News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Cabinet Equations : సామాజిక సమీకరణాలు కలిసొచ్చిన వారే మినిస్టర్స్ ! అదృష్టవంతులు వీళ్లేనా ?

సామాజిక సమీకరణాలను చూసుకుని మంత్రుల్ని ఖరారు చేసుకుంటున్నారు సీఎం జగన్. అందుకే సీనియర్లకు చాన్స్ దక్కడం కష్టంగా మారింది. అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికీ పెద్దపీట వేయడం లేదు.

FOLLOW US: 
Share:


ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరబోతోంది. మూడేళ్లు తర్వాత దీనికి ముహూర్తం కుదిరింది. బుధవారమే రాజీనామాలు. 11 వతేదీ కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం అని చెబుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా మంత్రివర్గ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మార్చేస్తున్నారంటూ జరిగిన హడావిడి చూశాం.. అసలు మార్చడం లేదంటూ.. వచ్చిన వ్యాఖ్యలను విన్నాం..  మొత్తానికి కిందటి కేబినెట్ మీటింగ్ లోనే .. ముఖ్యమంత్రి జగన్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. సో.. ఇక ఇది ఖాయం. 

ఇన్ అండ్ అవుట్ ఎవరెవరు ? 

అయితే ఉండేది ఎవరు.. ?  బయటకు  వెళ్లేది ఎవరు..? ఇది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్. ఎన్నికల రిజల్ట్ కంటే ఎక్కువ టెన్షన్ కనిపిస్తోంది ఇప్పుడు. దాదాపు మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తున్నారనే ప్రచారం జరిగింది.  అయితే.. కొన్ని రకాల సామాజిక సమీకరణాలు..  బాలెన్స్‌లతో..  మొత్తం బ్యాచ్ ను మార్చేందుకు సాధ్యం కావడం లేదన్నది తాజా సమాచారం.  జగన్ ప్రస్తుత మంత్రివర్గంలో బొత్స , పెద్దిరెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వాళ్లకు రాజకీయ అనుభవం తక్కువ. ఐదుగురు ఉపముఖ్యమంత్రులున్నా.. వాళ్లు పేరుకే అన్న విషయం కూడా అనేక సందర్భాల్లో తేలిపోయింది. కాబట్టి.. కీలకమైన బాధ్యతల్లో ఉన్నఒకరిద్దరు... సీనియర్ నాయకులను కొనసాగిస్తారని అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వారితో పర్సనల్ గా మాట్లాడి అలాంటి అవకాశం ఉండదు అని చెప్పారని.. ఆల్టర్నేటివ్ లేకపోతే తప్ప.. అంతా మార్చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పినట్లు సమాచారం.. అయితే ఇది అంత  తేలిక వ్యవహారంలా కనిపించడం లేదు. ఎందుకంటే.. జగన్ మొదటి మంత్రి వర్గమే.. అంచనాలకు భిన్నంగా ఏర్పాటైంది. సామాజిక సమతూకానికి.. ఆయన అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 

కులాల వారీ సమతూకం పాటించాలనేది జగన్ పాలసీ !

ప్రతిపక్షానికి బలంగా నిలిచే కొన్ని వర్గాలు తనకు మద్దతు ఇవ్వడం వల్లే తాను గెలిచానని బలంగా విశ్వసిస్తున్న జగన్.. మంత్రివర్గంలో ఆయా వర్గాలకు.. ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పడూ అది కచ్చితంగా చేసి తీరడానికే సిద్ధమయ్యారు. సోషల్ ఇంజనీరింగ్ లో కింగ్ అయిన ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు.. కిందటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఆ ప్రత్యేకత కనిపించింది. లేకపోతే... రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా బలంగా ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మంత్రులుగా బీసీలకు చాన్సిచ్చారు.  ఎంతో కాలంగా తన పార్టీకి, కుటుంబానికి మద్దతు ఇస్తున్న కుటుంబాలను కూడా పక్కనపెట్టి.. మరీ.. ఆ జిల్లాల్లో జగన్ సీట్లను కురబ, బోయ సామాజిక వర్గాలకు ఇచ్చారు. అది వర్కవుట్ అయింది కూడా..  ఆ రెండు కులాలతో పాటు..గోదావరి జిల్లాల్లో టీడీపీ వెంట నిలిచే శెట్టి బలిజ సామాజిక వర్గం కూడా జగన్ కు బాగానే ప్లస్ అయింది. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన బోస్ ఓడిపోయినా సరే ఆయన్ను మంత్రిని చేశారు. 

అండగా నిలిచిన  బీసీ కులాలకు పదవులు !
  
