Telangana Politics: బీజేపీకి బెంగాల్ తర్వాత తెలంగాణనే టార్గెట్ - మరి అసలు ఆపరేషన్ ఎప్పటి నుంచి?
operation Telangana: నియోజకవర్గ స్థాయి నాయకత్వ లోపాన్ని .. చేరికలతో పూడ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్కు ప్లాన్ చేస్తోంది.

After Bengal BJP target is Telangana: తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటే, బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు శక్తి కూడదీసుకుంటోంది. మరోవైపు కవిత కొత్త పార్టీ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో కొత్త సంచలనం మొదలైంది. ఈ పరిణామాల మధ్య నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపిస్తున్న భారతీయ జనతా పార్టీ , తెర వెనుక తనదైన శైలిలో భారీ వ్యూహరచన చేస్తోంది. కర్ణాటక తర్వాత దక్షిణాదిలో అధికారం చేపట్టేందుకు అనువైన రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన బీజేపీ, రాబోయే ఆరు నెలల్లో తన అసలైన రాజకీయ చదరంగాన్ని ప్రారంభించబోతోందన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
నాయకత్వ లేమి - బీజేపీ ప్రధాన సవాల్
తెలంగాణలో బీజేపీకి ఉన్న ప్రధాన సమస్య రాష్ట్రవ్యాప్త క్రేజ్ నియోజకవర్గ స్థాయి ఓట్లుగా మారకపోవడం. ప్రధాని మోదీ ప్రభావం, జాతీయ అంశాలతో రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఆదరణ పెరుగుతున్నా, క్షేత్రస్థాయిలో గెలిచే గుర్రాలు లేకపోవడం పార్టీని దశాబ్దాలుగా వేధిస్తోంది. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ఢీకొట్టే స్థాయి నాయకత్వం ప్రతి నియోజకవర్గంలో లేకపోవడం బీజేపీకి పెద్ద లోటు. ఈ ఖాళీని పూరించడానికి పార్టీ ఇప్పుడు ఆర్గానిక్ గ్రోత్ కంటే ఇన్స్టంట్ ఇంపోర్ట్ వైపే మొగ్గు చూపుతోంది.
ఆపరేషన్ ఆకర్ష్ - మలి విడత వ్యూహం
ప్రస్తుత రాజకీయ శూన్యతను వాడుకుని, ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను మళ్లీ పట్టాలెక్కించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మల్లారెడ్డి వంటి నేతలు బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేవలం ఒకరిద్దరు కాదు, దాదాపు 20 నుండి 30 మంది కీలక నియోజకవర్గ స్థాయి నేతలతో ఢిల్లీ స్థాయిలోనే సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తేనే తమ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇప్పుడు కమలం గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.
త్రిముఖ పోటీలో బీజేపీ అడుగులు
కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉంది. ఇది బీజేపీకి పరోక్షంగా లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవడానికి, బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి బలోపేతంపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకున్న బీజేపీ, ఈసారి ఆ సంఖ్యను మ్యాజిక్ ఫిగర్కు చేర్చాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం స్థానిక నాయకత్వ సమస్యను చేరికల ద్వారా పరిష్కరించుకుని సత్తా చాటాలని భావిస్తోంది.తెలంగాణలో ఇప్పుడు కనిపిస్తున్న నిశ్శబ్దం ఒక తుపానుకు ముందు వచ్చే ప్రశాంతత లాంటిదే. కాంగ్రెస్ అధికార బలం, కవిత కొత్త పార్టీ ప్రయోగాలు, బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాటం.. ఈ మూడింటి మధ్య బీజేపీ వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయాలను రాబోయే రోజుల్లో ఏ దిశగా మారుస్తాయో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















