India Neighboring Countries: భారత పొరుగు దేశాల్లో కూలిపోతున్న ప్రభుత్వాలు, పారిపోతున్న ప్రధానులు - ఏదైనా కుట్ర ఉందా ?
Nepal Issue: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఇంతకు ముందు శ్రీలంక, బంగ్లాల్లోనూ ఇలాగే జరిగింది. భారత పొరుగుదేశాల్లోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయి ?

India Neighboring Countries political revolution: నేపాల్ ప్రజలు ప్రభుత్వంపై ఒక్క సారిగా తిరుగుబాటు చేశారు. సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ చేయడంతో యువత సహనం కోల్పోయారు. అప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం వంటి సమస్యతో రగిలిపోతున్నారు. వారికి సోషల్ మీడియా బ్యాన్ అనే కారణం దొరకడంతో రెచ్చిపోయారు. ఆర్మీ కాల్పుల్లో చాలా మంది చనిపోవడంతో .. తిరుగుబాటు మరింత పెరిగింది. చివరికి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. తనను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని వేడుకున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఆర్మీ ఆయనను ఆజ్ఞాత ప్రాంతానికి తరలించారు. ఇలా జరగడం నేపాల్లో ఇదే మొదటి సారి. అయితే భారత పొరుగు దేశాల్లో మాత్రం ఇటీవలి కాలంలో మూడోది.
బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన ప్రధాని షేక్ హసీనా
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2024 ఆగస్టు 5న తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు. విద్యార్థుల రిజర్వ్ కోటా వ్యతిరేక ఆందోళనలు చేయడంతో అవి హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధం, కర్ఫ్యూ విధించి, పోలీసు-పారామిలిటరీ బలగాలను ఉపయోగించడంతో యువత తిరగబడ్డారు. ఆందోళనలు దేశవ్యాప్తమమయ్యాయి. కాల్పులు, ఘర్షణల్లో వందల మంది చనిపోయారు. దీంతో ప్రధాని నివాసంలోకి కూడా యువత దూసుకు వచ్చారు. షేక్ హసీనా తీవ్ర ఆందోళనలు చూసి రాజీనామా ప్రకటించి తన అధికారిక నివాసం నుంచి హెలికాప్టర్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికీ బంగ్లాదేశ్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదు.
అంతకు ముందు శ్రీలంకలో ఇవే పరిస్థితులు
శ్రీలంక ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్సే 2022 జూలైలో రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. చైనా నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పులు, పర్యాటకం, దిగుమతులపై ఆధారపడటం, 2019 ఈస్టర్ బాంబు దాడులు, COVID-19 మహమ్మారి వల్ల పర్యాటకం (GDPలో 12%) పూర్తిగా కుంగిపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గాయి. ప్రజలకు కనీస అవసరాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. మార్చి 2022 నుంచి ఉద్యమం ప్రారంభమైంది. యువత, మధ్యతరగతి, రైతులు, కార్మికులు రోడ్లపైకి వచ్చారు. రాజపక్సే కుటుంబం పై అవినీతి, కుటుంబ రాజకీయం, ఆర్థిక మిస్మేనేజ్మెంట్ ఆరోపణలు ఉన్నాయి. చివరికి లక్షలాది మంది ఆందోళనకారులు కొలంబోలో రాష్ట్రపతి భవనం, ప్రధాని నివాసం పై దాడి చేసి, ఆక్రమించారు. పోలీసు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు వాడినా, సైన్యం జోక్యం చేసుకోలేదు. గోటబాయ రాజపక్సే సైనిక విమానంలో మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్కు వెళ్లారు. సింగపూర్ నుంచి రాజీనామా లేఖ పంపారు.
పాకిస్తాన్లోనూ అనిశ్చిత పరిస్థితులు
పాకిస్తాన్ లోనూ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడంతో పెద్ద ఎత్తున నిరసలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి సైన్యం పూర్తి స్థాయిలో సహకరి్సతూండటంతో ప్రజా ఉద్యమాలను ఎక్కడిక్కడ అణిచి వేస్తున్నారు. అయితే సైన్యం కూడా నియంత్రించలేని ప్రజా ఉద్యమం వస్తుందని.. అక్కడి ప్రభుత్వాన్ని తరిమికొడతారన్న ప్రచారం జరుగుతోంది. బలూచ్ సహా ఎన్నో సమస్యలు పాకిస్తాన్ ను పట్టి పీడిస్తున్నాయి.
ఈ దేశాలపై అంతర్జాతీయ కుట్ర ఉందా ?
భారతదేశం ఇరుగు పొరుగు దేశాలుగా ఉన్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలపై అంతర్జాతీయ కుట్ర ఉందన్న అనుమానాలను ఎవరూ తోసిపుచ్చడం లేదు. బంగ్లాదేశ్ పరిణామాల వెనుక అమెరికా ఉందని షేక్ హసీనా ఆరోపించారు. నేపాల్ లో జరిగిన అల్లర్లపై కొంత మంది అక్కడి నిపుణులు చైనా వైపు అనుమానంగా చూస్తున్నారు. శ్రీలంకలో జరిగిన తిరుగుబాటుకు చైనానే పరోక్ష కారణం. పాకిస్తాన్ లో నూ ఇలాంటి పరిణామాలు జరిగితే.. ఖచ్చితంగా అంతర్జాతీయ కుట్రలు ఉన్నాయన్న నమ్మకాలు పెరుగుతాయి.





















