Third Temple In Israel: ఇజ్రాయెల్లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Israel-Iran Conflict | ఇజ్రాయెల్లో నెలకొన్న ఉద్రిక్తతల వెనుక రాజకీయ, భౌగోళిక కారణాలతో పాటు మతపరమైన అంశాలున్నాయి. మూడో టెంపుల్ నిర్మాణం, మెస్సియా (Messiah) రాకపై యూదుల నమ్మకం చర్చనీయాంశంగా మారింది.

మత పరమైన విషయాల్లో అత్యంత కఠినం గా ఉండే జాతిగా యూదులకు పేరు. వారి మతపరమైన సెంటిమెంట్ లలో అత్యంత ముఖ్యమైనది జెరూసలేం లో మూడో టెంపుల్ నిర్మాణం. దీనికోసం వాళ్లు 2000 ఏళ్ళు గా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మూడో టెంపుల్ నిర్మాణం ఫై ఇరాన్ యుద్ధం లో ఒక సెంటిమెంట్ గా మారుతోంది.
మూడు వేల ఏళ్ల క్రితం మొదటి టెంపుల్ నిర్మాణం
ఈజిప్ట్ లో 400 సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉన్న తర్వాత ఇజ్రాయేల్ కు తిరిగి వచ్చారు యూదులు. వాళ్ళ మూడో రాజు సొలొమోను దేవుడి ఆదేశం మేరకు 957BCE లో ఒక దేవాలయాన్ని నిర్మించారు. యూదులకు సంబంధించి అది అత్యంత పవిత్రమైన స్థలం. 500 ఏళ్లపాటు వాళ్లు అక్కడే పూజలు జరిపారు. సొలోమోన్ తర్వాత ఇజ్రాయిల్ రెండు రాజ్యాలుగా విడిపోయినా జెరూసలేం లోని ఈ ఆలయంలో ఇశ్రాయేల్, యూదా అనే ఈ రెండు రాజ్యాల ప్రజలు పూజలు జరుగుతూ ఉండేవారు. యూదులు కాని వారు ఎవరైనా ఆలయం లోకి ప్రవేశిస్తే వారికి మరణ శిక్ష విధించేవారు. 720BCE లో అస్సిరియా సామ్రాజ్యం (నేటి సిరియా కేంద్రం గా ఏర్పడ్డ పెద్ద సామ్రాజ్యం ) దండెత్తి ఇశ్రాయెల్ రాజ్యాన్ని నాశనం చేసింది.

