DMK Exits INDIA Alliance 2026: ఇండియా కూటమి ఉన్నా లేనట్లే - రాహులే బలహీనపరుస్తున్నారా? డీఎంకే ఆరోపణల్లో నిజం ఉందా?
Opposition Unity Collapse: ఎన్డీఏను ఢీకొట్టాలనుకుంటున్న ఇండీ కూటమి రాను రాను బలహీనం అవుతోంది. ఆపరేషన్ కమల్ దెబ్బకు చాలా పార్టీలు బలహీనం అవుతూంటే ఉన్న పార్టీలు కాంగ్రెస్కు నమస్కారం పెట్టేస్తున్నాయి.

DMK Vs Congress: జాతీయ రాజకీయాల్లో విపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచిన ఇండియా కూటమి పునాదులు ఒక్కసారిగా కదిలిపోయాయి. కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యంత నమ్మకమైన, బలమైన భాగస్వామిగా ఉన్న తమిళనాడు అధికార పార్టీ డీఎం ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కూటమి నుంచి బయటకు వచ్చేయడం దేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించింది. రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ జోక్ అని, ఆయన కూటమిని బలోపేతం చేసే బదులు స్వార్థ రాజకీయాలతో వెన్నుపోటు పొడుస్తూ బలహీనం చేస్తున్నారని డీఎంకే అధికార పత్రిక మురసోలి లో నేరుగా ధ్వజమెత్తడం విపక్షాల ఐక్యత ఎంత డొల్లగా మారిందో స్పష్టం చేస్తోంది.
డీఎంకే ఆగ్రహం.. రాహుల్పై వెన్నుపోటు ముద్ర!
తమిళనాడులో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ మిత్రబంధం ఒక్కసారిగా తెగిపోవడానికి కాంగ్రెస్ తీసుకున్న తాజా నిర్ణయమే కారణం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన వేళ.. కాంగ్రెస్ తన పాత మిత్రపక్షమైన డీఎంకేకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, పదవుల కోసం విజయ్ పార్టీతో జతకట్టడం స్టాలిన్ నెరవేర్చిన నమ్మకద్రోహంగా డీఎంకే భావించింది. తమ రాజకీయ మనుగడ కష్టాల్లో ఉన్నప్పుడు భుజాల మీద మోసిన డీఎంకేను, కొత్త బొమ్మ కనిపించగానే కాంగ్రెస్ కాలదన్నిందని, ఈ వ్యవహారమంతా రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే జరిగిందని డీఎంకే ఐటీ వింగ్ తీవ్రస్థాయిలో మండిపడింది.
కేరళలో పొసగని బంధం.. కమ్యూనిస్టుల అసంతృప్తి!
కూటమిలో కాంగ్రెస్ తర్వాత ఉనికి ఉన్న మరో ప్రధాన భాగస్వామి కమ్యూనిస్టులు . కేరళలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) ప్రధాన ప్రత్యర్థులు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి సమావేశాల్లో రాహుల్ గాంధీ ఐక్యత గురించి ఉపన్యాసాలు ఇస్తూ.. క్షేత్రస్థాయిలో కేరళకు వచ్చేసరికి లెఫ్ట్ పార్టీలకు, బీజేపీకి చీకటి ఒప్పందం ఉందంటూ ఆరోపణలు చేయడంపై కమ్యూనిస్ట్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, విపక్షాల ఐక్యతను దెబ్బతీస్తున్నది ఆయనేనని సీపీఎం ఎంపీ కూటమి సమావేశంలోనే ముఖాముఖి నిలదీయడం కాంగ్రెస్ ద్వంద్వ విధానాన్ని ఎండగట్టింది.
ఆప్ దూరం.. ఒంటరైన కాంగ్రెస్!
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్తో నిరంతరం తలపడే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఇండియా కూటమికి గుడ్బై చెప్పేసింది. పంజాబ్ స్థానిక సమీకరణాలు, సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ అహంకార వైఖరి నచ్చకే కేజ్రీవాల్ తప్పుకున్నారు. ఇప్పుడు డీఎంకే కూడా విడిపోవడంతో కూటమిలో ప్రాంతీయంగా పట్టున్న పెద్ద పార్టీలన్నీ ఖాళీ అయిపోయాయి. రాహుల్ గాంధీ జాతీయ ముఖచిత్రంగా ప్రదర్శించుకోవడానికి ప్రాంతీయ పార్టీలను వాడుకుంటున్నారే తప్ప, రాష్ట్రాల్లో వాటి ఉనికిని గౌరవించడం లేదన్న విమర్శలకు ఈ పరిణామాలు బలమిస్తున్నాయి.
సమాజ్ వాదీ అప్రమత్తత.. యూపీయే అసలు లక్ష్యం!
ప్రస్తుతానికి కూటమిలో మిగిలి ఉన్న ఏకైక పెద్ద మిత్రపక్ష పార్టీ ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్ వాదీ పార్టీ . అఖిలేష్ యాదవ్ డీఎంకే, ఆప్ వైదొలగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అఖిలేష్ కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నది కేవలం యూపీలో ముస్లిం, యాదవ్ ఓటు బ్యాంక్ చెల్లాచెదురు కాకుండా చూసుకోవడానికే. రేపు యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సీట్ల పంపిణీలో కాంగ్రెస్ గనుక ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తే.. అఖిలేష్ కూడా కాంగ్రెస్కు హ్యాండ్ ఇవ్వడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా విశ్లేషణలు వస్తున్నాయి.
ఉన్నా లేనట్లే కూటమి!
ఇండియా కూటమి వైఫల్యానికి ప్రధాన కారణం స్పష్టమైన అజెండా మరియు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టే వ్యూహాలు రచించడంలో విఫలమవడమే కాకుండా.. ఉన్న మిత్రపక్షాలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. ప్రాంతీయ శక్తులను కలుపుకొని పోయే పెద్దన్న పాత్రను పోషించాల్సిన కాంగ్రెస్, స్వల్పకాలిక రాజకీయ లాభాల కోసం మిత్రపక్షాల వెన్నుపోటు పొడవడంతో ఇండియా కూటమి కేవలం కాగితాలకే పరిమితమై ఉన్నా లేనట్లు తయారైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