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా సీఎం ఆ విషయాన్ని గుర్తుంచుకుని.. జెడ్పీ, కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ప్రయోగాలు చేశారు. వీటికి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకూ.. ప్రాధాన్యం దక్కని కొన్ని కులాలను ఎంపిక చేశారు. వైజాగ్, విజయవాడ లాంటి చోట్ల మేయర్ స్థానాల్లో అయితే.. వాళ్లు మేయర్లు అవుతున్నారన్న విషయం చివరి నిమిషం స్వయంగా వాళ్లకే తెలియదు. పార్టీలోనూ... సీనియర్లు ఈ విషయంపై విస్తుపోయారు. ఎందుకంటే.. జగన్ ఆ ఈక్వేషన్లపై అంత పర్టిక్యులర్ గా ఉన్నారు. బోయ సామాజికవర్గానికి అనంతపురం ఎంపీ, కర్నూలు జిల్లా నుంచి మంత్రి, అనంతపురం జెడ్పీ పదవులుఇచ్చారు. శెట్టి బలిజకు రాజమండ్రి ఎంపీ, రాజ్య సభ చాన్సులిచ్చారు.  గౌడ కు క్రిష్ణా లో ఎమ్మెల్యే, జెడ్పీ  పదవులతో పాటు , చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చారు. కురబ కు హిందూపూర్ ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చారు.  అంటే పక్కాగా కులాల లెక్కలు సరి చూసుకున్న తర్వాతే ఇచ్చారన్నమాట. 

కొత్త మంత్రివర్గంలోనూ అవే కుల సమీకరణాలు !

ఇప్పుడు మంత్రివర్గంలోనూ అదే జరగనుంది. ఇన్ని లెక్కలు.. ఈక్వేషన్ల తర్వాత.. కొందరు మంత్రులు కచ్చితంగా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.   శ్రీకాకుళం జిల్లాలో ఇంకో ధర్మాన కుటుంబానికే మంత్రిపదవి రానుంది. అన్న కృష్ణదాస్ బదులు తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకు దాదాపు ఖాయం అయినట్లే.. అయితే ఈ జిల్లాలో సామాజిక బాలెన్స్ కోసం..స్పీకర్ తమ్మినేనిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. ధర్మాన చాలా సీనియర్.. రాజకీయ చతురత ఉన్న వ్యక్తి. కృష్ణదాస్ వేరు.. ధర్మాన ప్రసాదరావు వేరు. పైగా ఆ జిల్లాలో కొప్పుల వెలమ కమ్యూనిటీ... ఎక్కువుగా టీడీపీ వైపు ఉంది. అచ్చె కుటుంబం వారే. మొదటి నుంచి.. .కాంగ్రెస్.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ కు మద్దతునిస్తున్న కాళింగలు రాజకీయ ప్రాధాన్యం దక్కాలంటే.. తమ్మినేనికి చాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు ను తప్పించి .. ఆ  కమ్యూనిటీ కోటాలో.. తూర్పుగోదావరికి చెందిన పొన్నాడ సతీష్ కు అవకాశం వస్తుందంటున్నారు. 

బొత్సకే ఇవ్వాలంటున్న విజయనగరం ఎమ్మెల్యేలు ! 

ఇక విజయనగరంలో విచిత్రమైన పరిస్థితి. బొత్సను కాదని..మంత్రిపదవి తీసుకోవడానికి కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు. ఈ జిల్లాలో తూర్పుకాపుల ప్రభావం ఎక్కువ. కచ్చితంగా వారికి మంత్రిపదవి ఇవ్వాల్సిందే. అలా ఇవ్వాలంటే.. బొత్స కాకుండా.. బొత్స కుటుంబానికే చెందిన గజపతి నగరం ఎమ్మెల్యే అప్పల నర్సయ్య, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు ఉన్నారు. వాళ్లు ఇద్దరూ కూడా బొత్సనే కొనసాగించమని నేరుగా సీఎంకే చెప్పారు. కానీ.. ఏం జరుగుతుందో చూడాలి. డిప్యూటీ సీఎం పుష్ప  శ్రీవాణి స్థానంలో పాలకొండ ఎమ్మెల్యే  కళావతికి అవకాశం ఉంది. ఇక విశాఖలో అవంతీ స్థానంలో మరో కాపు వర్గానికి ఇవ్వాల్సి ఉంటే.. గుడివాడ అమరనాథ్ కు చాన్సులు ఎక్కువ. అలా కాకుండా పార్టీలో సీనియర్లుగా చూసుకుంటే.. గొల్ల బాబూరావు, బూడి ముత్యాలనాయుడు కు అవకాశం దక్కొచ్చు. ఏదైనా విశాఖ జిల్లాకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. కొత్తగా వచ్చే అనకాపల్లి నుంచే చాన్సు ఉంది. 

