Iran Israel War 2026:ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తున్నట్టు? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది?
Iran Israel War 2026:ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో కేవలం ఖమేమీ మాత్రమే కాకుండా, ఇరాన్ క్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అనేక మంది ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు.

Iran Israel War 2026:మధ్య ప్రాచ్యం చరిత్రలో ఎన్నడూ చూడని అత్యంత భయంకరమైన యుద్ధానికి వేదికైంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్ వ్యవస్థను కుదిపేస్తోంది. గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేమీ మరణించారు. 1989 నుంచి ఇరాన్ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఖమేమీ, టెహ్రాన్లోని ఆయన నివాసంపై జరిగిన దాడిలో మరణించినట్టు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
అగ్రనేతలే లక్ష్యంగా మెరుపు దాడులు
ఈ ఆపరేషన్లో కేవలం ఖమేమీ మాత్రమే కాకుండా, ఇరాన్ క్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అనేక మంది ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించిన వివరాలు ప్రకారం.. డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ అలీ షమ్ఖానీ, రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జాదే, ఐఆర్జీసీ కమాండర్ జనరల్ మహమ్మద్ పాక్పూర్ వంటి హేమామీలు ఈ దాడుల్లో మరణించారు.
ఖమేనీ మరణానంతరం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ అర్హమద్ వహీదీని కొత్త కమాండర్ ఇన్ చీఫ్గా నియమించింది. సోమవారం నాటికి అందిన సమాచారం ప్రకారం, ఇరాన్లోని 130 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో సుమారు 555 మంది మరణించగా, ఇందులో దక్షిణ ఇరాన్లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో చిన్న పిల్లలతో సహా 150 మంది మృతి చెందడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
ట్రంప్ లక్ష్యం ఏంటీ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల వెనుక ఉన్న అసలు కారణాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను పొందకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థను, వాటి తయారీ కేంద్రాలను పూర్తిగా భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ముఖ్యంగా, ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ఒక కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుతం మతపరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకోవాలని, ఇది వారికి లభించిన అరుదైన అవకాశం అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్ వల్ల ఎదురవుతున్న అస్తిత్వ ముప్పును తొలగించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు.
ఇరాన్ ప్రతీకారం- రగిలిపోతున్న గల్ఫ్ దేశాలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా మిత్రదేశాల లక్ష్యాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దుబాయ్లోని సివిలియన్ హోటళ్లు,ఇతర కట్టడాలపై దాడులు జరిగాయి. కువైట్లో అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. అలాగే మూడు అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. ముగ్గురు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడులు జరిగాయి.
లెబనాన్కు చెందిన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ కూడా ఇరాన్కు మద్ధతుగా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బీరూట్, దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేస్తోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్
మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఖతార్ ఇంధన సంస్థ ఉత్పత్తిని నిలిపివేయడంతో సోమవారం గ్యాస్ ధరు ఒకేసారి 50 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ బ్యారెల్కు 82 డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు రవాణా అయ్యే ఈ కీలక మార్గం గుండా వెళ్లే నౌకపై ఇరాన్ దాడులు చేస్తోంది.
ఇరాన్ భవిష్యత్ ఏంటీ?
ఖమేనీ మరణంతో ఇరాన్ పాలనను తాత్కాలికంగా కొనసాగించడానికి ఒక ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఏర్పడింది. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెస్కీయాన్, జుడిషియరీ, అలీరెజా అరాఫీ సభ్యులుగా ఉన్నారు. కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక కోసం 88 మంది మత పెద్దల బృందం భేటీ కావాల్సి ఉన్నా, ప్రస్తుత దాడుల వేళ అది కష్టతరంగా మారింది.
ఈ సంఘర్షణ ఎన్ని రోజులు
ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై ట్రంప్ స్పందిస్తూ, మరో నాలుగు నుంచి ఐదు వారాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగవచ్చు అని సూచించారు. అయితే అవసరమైతే అంతకంటే ఎక్కువ కాలం పోరాడేందుకు తమ వద్ద సరిపడా ఆయుధ సంపత్తి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మధ్య ప్రాచ్యం ఒక అగ్ని గుండంలా మారింది. ఇరాన్ నాయకత్వం కోల్పోయిన తరుణంలో అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచం ఆందోళనతో చూస్తోంది.























