Wayanad Landslide: వయనాడ్లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్
Wayanad Landslide: కేరళలోని వయనాడ్లో కొండచరియలు మరోసారి భీభత్సం సృష్టించాయి. ఓ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు సమీపంలో హరికేన్ మాదిరిగా మట్టి ముంచెత్తింది. CCTV విజువల్ చూస్తే. .ఒళ్లు గగుర్పొడుస్తుంది.

Kerala landslide live video: కేరళంలోని వయనాడ్లో Landslide మరోసారి అలజడి సృష్టించింది. కొండచరియ విరిగిపడి ఘోర ప్రమాదం సంభవించింది! కళ్లాడి సమీపంలోని మీనాక్షి బ్రిడ్జ్ వద్ద.. ప్రతిపాదిత టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్ నిర్మాణ స్థలంలో ఈ దారుణం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండ ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు ఆచూకీ లేకుండా పోయారు.
ప్రమాదానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందనే దానికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ (CCTV) విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రమాదానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆంబులెన్స్ సీసీటీవీలో ఇది రికార్డ్ అయింది.
ఈ సీసీటీవీ విజువల్స్ గమనిస్తే.. ప్రమాదం ఎంత వేగంగా జరిగిందో అర్థమవుతుంది. కొండపై నుంచి బురద, కొండరాళ్లు ఒక్కసారిగా ఉప్పెనలా కిందకు దూసుకొచ్చాయి. అక్కడ ప్రాజెక్ట్ పనుల్లో ఉన్న కార్మికులు, స్థానికులు ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీశారు.
అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక భారీ ఇంధన ట్యాంకర్ లారీ ఆ బురద ప్రవాహానికి కాగితపు పడవలా కొట్టుకుపోయింది. ట్యాంకర్తో పాటు మరో అర డజను వాహనాలు దెబ్బతిన్నాయి.
స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. మొదట చిన్న శబ్దం వినిపించింది. దాంతో అందరూ అప్రమత్తమై షాపుల నుంచి బయటకు పరిగెత్తారు. చూస్తూనే ఉండగానే ఆ చిన్న కొండచరియ.. ఒక భారీ విపత్తుగా మారిపోయింది. బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న జనం, కూలీలు పారిపోయే లోపే సర్వస్వం తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 10 నుంచి 15 మంది వరకు బురదలో పూడుకుపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బురదలో నుంచి ఇప్పటివరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసి మేప్పాడి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
అయితే, ఈ ప్రమాదం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. టన్నెల్ నిర్మాణం కోసం తీసిన మట్టిని, శిథిలాలను జూన్ 20 లోపే అక్కడి నుంచి తొలగించాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశించినా, కాంట్రాక్టర్ దాన్ని పట్టించుకోలేదని సీఎం సతీశన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వయనాడ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ (Red Alert) ప్రకటించింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