గోదావరి జిల్లాల్లో కాపు, శెట్టి బలిజల మధ్య సమన్వయం ! 

ఇక గోదావరి జిల్లాలో ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ చాన్స్ వస్తుందనే ప్రచారం గట్టిగా ఉంది. ఎందుకంటే ఆయన ఈక్వేషన్ అలా ఉంది మరి. శెట్టి బలిజ సామాజిక వర్గం.. మొదటి నుంచి టీడీపీ వైపు ఉండేది.. కానీ... కిందటి ఎన్నికల్లో జగన్ కు సపోర్టు చేసింది. అందుకని.. కచ్చితంగా వాళ్లకి మంత్రిపదవి ఉండాలని జగన్ భావిస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయినా ఇవ్వడానికి ప్రధాన కారణం.. కాంగ్రెస్ లో అందరికన్నా ముందు జగన్ ను బహిరంగంగా సపోర్టు చేసిన మంత్రి అతను. అంతే కాకుండా.. సామాజికవర్గ పరంగా కుడా అడ్వాంటేజ్ ఉంది. అందుకే ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చారు. ఆయన్ను రాజ్యసభకు పంపడంతో ఆ సామాజికవర్గానికే చెందిన వేణుగోపాలకృష్ణకు ఇచ్చారు. ఇప్పుడు...ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎవరూ కనబడటం లేదు పార్టీ నాయకత్వానికి.ఇక మత్స్యకారుల కోటాలో పొన్నాడ సతీష్ కు అవకాశం దక్కనుంది. పశ్చిమ గోదావరిలో ప్రసాదరాజుకు ఆల్ మోస్టు కన్ఫామ్ అయిపోయినట్లే.. జగన్ కు మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నా.. వివిధ కారణాలతో ఆయనకు తొలిదఫా అవకాశం రాలేదు. ఈసారి వస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రస్తుత డిప్యూటీ సీఎం ఆళ్లనానిని కూడా కొనసాగించే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లాల విభజనతో ఏలూరుకు ప్రాతినిధ్యం ఉండకుండా పోతుంది. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని రాజులకు ఒక మంత్రి పదవి ఇస్తారు..కాబట్టి వెస్ట్ గోదావరి నుంచి.. ప్రసాదరాజుకు అవకాశం వస్తుంది. కానీ ఈ జిల్లాల్లో ఒక కాపుకు అవకాశం కల్పించాల్సి ఉంది. పవన్ కల్యాణ్ పై గెలిచిన గ్రంథి శ్రీనివాస్ కు చాన్స్ ఉన్నప్పటికీ.. ఇద్దరూ ఒకే ప్రాంతం అవుతారు. అందుకని ఏలూరు జిల్లాలో ఇవ్వాలంటే.. ఆళ్లనానిని కొనసాగించడం లేదా.. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు ఎస్టీ కోటాలో అవకాశం ఇవ్వడం చేయొచ్చు. 

కృష్ణా , గుంటూరుల్లో కమ్మ, కాపుల మధ్య సమతూకం !

ఇక కృష్ణా ఎన్టీఆర్  జిల్లాలో కమ్మ  సామాజికవర్గానికి ఓ పదవిని కొనసాగించడం ఖాయం. అందుకని.. కొడాలి నానిని మళ్లీ కొనసాగించే అవకాశాలు ఉండొచ్చు. లేదా వసంత కృష్ణప్రసాద్ కు చాన్స్ వస్తుంది. ఆయన ఎలాగూ.. జగన్ కు సన్నిహితుడే. అయితే.. రాజకీయ లెక్కలు చూసుకున్నప్పుడు మాత్రం.. కొడాలి నానికి ఇంకా అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. జగన్ కు ఆయన అంత దగ్గర మరి. బీసీ వర్గం నుంచి పార్థసారథికి చాన్సు రావొచ్చని భావిస్తున్నారు. పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయ భాను కనిపిస్తున్నారు. అయితే ఇది ఇతర ఈక్వేషన్లపై ఆధారపడి ఉంది. ఇప్పటికే కాపుల కోటా ఎక్కువుగా ఉంది. ఈ స్థానం కోసం.. ఆయన అంబటి రాంబాబుతో పోటీ పడాల్సి ఉంది. జగన్ వీరిలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. అలాగే రాష్ట్రంలో మాదిగల కోటాలో రక్షణనిధికి ఎన్టీఆర్ జిల్లా నుంచి అవకాశం ఇస్తే.. ఉదయభానుకు కష్టమే.. ఇక గుంటూరు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కన్ఫామ్ అయినట్లే. ఆయన పల్నాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుత హోం మంత్రి సుచరిత స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మేరుగ నాగార్జునకు అవకాశం రావొచ్చు

ఆనం, రోజాలకు కష్టమే ! 

