TDP Warning Bells: వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
Gv Reddy Issue: జీవీ రెడ్డి ఇష్యూలో తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. జరగకూడని తప్పులు జరుగుతున్నాయని క్యాడర్ అంటున్నారు.

TDP: వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..! చంద్రబాబు గారూ మిమ్మల్నే..! మీ పార్టీ వాళ్లు ఇస్తున్న వేకప్ కాల్ మీకు చేరుతోందా.. బహుళా చేరి ఉండొచ్చు. ఇది ఇప్పుడు మొదలవలేదు.. కొన్ని నెలలుగా మీ పార్టీని మీ వాళ్లే సోషల్ మీడియాలో చెండాడుతున్నారు. కొన్నాళ్లుగా కొంచం కొంచంగా ఉన్న వ్యతిరేకత నిన్న ఒక్క సారిగా అవుట్ బరస్ట్ అయింది. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా ఆయనకు మద్దతుగా.. మీకు వ్యతిరేకంగా పోస్టుల వరద కొనసాగుతోంది. ఇది చేస్తోంది ప్రత్యర్థి పార్టీల వాళ్లు కాదు. మీ టీడీపీ అభిమానులే. ఇలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికైనా ఆలోచించుకోండి అంటూ అల్టిమేటమ్ కూడా ఇస్తున్నారు. మరి మీరు చూస్తున్నారా..?
సొంత పార్టీపై విరుచుకుపడుతున్న టీడీపీ సోషల్ మీడియా
టీడీపీ సోషల్ మీడియా ఓ 24 గంటలుగా ఇంటర్నెట్ ను హోరెత్తిస్తోంది. సొంత పార్టీనే చెండాడుతోంది. పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తల నుంచి ఎన్నికలకు ముందు ఆ పార్టీకి వాలంటరీగా సర్వీస్ చేసిన వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ టీడీపీ వ్యవహారశైలిని తప్పు పడుతున్నారు. ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం టీడీపీలో మంట రేపింది. దానికి దారితీసిన పరిస్థితులు ఆ పార్టీ క్యాడర్కు చిర్రెత్తించాయి. ఫైబర్నెట్ ఎండీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్కు మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం చివరకు ఛైర్మన్ రాజీనామా వరకూ వెళ్లింది. ఫైబర్నెట్ అవినీతిమయం అయిపోయిందని.. వైసీపీ హయాంలో చేరి విధులు నిర్వర్తించకుండా 410మందికి పైగా జీతాలు తీసుకుంటున్నారని.. సంస్థలోని ముఖ్య అధికారులు ఫైబర్నెట్ను పూర్తిగా దెబ్బ తీశారని జీవీరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆరోపించారు. వీటిన్నింటిని సరిదిద్దాలని బహిరంగంగా చెప్పారు.
కానీ ఆ తర్వాత కూడా ఆ 410 మందిని ఉద్యోగాల్లో తొలగించకపోగా వాళ్లకి జీతాలు చెల్లిస్తున్నారు. దీనిపై మండిపడిన జీవీరెడ్డి కొన్ని రోజుల కిందట ఫైబర్ నెట్ ఎండీ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని.. ఆయనది రాజద్రోహం అని అన్నారు. ఫైబర్ చిచ్చు రచ్చకెక్కడంతో సీఎం చంద్రబాబు రెండు వర్గాలనూ పిలిచి మందలించారు. అయితే సోమవారం సాయంత్రం జీవీ రెడ్డి ఫైబర్నెట్ ఛైర్మన్ పదవికి, తెలుగుదేశం సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో విషయం వేడెక్కింది. అయితే తర్వాత కొద్దిసేపటికి ఫైబర్ ఎండీ దినేష్ను బదిలీ చేసిన ప్రభుత్వం GADకి అటాచ్ చేసింది. అలాగే జీవీ రెడ్డి రాజీనామాను కూడా వెంటనే ఆమోదించింది. అంతే ఒక్కసారిగా టీడీపీ క్యాడర్లో అసంతృప్తి బద్జలైంది. సొంత ప్రభుత్వంపైనే ఆగ్రహం, ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కారు. నిజాయతీకి ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించడం మొదలు.. మీది చేవ లేని ప్రభుత్వం అనడం వరకూ.. విపరీతంగా పోస్టులు వైరల్ అయ్యాయి.