Solomon temple 957BC -587
586 BCE లో బాబీలోన్ (నేటి ఇరాక్ ) చక్రవర్తి నెబుకద్నేజర్ 2 సైన్యాలు యూదా రాజ్యాన్ని కూడా జయించి జెరూసలేంలోని ఆలయాన్ని పూర్తిగా నాశనం చేసాయి. అసమయం లో సొలొమోను టెంపుల్ లో దేవుని ప్రతిరూపం గా పూజలు అందుకునే దేవుని మందసం (Ark of Covenant ) అనే బంగారపు బాక్స్ ని యూదులు ఎక్కడో దాచిపెట్టారు అని నమ్ముతారు. నెబుకద్నేజర్ 2 జెరూసలేమును నాశనం చేయడమే కాకుండా యూదులను బాబిలోన్ తీసుకుపోయి బానిసలుగా వాడుకున్నాడు. ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన "హ్యాంగింగ్ గార్డెన్స్" ను నిర్మించింది ఆయనే. యూదులు 70 ఏళ్ల పాటు బాబీలోన్ లోనే బానిసలుగా, ఖైదీలుగా ఉండిపోయారు.
సెకండ్ టెంపుల్ పిరియడ్ (516BCE -70CE)
539BCE లో బాబిలోన్ ని జయించి పర్షియన్ సామ్రాజ్యం ఆవిర్భవించింది. అదే నేటి ఇరాన్. దాని చక్రవర్తి సైరస్ ది గ్రేట్. ఇతను సెక్యులర్ పాలకుడు. అంతకుముందు బాబీలోన్ జయించిన రాజ్యాల ప్రజలను విడుదల చేసి వారి వారి రాజ్యాలకు వెళ్లిపోనిచ్చాడు. బాబిలోన్ లో 70 ఏళ్ల బానిసత్వం తర్వాత యూదుల్లో చాలామంది జెరూసలేం కు తిరిగివచ్చారు. వారికి వారి టెంపుల్ మళ్ళీ కట్టుకోవడానికి సైరస్ చక్రవర్తి అనుమతి ఇవ్వడంతో పాటు ఆ ఆలయం లోని పూజా సామాగ్రి ని సైతం తిరిగి ఇచ్చేయడం తో 516BCE లో జెరూసలేం లో రెండో టెంపుల్ కట్టారు. ఈ ఆలయం కూడా 500ఏళ్ల పాటు యూదులకు పవిత్రా స్థలం గా మారింది. 332BCE లో అలెగ్జాండర్ పర్షియాను జయించిన తరువాత ఇరాన్ తో పాటు జెరూసలేం కూడా గ్రీక్ పాలకుల చేతిలోకి వెళ్ళింది. అయితే అలెగ్జాండర్ గాని ఆ తర్వాత గ్రీకులు గానీ జెరూసలేం లోని టెంపుల్ జోలికి వెళ్లలేదు. పైగా ఆలయ సంప్రదాయాన్ని గౌరవించారు అని యూదు గ్రంథాలు చెబుతున్నాయి.

Second temple -516BCE -70AD
63BCE నాటికి జెరూసలేం రోమన్ల చేతిలోకి వెళ్ళింది. జీసస్ క్రైస్ట్ టైం కి ( 6BC -30CE) ఈ సెకండ్ టెంపుల్ ని స్థానిక పాలకుడు హేరోద్ ది గ్రేట్ బాగా డెవలప్ చేశాడు. అయితే యూదులు పదేపదే తమపై తిరుగుబాటు చేస్తూ ఉండడంతో రోమన్ చక్రవర్తి టైటస్ 70CE లో జెరూసలేమను పూర్తిగా నాశనం చేసి రెండు ఆలయాన్ని కూడా తగలబెట్టేసాడు. ఈ కార్యక్రమం నెలలపాటు సాగింది.
సెకండ్ టెంపుల్ కి సంబంధించి ప్రస్తుతం మిగిలి ఉన్న శిథిలాలు,గోడలు
అంతేకాకుండా ఆలయంలోని పూజా సామాగ్రిని రోమ్ కి తీసుకువెళ్లి విజయోత్సవం కూడా జరుపుకున్నారు. దీనికి గుర్తుగా రోమ్ లో నిర్మించిన ఆర్క్ అఫ్ టైటస్ ఇప్పటికి నిలిచి ఉంది. జెరూసలేం లో ఆలయం మొత్తం ధ్వంసం అయినా దానికి సంబంధించిన గోడలు మాత్రం మిగిలి ఉన్నాయి.

సెకండ్ టెంపుల్ నాశనం తర్వాత ఆలయం లోని పూజా సామాగ్రిని రోమ్ కి తీసుకుని పోతున్న సైనికులు.. Arch of Titus (Rome ). -81CE
మూడో టెంపుల్ కోసం రెండు వేల ఏళ్లుగా యూదుల ఎదురుచూపులు
70CE లో జెరూసలేం టెంపుల్ నాశనం అయిపోయిన తర్వాత రెండు వేల సంవత్సరాలుగా మూడు ఆలయం కోసం ఎదురుచూస్తున్నారు యూదులు. జెరూసలేం లో ఎప్పుడైతే మూడో ఆలయం నిర్మాణం జరుగుతుందో అప్పుడు వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న "మెస్సియా " వచ్చి ప్రపంచవ్యాప్తంగా యూదుల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని వాళ్ల మత గ్రంథాల్లో ఉంది. యూదులు జీసస్ క్రైస్ట్ ను మెస్సియా గా అంగీకరించరు. క్రైస్తవులకు యూదులకు ఉన్న తేడా అదే.