ప్రకాశం జిల్లాలో కూడా విజయనగరం లాంటి పరిస్థితే ఉంది. ఆ జిల్లా ఎమ్మెల్యేలు బాలినేనినే కొనసాగించమని కోరుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మాదిగలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని.. ప్రస్తుత మంత్రి ఆదిమూలం సురేష్ ను కొనసాగించే అవకాశం లేకపోలేదు. కొంతమంది మాదిగ ఎమ్మెల్యేలున్నప్పటికీ... విద్యావంతుడైన సురేష్ వైపే మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు.  ఇక వెల్లంపల్లి స్థానంలో అన్నా రాంబాబుకు అవకాశం కల్పించొచ్చు. అలా జరిగితే  సురేష్ కు కష్టం కావొచ్చు.  నెల్లూరులో మేకపాటి గౌతంరెడ్డి సతీమణికి మాట ఇచ్చేసినట్లు ఉన్నారు. అలా కాకుంటే కాకాణి గోవర్థన్ రెడ్డి కి చాన్సు దొరుకుతుంది. అత్యంత సీనియర్ ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉమ్మడి నెల్లూరు నుంచి అడుగుతున్నారు. అయితే జగన్ అంత సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఆనం నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉంది. ఆ కోటాలో కేటాయించాలనుకుంటే.. అవకాశం ఇవ్వొచ్చు. పాత చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కలిసిపోవడంతో మంత్రిపదవులు ఇప్పుడు మూడు జిల్లాల వాళ్లు పంచుకోవలసి వస్తోంది. ఇది ఓ రకంగా ఇబ్బంది.. ఇంకో రకంగా ముఖ్యమంత్రి వెసులుబాటు కూడా.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్థానంలో సూళ్లూరు పేట ఎమ్మెల్యే సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ అడుగుతున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని పక్కన పెట్టే సాహసం చేస్తారా అన్నది అనుమానమే. ఒకవేళ ఆయన్ను మార్చినా.. ఆయన మనిషే మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది. తన స్థానంలో మరో రెడ్డి మంత్రి అయ్యే అవకాశాన్ని పెద్ది రెడ్డి ఇవ్వదలచుకోవడం లేదు. ఇప్పటికే రోజాకు.. ఆయనకు ఈ విషయంలో పొరపచ్చాలు వచ్చాయి. రోజాకు.. రాష్ట్రస్థాయిలో ఫేమ్ ఉన్నా.. మంత్రి పదవి రాకపోవడానికి కారణం అదే. ఈసారి ఆవిడ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోజా నియోజకవర్గం నగరి తిరుపతి జిల్లాలో ఉండటంతో అక్కడ ఆనం నుంచి పోటీ వస్తుంది. ఒకవేళ చిత్తూరు కోటాలో తీసుకుందామన్నా..  పెద్దిరెడ్డి.. మరో పాచిక వేస్తున్నారు. రెడ్లు కాకుండా.. బలిజ సామాజిక వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వమంటున్నారు. ఇంతవరకూ రాయలసీమలో ఏ  పార్టీ బలిజలకు మంత్రి పదవి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సి.రామచంద్రయ్య కొన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. ఆయన పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో చిరంజీవి కోటాలో పదవి దక్కిచుకున్ారు.  కడప, చిత్తూరు, తిరుపతిలో స్ట్రాంగ్ గా ఉండే వీళ్లుకు.. కమ్మ, రెడ్డి ల నుంచి పోటీ వల్ల మంత్రి పదవులు దక్కడంలేదు. కాబట్టి ఈ ప్రయోగం బాగుంటుందని పెద్దిరెడ్డి సూచిస్తున్నారట.  అలాగే పలమనేర్ ఎమ్మెల్యే వెంకటేశ గౌడకు అవకాశం ఇచ్చినా బాగుంటుందని ఆయన సూచన. దాంతో శెట్టిబలిజలకు పాత వాళ్లనే కొనసాగించకుండా.. మరొకరికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.  దాని ద్వారా చెవిరెడ్డి, కరుణాకరరెడ్డికి కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరి జగన్ ఏం ఆలోచిస్తారో తేలాల్సి ఉంది.   