ఈ విషయంలో కార్యర్తల మనోభావాలను పార్టీ అధినాయకత్వం గుర్తించాల్సిందే. కానీ చంద్రబాబు ఇంకా పాత పద్ధతిలోనే క్రమశిక్షణ మీరడానికి లేదు. ఎవరినీ సహించం అనే పంథాలో వ్వవహరిస్తున్నారు. జీవీరెడ్డి ఇష్యూను ఆయన టాకిల్ చేసిన విధానంలోనే అది తెలుస్తోంది. నిజంగా పార్టీని గౌరవించగలిగితే.. దానిపై విచారణకు ఆదేశించి ఐఏఎస్ ను బదిలీ చేయాలి. లేదా ఓ ముఖ్యమంత్రిగా చూశారనుకున్నా.. కనీసం తమ వెంట కష్టకాలంలో ఉన్న జీవీ రెడ్డి రాజీనామాను ఉపసంహరించుకోవాలని బుజ్జగించాలి. అది చేయకుండా రాజీనామా ఆమోదించి.. “పార్టీలో అయినా.. ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకే మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేసిన ప్రభుత్వ పెద్దలు” అని మీడియాకు లీక్ ఇచ్చారు. ఎవరా ప్రభుత్వ పెద్దలు?
అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది...?
టీడీపీ క్యాడర్ భగ్గుమనడం వెనుక రీజన్ జీవీ రెడ్డికి జరిగిన అవమానం మాత్రమేనా.. దానికోసం ఇంత రియాక్షనా.. జీవీరెడ్డి తనకు సొంతంగా బలమున్న నేత కూడా కాదు కదా.. అయినా ఎందుకు ఇంత రియాక్షన్..? అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. జి.వి.రెడ్డి ఫైబర్ నెట్ అవకతవకలు గురించి మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆయనకు టీడీపీ సోషల్ మీడియాలో మద్దతు వచ్చింది. రెండు రోడుల కిందట ఆయన చేసిన కామెంట్స్తో అది పీక్ లెవల్కు చేరింది. IAS లపై చంద్రబాబుకు లవ్ అన్నది కొత్త విషయం కాదు. ఆయన మొదటి సారి సీఎం అయినప్పటి నుంచీ అది ఉన్నదే. అయితే ఆయన మొదటి దఫా 9 ఏళ్ల పాలనలో IASల వల్ల ఎంత మంచి పేరు వచ్చిందో.. 2014లో వాళ్ల వల్ల అంత చెడ్డపేరు వచ్చిందని టీడీపీ నమ్ముతోంది. అధికారులు అప్పుడు ఉన్నట్లుగా లేరు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా ఓ పార్టీకి సన్నిహితులు అన్న ముద్ర వేసుకున్నారు. ఓ రకంగా ఇప్పుడు వాళ్లు పార్టీలకు అఫిలియేటెడ్. పాలనా వ్యవహారాల్లో IASల జోక్యం ఎక్కువుగా ఉంటోందని వాళ్లకి చంద్రబాబు మద్దతిస్తున్నారని టీడీపీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులే ఇప్పటికీ పాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నారని వారు భావిస్తున్నారు. జీవీ రెడ్డి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా పార్టీలో చేరారు. పార్టీ బ్యాక్ ఆఫీసులో పనిచేయడంతో పాటు... టీవీ డిబేట్లలో వైఎస్సార్పీపీని సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎలాంటి పరుషమైన మాటలు లేకుండా కేవలం అంకెలు, వాస్తవాలతో వైసీపీని కట్టడి చేశారు. అందుకే ఆయనంటే టీడీపీ క్యాడర్ కు ప్రత్యేకమైన అభిమానం.