ప్రస్తుతం జెరూసలేం లో టెంపుల్ ఉన్న స్థానంలో ముస్లింలు నిర్మించిన Dome of the Rock -691CE
ప్రస్తుతం టెంపుల్ స్థానంలో ఉన్న ఆల్ -అక్స మసీద్
6,7 శతాబ్దాల్లో ముస్లింలు జెరూసలేం ను ఆక్రమించుకొని టెంపుల్ ఉన్న స్థానంలో డోన్ ఆఫ్ ది రాక్ అనే నిర్మాణాన్ని ఆల్ అక్స మసీదును నిర్మించారు. మొహమ్మద్ ప్రవక్త ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళిపోయాడని వాళ్ళ నమ్మకం. అలాగే జీసస్ జీవితానికి సంబంధించిన అనేక ఘట్టాలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉండడంతో క్రిస్టియన్స్ కూడా జెరూసలేం చాలా పవిత్రం. ఇలా ప్రపంచంలోనే కీలకమైన మూడు మతాలు జెరూసలేం పై పట్టు కోసం శతాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

ఇరాన్ పై యుద్ధానికి మతం సెంటిమెంటును వాడుకుంటున్న నెతన్యాహు
మొదట్లో ఇజ్రాయిల్ నేత నెతన్యాహు తనను తాను సెక్యులర్ వాదిగా చెప్పుకునే వాడు. కానీ ప్రస్తుతం తన ప్రసంగాల్లో థర్డ్ టెంపుల్ నిర్మాణం గురించి ప్రస్తావిస్తున్నారు.మరివైపు ఇరాన్ ఫై యుద్దానికి అసలు కారణం బెంజిమెన్ నేతన్యాహు అని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. అమెరికా ను రెచ్చగొట్టే ఇరాన్ ఫై యుద్దానికి దిగేలా చేసింది ఆయనే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తనపై వస్తోన్న ఆరోపణలు, వివాదాల నుండి బయటపడి మళ్ళీ ఇజ్రాయెల్ పగ్గాలు చేపట్టడం కోసం నేతన్యాహు వేసిన మాస్టర్ ప్లాన్ అనే వాదన రోజురోజుకూ బలపడుతోంది. దానికి తగ్గట్టే యూదుల్లో మతం సెంటిమెంట్ మరింత బలంగా చేయడం కోసం థర్డ్ టెంపుల్ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు నెతన్యాహు.
ప్రపంచ ముస్లింలకు పెద్దన్నగా ఉన్న ఇరాన్ ను జయించి ముస్లిం ఆదిపత్యాన్ని దెబ్బ కొట్టడంతో పాటు మరోవైపు జెరూసలేం లో ఉన్న టెంపుల్ ఆఫ్ డోమ్ స్థానంలో యూదుల మూడు ఆలయ నిర్మాణం మొదలు పెట్టడం ద్వారా మొదలు పెట్టడం ద్వారా యూదుల ధర్మ గ్రంధాల్లో చెప్పబడిన లేఖనాలను నెరవేర్చే పాలకుడి ఇమేజ్ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల మద్దతు కూడగట్టడం తో పాటు తనపై ఉన్న నెగిటివిటీ ని మతాన్ని అడ్డుపెట్టుకుని చెరిపేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచన గా విశ్లేషణలు వెలువడుతున్నాయి. దానితో అటు ఇరాన్ యుద్ధ పరిణామాలతో పాటు జెరూసలేం లోని సున్నిత ప్రాంతాల విషయంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందనే యాంగిల్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది.























