Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Mamata Banerjee : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయంపై మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు. విజయం కోసం ఆమె పక్కా వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.

Mamata Banerjee confident of another victory in Bengal Assembly elections: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం దీదీ వర్సెస్ మోదీ అన్నట్లుగా మరోసారి రసవత్తరంగా మారాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రదర్శిస్తున్న ధీమా వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు, సెంటిమెంట్లు ఉన్నాయి.
బెంగాల్ కా భేటీ సెంటిమెంట్
మమతా బెనర్జీ ప్రధాన బలం ఆమెను బెంగాలీ ప్రజలు తమ ఇంట్లో మనిషిగా భావించడం. బెంగాల్ తన కూతురినే కోరుకుంటుంది అనే నినాదం గతంలో ఆమెకు అఖండ విజయాన్ని అందించింది. ఇప్పుడు కూడా ఆమె అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే నేతలను బయటి వ్యక్తులు గా చిత్రీకరించడంలో ఆమె సఫలమయ్యారు. బెంగాలీ అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడగలిగేది కేవలం తనేనని ప్రజలు నమ్ముతారని ఆమె బలంగా విశ్వసిస్తున్నారు.
సంక్షేమ పథకాల రక్షణ కవచం
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష్మీర్ భండార్ అంటే మహిళలకు ఆర్థిక సాయం , దువారే సర్కార్ అంటే గడప వద్దకే ప్రభుత్వం, కన్యాశ్' వంటి పథకాలు గ్రామీణ బెంగాల్లో ఆమెకు తిరుగులేని ఓటు బ్యాంకును సృష్టించాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లు మమతకు పెద్ద అండగా నిలుస్తున్నారు. కేంద్రం నిధులు ఆపేసినా, రాష్ట్ర నిధులతోనే పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పడం ద్వారా ఆమె ప్రజల్లో సానుభూతిని పొందగలుగుతున్నారు.
ఓటర్ల జాబితా సవరణపై పోరాటం
ఇటీవల బెంగాల్లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పై మమత తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్షలాది మంది ఓటర్ల పేర్లను బీజేపీ-ఎన్నికల కమిషన్ కుమ్మక్కై తొలగించాయని ఆమె ఆరోపిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించినా, ఒక్క ఓటు మిగిలినా నేనే గెలుస్తాను అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ అంశాన్ని ఆమె ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుని, బెంగాలీ హక్కుల కోసం పోరాడుతున్న యోధురాలిగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
బలహీనమైన ప్రతిపక్షం , మైనారిటీ ఓటు బ్యాంకు
రాష్ట్రంలో లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు బలహీనపడటం మమతకు అతిపెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు, సుమారు 27-30 శాతం ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా తనవైపే ఉందని ఆమె భావిస్తున్నారు. ఎన్ఆర్సీ , సీఏఏ వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా మైనారిటీల్లో ఉన్న అభద్రతా భావాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో ఆమె సిద్ధహస్తురాలు. బీజేపీ ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ, ఆ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, పాత నేతలకు - వలస వచ్చిన నేతలకు మధ్య ఉన్న అగాధం మమతకు కలిసి వస్తోంది. 2021 ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు మళ్లీ టీఎంసీలోకి చేరడం ఆమె పట్టును నిరూపించింది. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న పరివర్తన్ యాత్ర లను ఆమె అంతిమ యాత్రలు గా అభివర్ణిస్తూ, బీజేపీకి బెంగాల్లో స్థానం లేదని ఎద్దేవా చేస్తున్నారు.