జీవీ రెడ్డి వాదనను సమర్థిస్తున్న టీడీపీ క్యాడర్
2019-24 మధ్య కాలంలో కేసులు, వేధింపులతో తీవ్రంగా ఇబ్బందులు పడిన పార్టీ క్యాడర్ వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం ఉన్నా వదలకూడదు అని కోరుకుంటున్నారు. అలాంటిది 410మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారని చెప్పడం, టీడీపీని తీవ్రంగా అవమానించిన రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులకు అప్పనంగా డబ్బులు చెల్లించారని సాక్ష్యాలు చూపడం, వచ్చిన కొన్ని నెలల్లో నే ఫైబర్లో అక్రమాలపై మాట్లాడటం.. ఐఏఎస్లు ఎలా తప్పు దోవ పట్టిస్తున్నారో చెప్పిన ఆయన క్యారెక్టర్ కేడర్కు నచ్చింది. ఇక దీనిపై చర్యలు ఉండబోతున్నాయని అంతా అనుకుంటున్న టైమ్ లో చంద్రబాబు జీవీ రెడ్డిని పిలిచి క్లాస్ పీకారు. అందరి ముందు అలా చెబుతారా.. అంటూ ప్రొసీజర్ చెప్పాలని చూశారు. ఏం జరిగిందో తెలీదు కానీ జీవీరెడ్డి ఆత్మాభిమానం దెబ్బతింది. టీడీపీ క్యాడర్ భగ్గుమంది.
ప్రొసీజర్లు చెప్పొద్దంటూ వాళ్లు చంద్రబాబుకే క్లాస్ పీకుతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహారాలు చేస్తున్న వారిని వదిలేసి అవినీతిని వెలికితీసిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారా అని నిలదీస్తున్నారు. ఇది ఏ రేంజ్కు వెళ్లిందంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి IASలతో ఓట్లు వేయించుకోండి. ఇక మేమెందుకు అనే వరకూ వెళ్లింది. అసలు ఈ IASల లాబీలపై టీడీపీ పాతకాలం వారికి చాలా మందికి కోపం ఉంది. పార్టీ కోసం కష్టపడి ఓట్లు వేయించే నేతలను కూడా చంద్రబాబు ఈ అధికారుల ముందు చిన్నబోయేలా చేస్తారన్నది వీళ్ల కోపం. అందుకే కొంతమంది వాళ్లతోనే ఊరేగండి అంటూ కొంచం కటువుగానే చెబుతున్నారు.
రెడ్ బుక్ పై యాక్షన్ లేకపోవడమే టీడీపీ క్యాడర్లో ఆగ్రహం
అసలు జీవీరెడ్డి ఇష్యూ అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న అనేక సంఘటనలపై క్యాడర్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి ఓ బ్రేకింగ్ పాయింట్ లాంటిది. ఇది ఇప్పుడు మొదలవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల నుంచే స్టార్ట్ అయింది. రెడ్ బుక్ పేరుతో చేసినంత హైప్ చేతల్లో లేదన్నది వాళ్ల కోపం. చాలా విషయాల్లో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులు, మద్యం అక్రమాల కేసు ముందుకు కదలకపోవడం, పెద్ది రెడ్డి అవినీతిపై పత్రికల్లో పతాక కథనాలు వచ్చినా రియాక్షన్ అనుకున్న స్థాయిలో లేకపోవడం, వైసీపీ పెద్దలు నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పే గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల గొడవలపై స్పందన లేకపోవడం, జత్వానీ కేసులో మొదట్లో చూపిన స్పీడ్ తర్వాత తగ్గిపోవడం, వైఎస్సార్సీపీ టైమ్ లోని కాంట్రాక్టర్లే ఇంకా హవా కొనసాగిస్తుండటం.. ఇవన్నీ టీడీపీ క్యాడర్కు చిరాకు తెప్పిస్తున్నాయి.
