TPCC Showcause Notice: టీ కాంగ్రెస్లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
TPCC Discipline Controversy: తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు నోటీసుల రచ్చ నడుస్తోంది. వివాదాస్పద కామెంట్లు చేసిన వారికి షోకాజ్ నోటీసులిస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డిని మాత్రం వదిలేస్తున్నారు.

TPCC Disciplinary Committee Mallu Ravi Action: తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్లో క్రమశిక్షణ అనే పదానికి కొత్త నిర్వచనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి చిన్నారెడ్డి , కొండా సురేఖ వంటి వారికి వరుసగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా పరకాల నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సవాలు చేస్తూ విమర్శలు గుప్పించారన్న కారణంగా నేరుగా సురేఖకు నోటీసు ఇవ్వడం గాంధీ భవన్లో హాట్ టాపిక్గా మారింది. అయితే తన కుమార్తె వ్యాఖ్యలతో తనకేం సంబంధం లేదని కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. ఇదే పార్టీలో బహిరంగంగా ప్రభుత్వంపై, అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఎలాంటి నోటీసూ ఇవ్వకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.
మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి రెబలిజం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తన అసంతృప్తిని, విమర్శలను బహిరంగంగానే వెళ్లగక్కారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశాల్లో రాజగోపాల్ రెడ్డి అంశం ప్రస్తావనకు వచ్చినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు మా దృష్టికి రాలేదు అని దాటవేసిన కమిటీ పెద్దలు.. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ విషయంలో మాత్రం అత్యంత వేగంగా స్పందించి నోటీసులు పంపడం వెనుక పెద్ద రాజకీయ కోణమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అసమ్మతి స్వరాన్ని చూసి మిగతా నేతలు కూడా అదే దారిలోకి వెళుతున్నారనేది నిజమే అయినప్పటికీ, ఆయనను పక్కనపెట్టి కేవలం కొండా సురేఖ, చిన్నారెడ్డి వంటి వారికి మాత్రమే నోటీసులు జారీ చేశారు.
నోటీసుల్ని సీరియస్గా తీసుకునే రాజకీయం లేదు!
ఈ షోకాజ్ నోటీసుల పట్ల నాయకుల్లో ఏమాత్రం భయం లేకపోవడం తెలంగాణ కాంగ్రెస్లోని అసలు పరిస్థితికి అద్దం పడుతోంది. కొండా సురేఖ క్యాంప్ కూడా ఈ నోటీసుకు అత్యంత ఘాటుగా, వ్యూహాత్మకంగా రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఏంటని, ఒకవేళ ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తే వెంకటరెడ్డి సోదరుడైన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా నోటీసులు ఇస్తారా అని సురేఖ వర్గీయులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. పార్టీలో బిసి నేతలను టార్గెట్ చేస్తున్నారనే భావనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పరిణామాన్ని వారు సాధనంగా మార్చుకుంటున్నారు. గాంధీ భవన్ నుంచి జారీ అవుతున్న ఈ షోకాజ్ నోటీసుల వల్ల పార్టీలో క్రమశిక్షణ పెరగకపోగా, నాయకుల మధ్య అంతరం మరింత పెరుగుతోంది. నోటీసులు ఇచ్చే పెద్దలకు కూడా వీటి వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు ఉండదని, ఎవరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం అధిష్టానానికి లేదని బాగా తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇలాంటి అరకొర చర్యల వల్ల వర్గపోరు మరింత ముదిరి పాకాన పడే ప్రమాదం ఉంది.
అంతర్గత ప్రజాస్వామ్యం అంటే క్రమశిక్షణ లేకపోవడమా?
గాంధీ భవన్ కల్చర్లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటేనే క్రమశిక్షణారాహిత్యం అని అనుకోవడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తి కొండా మురళి, సురేఖ దంపతులతో పాటు వరంగల్, ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల్లో వ్యక్తమవుతుండగా, దానికి విరుగుడు కనిపెట్టకుండా కేవలం నోటీసుల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయడం తుస్సుమంటోంది. డబుల్ స్టాండర్డ్స్ పద్ధతిని స్వయంగా సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సరిదిద్దకపోతే.. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో సాగే ఈ రచ్చ కాంగ్రెస్ గ్రాఫ్ను మరింత దిగజార్చడం ఖాయమని కాంగ్రెస్ క్యాడర్ గొణుక్కుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















