Family Politics: రాజకీయ గీత దాటి రాలేకపోతున్న రక్త సంబంధం- రాఖీతో విభేదాలు బహిర్గతం
Rakhi Political Brothers And Sisters : రాజకీయ కారణాలతో కుటుంబ అనుబంధాలను కూడా నేతలు దూరం చేసుకుంటున్నారు. అనుబంధాలు, ఆత్మీయలతో జరుపుకున్న రాఖీ పండుగల నాడు అన్నా, చెల్లెళ్లు ముఖం కూడా చూసుకోవడం లేదు.

Family Rift for political reasons: రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు లేవు. బయట రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకుని ఎదుట పడితే కొట్టుకుంటారేమో అన్నట్లుగా మీడియా ఎదుట ప్రవర్తించే నేతలు.. ఎప్పుడైనా ఎదురుపడితే.. తమ కంటే ఆత్మీయులు, ప్రాణ స్నేహితులు ఎవరూ లేరన్నట్లుగా వ్యవహరిస్తూంటారు. అలాగే కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. తమ వ్యక్తిగత సంబంధాలను మాత్రం వదులుకోరు. కుటుంబాన్ని ఐక్యంగానే ఉంచుకుంటారు. శనివారమే నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి రక్షా బంధన్ జరుపుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలకృష్ణ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటే.. పురందేశ్వరి బీజేపీలో ఎంపీగా ఉన్నారు. అయితే కొంత మంది రాజకీయ నేతలు మాత్రం ఈ గీతను చెరిపేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో రాజకీయాలను కలిపేసుకుని తమకు వ్యతిరేకిస్తున్న కుటుంబసభ్యులను దూరం చేసుకున్నారు.
జగన్, షర్మిల మధ్య తెగిపోయిన కుటుంబ బంధాలు
వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల రెండు తెలుగురాష్ట్రాల్లో మూడు వేల కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేశారు. అయితే ఆమెకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ విషయంపై షర్మిల కుటుంబంలో ఎప్పుడైనా ప్రశ్నించారో లేదో తెలియదు కానీ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. జగన్ అన్నకు ఇబ్బంది లేకుండా తెలంగాణ లో పార్టీ పెట్టుకున్నారు. అయితే జగన్ తో ఆస్తుల వివాదం రావడంతో ఏపీలో రాజకీయాలు ప్రారంభించారు. తనపైనే రాజకీయాలు చేస్తుందా అన్న కోపంతో జగన్ ఆమెతో మాట్లాడటం మానేశారు. ఎంతగా అంటే.. చివరికి షర్మిల కుమారుడు.. అంటే మేనల్లుడు పెళ్లికి కూడా జగన్ వెళ్లలేదు. ఎప్పుడైనా ఇంటికి పిలిచి కొత్తబట్టలు పెట్టడం సంప్రదాయాలను కూడా పాటించలేదు. ఇద్దరి మధ్య ముఖాలు కూడా చూసుకోనంత దూరం పెరిగింది. గతంలో రాఖీ పండుగ వద్ద అన్నా, చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని వైసీపీకి చెందిన నేతలు, మీడియా హైలెట్ చేసేది. ఇప్పుడు షర్మిల ప్రస్తావన కూడా రావడం లేదు. రాజకీయం పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల.. వారి మధ్య దూరం పెరిగింది.
కేటీఆర్, కవిత మధ్య పెరిగిన దూరం
తెలంగాణలో మరో కీలకమైన పార్టీ అయిన బీఆర్ఎస్ వారసులు అయిన కేటీఆర్, కవిత మధ్య కూడా ఇటీవలి కాలంలో పొసగడం లేదు. వ్యక్తిగత సంబంధాలు బాగుండాలి. కానీ రాజకీయంగా కవిత తీసుకున్న నిర్ణయంతో కేటీఆర్ .. కవిత విషయంలో అంత సానుకూలంగా లేరు. ఇటీవల కేటీఆర్ పుట్టిన రోజు నాడు కవిత సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అన్నా అని ఆప్యాయంగా ట్వీట్ పెట్టారు. కానీ కేటీఆర్ నుంచి రిప్లయ్ లేదు. కానీ కవిత కుటుంబ పరంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కానీ రాజకీయంగా మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అందుకే కేటీఆర్ దూరం పెట్టారు. రాఖీ పండుగ రోజు.. కవిత వచ్చి రాఖీ కడతారేమో అన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కూడా వ్యక్తిగత , కుటుంబ అంశాలకు రాజకీయాన్ని కలుపుకోవడంతో గ్యాప్ వచ్చేసింది.
కుటుంబాలు కలిసి ఉంటేనే బలం!
ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాల ఆధిపత్యం ఉంటుంది. ఆ కుటుంబాల్లో విబేధాలు వస్తే పార్టీలపైనే ప్రభావం పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్, వైసీపీల మధ్య అదే సారూప్యత కనిపిస్తోంది. ఆ పార్టీలో ఇద్దరు కీలక నేతలు చెల్లెళ్లను దూరం పెట్టడం వల్ల గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ అధినేతకు పోటీగా షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్నారు. కవిత కూడా రేపోమాపో సొంత పార్టీ పెట్టుకోబోతున్నారు. అప్పుడు మరింతగా వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.





