వైసీపీ వాళ్లకే పనులవుతున్నాయన్న అసంతృప్తి
ఇవన్నీ ఒకెత్తైతే జగన్ పై పోరాటం చేసిన వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కోపం కూడా ఉంది. రఘురామకృష్ణం రాజు అప్పట్లో టీడీపీలో లేకపోయినా ఆయన జగన్ పై ఏ స్థాయిలో పోరాడారో అందరికీ తెలుసు. కానీ ఆయన్ను పోలీసు కస్టడీలో కొట్టారన్న దానిలో టీడీపీ నేత తులసిబాబు ఉన్నారంటే.. ఆ పార్టీ క్యాడర్ ఆ నేతను కూడా వదల్లేదు. ఇక జగన్ ప్రభుత్వంలో బాగా ఇబ్బందుల పాలైన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును పక్కన పెట్టినట్లు ఈ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఆయనకు ఆఫర్ చేసిన పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ అన్నది ఆయన్ను అవమానించడమంటూ గొంతెంత్తింది. ఇక కాస్త వివాదాస్పదుడైన సానా సతీష్ కు ఏకంగా రాజ్యసభ పదవి కట్టబెట్టడం క్యాడర్ కు ఏమాత్రం నచ్చలేదు. వీటన్నింటిపైనా వాళ్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య చేసిన నీరు చెట్టు బిల్లులు ఇంకా రాలేదు. కానీ టీడీపీ విపరీతంగా హైలైట్ చేసిన రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లింపు చేయడానికి ఈమధ్యనే ఫైల్ పెట్టారు. టీడీపీ క్యాడర్ ఆగ్రహాన్ని చూసిన తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల ఆ బిల్లు నిలిపేశారు.
ఇది టీడీపీకి వేక్ అప్ కాల్ లాంటిదే !
వాళ్లు ఎంత కోపంగా ఉన్నారంటే చంద్రబాబు పాటలను పాడను అని చెప్పిన సింగర్ మంగ్లీకి శ్రీకాకుళంలో ప్రత్యేక దర్శనాలు కల్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని కూడా వదల్లేదు. సహజంగా రామ్మోహన్ను పార్టీలో అంతా ఇష్టపడతారు. కానీ అలాంటి అతన్ని కూడా ఏకేశారంటే వాళ్ల కోపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రతీసారీ వచ్చే సమస్యే ఇది. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు..! కానీ ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడైన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మర్చిపోతారు. తెలుగుదేశం ఎమోషనల్ పార్టీ. తెలుగుదేశం అనే పేరు, ఓ వైబ్, ఎమోషన్ ఆ పార్టీని నడిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ చంద్రబాబు 40 ఏళ్లుగా దానిని ట్రైన్ చేస్తూ వచ్చిన మాస్టర్. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, చాతుర్యం పార్టీని ఇన్నాళ్లు కాపాడాయి. కానీ పార్టీ కోర్ అనేది ఎమోషనే. ఆ ఎమోషన్ ను దెబ్బతీయకూడదు. అదే టీడీపీ బలం. అందుకే నలభై రెండేళ్లలో నాలుగు జనరల్ ఎలక్షన్లలో ఓడిపోయినా ఇంకా బ్రతికి ఉండ గలిగింది. వైఎస్సార్సీపీలో పై నుంచి కింద వరకూ జగన్ ఫాన్సే. ఆ పార్టీకి పేరు లేకపోయినా .. కేవలం జగన్ ఫోటో ఉన్నా చాలు. తెలుగుదేశం అలా కాదు. ఆ పార్టీలో చంద్రబాబు నచ్చకుండా కేవలం పార్టీ నచ్చేవాళ్లు 30శాతం ఉంటారు. 2019 -24 మధ్య జరిగిన పరిణామాలు తెలుగుదేశంలోని పాత ఎమోషన్ ను రగిల్చాయి. అందుకే ఆ రిజల్ట్ ఆ రేంజ్ లో వచ్చింది. వాళ్లు ఏ ఉద్దేశ్యంతో పోరాడారో.. కచ్చితంగా దానిని ఎక్స్ పెక్ట్ చేస్తారు. దానికి కొంచం బయటకు వెళ్లినా తట్టుకోలేరు. జీవీ రెడ్డి అన్నది జస్ట్ బ్రేకింగ్ పాయింట్. అసలు వాళ్లు కోపం జీవీ రెడ్డి ఇష్యూ మీద కాదు. కొన్నాళ్లుగా జరుగుతున్న వ్యవహారాలు, దానికి వస్తున్నటువంటి రెస్పాన్స్ మీద రియాక్షన్ ఇది. జీవీ రెడ్డి అన్నది జస్ట్ ఒక టూల్ అంతే.
ఇది టీడీపీకి ఓ వేకప్ కాల్ లాంటిది. మరి ఆ కాల్ను చంద్రబాబు తీసుకుంటారా.. లేక ఎప్పటిలాగానే చంద్రబాబు అంతేలే అని పార్టీ వాళ్లు సర్దుకుపోతారా.. ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