అనంత నుంచి బలహీనవర్గాలకే అవకాశం !

అనంతపురం లో శంకరనారాయణ బదులు అదే సామాజికవర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ కు అవకాశం కల్పించొచ్చు. ఎస్సీకోటాలో జొన్నలగడ్డ పద్మావతికి అవకాశం రావచ్చని భావిస్తున్నారు. అలాగే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి చాన్సులున్నాయి. కర్నూలులో బుగ్గన ఉన్నారు. ఇప్పటికే తీసుకున్న లైన్ ప్రకారం ఆయన్ను మార్చాల్సి ఉన్నప్పటికీ..ఆయన్ను కొనసాగించాల్సి అనివార్యత ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మరో ఆర్థిక మంత్రిని తీసుకొస్తే.. వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. పైగా ఇలాంటి పరిస్థితుల్లోనూ బుగ్గన ఢిల్లీలోనే ఉండి లైజనింగ్ చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. అది చాలా అవసరం. ఇక అత్యంత లక్కీ అనుకుంటోంది ఎవరంటే.. మంత్రి జయరాం. ఈయనపై చాలా ఆరోపణలొచ్చినా..  ప్రస్తుతానికి ఆయన్ను కొనసాగించక తప్పని సరి పరిస్థితి అంటున్నారు. ఎందుకంటే.. జగన్ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం బోయ కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలి. మరొకరు కనిపించడం లేదుమరి.. కడప నుంచి సీఎం ఉన్నారు కాబట్టి ఇంకెవరికి ఉండకపోవచ్చు. ప్రస్తుత డిప్యూటీ సీఎం  అంజాద్ భాషను మార్చి కర్నూలు నుంచి హీఫీజ్ ఖాన్ కు లేదా.. ఎమ్మెల్సీ కోటా మహ్మద్ ఇక్బాల్ కు అవకాశం ఇవ్వొచ్చు. 

రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవుల్లో ప్రాధాన్యం లేనట్లే ! 

మొత్తం మీద జగన్ లెక్క క్లియర్ గా ఉంది. తనకు ఓట్ల వర్షం కురిపించిన వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి .. బలమైన నాయకులను పక్కన పెట్టడానికి సందేహించడం లేదు. ఆయన లెక్క ప్రకారం మళ్లీ ముగ్గరు మాల, ఇద్దరు మాదిగ, ఒక ఎస్టీ తప్పని సరి. అలాగే ప్రత్యేకంగా తన వెంట నిలిచిన శెట్టి బలిజ, కురబ, బోయ కూడా తప్పని సరి. ఈ లెక్కల కోసం రెడ్డ సంఖ్యను పెంచే పరిస్థితి లేదు. ఇప్పటికే తమకు మంత్రి పదవులు తక్కువుగా ఉన్నాయని వారు అసహనంగా  ఉన్నారు. కనీసం ఆరుగురికైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నాలుగు కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. అవసరం అయితే తగ్గిస్తాను అని కూడా జగన్ చెప్పినట్లు సమాచారం. అలాగే.. ఈసారి మహిళల సంఖ్య కూడా పెంచుతానని మంత్రివర్గ సమావేశంలో హింట్ ఇచ్చారంట.. ఇవన్నీ ఆలోచిస్తూ.. ఆశావహులంతా.. హీటెక్కిపోతున్నారు.

 

Published at : 06 Apr 2022 01:41 PM (IST) Tags: cm jagan AP cabinet Sajjala Ramakrishnareddy Ministerial Expansion Social Equations in the Cabinet

ఇవి కూడా చూడండి

Telangana Cabinet Meet :   సోమవారం  తెలంగాణ కేబినెట్ భేటీ - ఫలితాలపై కేసీఆర్ గట్టి నమ్మకం !

Telangana Cabinet Meet : సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీ - ఫలితాలపై కేసీఆర్ గట్టి నమ్మకం !

Elections Exit Polls : గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?

Elections Exit Polls :  గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?

Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? -  బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?

Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

Telangana Exit Poll 2023 Highlights :   ఏబీపీ  సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ -  తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

Telangana Election : కవిత, రేవంత్‌లపై ఫిర్యాదులు - డీఈవో రిపోర్ట్ ఆధారంగా కేసులు పెడతామన్న వికాస్ రాజ్ !

Telangana   Election   :  కవిత,  రేవంత్‌లపై ఫిర్యాదులు - డీఈవో రిపోర్ట్ ఆధారంగా కేసులు పెడతామన్న వికాస్ రాజ్ !

టాప్ స్టోరీస్

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ  నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్

భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్