక లాక్డౌన్ వైపు వెళ్తోందని అంటున్నారు. ఇది నిజమేనా?

PM modi austerity measures vs lockdown rumors: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన పొదుపు విన్నపం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ప్రధాని మాటలను వక్రీకరిస్తూ దేశం మరో ఆర్థిక లాక్డౌన్ వైపు వెళ్తోందని, అందుకే నిర్మాణ పనులు ఆపేయాలని, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించారని జరుగుతున్న ప్రచారం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇది ప్రజలను భయపెట్టడానికి కాదు, ముంచుకొస్తున్న అంతర్జాతీయ ఆర్థిక ముప్పును ఎదుర్కోవడానికి చేస్తున్న ముందస్తు అప్రమత్తత మాత్రమే.
నిర్మాణాల నిలిపివేత.. అసత్యం
నీతి ఆయోగ్ ప్రతిపాదించినట్లుగా ప్రచారం రెండేళ్ల పాటు నిర్మాణాల నిలిపివేత అవాస్తవం. ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల ఇనుము, సిమెంట్, చమురు ధరలు పెరగడం వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెరుగుతోందని.. ఈ తరుణంలో ప్రభుత్వ నిధులను వృధా చేయకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి వేచి చూడడం అనే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరించేందుకు నిర్మాణాలు ఆపేసిందని ప్రచారం చేస్తున్నారు. దీనిని కొందరు నిర్మాణ రంగ సంక్షోభం గా అభివర్ణిస్తున్నప్పటికీ నీతి ఆయోగ్ మాత్రం అలాంటి సిఫారసు చేయలేదని స్పష్టం చేసింది.
పానిక్ ఎందుకు ?
సోషల్ మీడియాలో మరో లాక్డౌన్ అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక వాస్తవం కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది. కోవిడ్ కాలంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్ల, ప్రధాని ఏ చిన్న సూచన చేసినా ప్రజలు దానిని లాక్డౌన్తో ముడిపెడుతున్నారు. జాగ్రత్త పడాలని ప్రధాని కోరడం అంటే.. ఇంధనాన్ని ఆదా చేయడం, విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించడం ద్వారా దేశ రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం. కానీ, దీనిని అత్యవసర పరిస్థితి గా చిత్రీకరించడం వల్ల మార్కెట్లలో అనవసరమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 95కు చేరుకోవడం ఆందోళనకరమైన విషయమే. రూపాయి విలువ పడిపోతే దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఈ గొలుసుకట్టు ప్రభావాన్ని తగ్గించడానికే.. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. ఇది దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఇచ్చే ముందస్తు మందు వంటిదే తప్ప, వ్యవస్థను స్తంభింపజేయడం కాదని అంటున్నారు.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు..కానీ లాక్ డౌన్ కాదు!
ప్రభుత్వం ఆర్థిక పొదుపు దిశగా వెళ్తోంది. అంటే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడం. ఆన్లైన్ తరగతుల ప్రతిపాదన వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉంది—రవాణా ఖర్చులను తగ్గించడం. ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వం వైఫల్యంగా చిత్రీకరిస్తుండగా, ఆర్థికవేత్తలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వల్ల భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండటం అవసరం. ప్రధాని సూచనలు సంక్షోభ నివారణ కోసమే తప్ప, సంక్షోభ సృష్టి కోసం కాదని అర్థం చేసుకోవాలంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















