Tungabhadra Dam 33 Crest Gates Inauguration: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం - తుంగభద్ర కార్యక్రమంలో సీఎంల కీలక ప్రకటనలు
Inter state Water Disputes: గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధానం జరిగితే దక్షిణాదికి నీటి సమస్యలు ఉండవని ముఖ్యమంత్రులు చర్చించారు. ఈ అనుసంధానికి కేంద్రం అండగా ఉంటుందని మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు.

Tungabhadra River Interlinking : రాజకీయాల్లో అత్యంత అరుదైన, దక్షిణాది జలవనరుల చరిత్రలోనే ఒక అపూర్వ మైలురాయిగా నిలిచే చారిత్రాత్మక ఘట్టానికి కృష్ణానది ఉపనది అయిన తుంగభద్ర వేదికైంది. కర్ణాటకలోని విజయనగర జిల్లా హోసపేట సమీపంలో గల మునిరాబాద్ వద్ద తుంగభద్ర జలాశయానికి పూర్తిగా పునరుద్ధరించిన 33 నూతన స్పిల్వే క్రస్ట్ గేట్లను గురువారం ఘనంగా జాతికి అంకితం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కలిసి సంయుక్తంగా ఈ గేట్లను ప్రారంభించారు. గతంలో చోటుచేసుకున్న జల విపత్తును సవాల్గా తీసుకుని, మూడు రాష్ట్రాల సమన్వయంతో రికార్డు సమయంలో దాదాపు రూ. 51 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక గేట్ల మార్పిడి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
నదుల అనుసంధానమే మార్గం : సీఎం చంద్రబాబు
గేట్ల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు ఒకే వేదికపైకి రావడం చారిత్రాత్మక అంశమన్నారు. "తుంగా పానం.. గంగా స్నానం" అనే సామెతను గుర్తు చేస్తూ, తుంగభద్ర నీరు అంత పవిత్రమైనదని కొనియాడారు. గతేడాది 19వ గేట్ కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కన్నయ్య నాయుడు ద్వారా స్టాప్లాక్ గేట్ అమర్చి నీరు వృధా కాకుండా కాపాడామని, ఇప్పుడు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి పనిచేసి మొత్తం 33 గేట్లను మార్చడం అభినందనీయమన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల నీటి లభ్యత తగ్గుతున్న తరుణంలో నదుల అనుసంధానమే దేశానికి అన్స్టాపబుల్ వృద్ధిని ఇస్తుందని, ప్రధాని మోదీ నేతృత్వంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ లాగే గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా దక్షిణాది రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
Revanth Reddy is dynamic, but he doesn’t compromise on Telangana’s rights. I am also impressed about it - AP CM Chandrababu Naidu pic.twitter.com/4ceWjGw1If
— Naveena (@TheNaveena) June 25, 2026
రాష్ట్రాల మధ్య పంచాయతీలు వద్దు.. పరస్పర సహకారమే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ కేవలం ఒక టెక్నికల్ విజయం మాత్రమే కాదని, మూడు రాష్ట్రాల కరువు జిల్లాల సమస్యల పరిష్కారానికి పడిన కీలక అడుగని అభివర్ణించారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం , తెలంగాణలోని మహబూబ్నగర్ ప్రజల వలసల బాధలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్రాల మధ్య జల వివాదాల పంచాయతీలు పక్కనబెట్టి, కేవలం రైతుల శ్రేయస్సు కోసమే సమస్యలను పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు చట్టబద్ధంగా రావలసిన 10 టీఎంసీల నీరు ఇంకా రావడం లేదని ప్రస్తావిస్తూ.. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద ఉన్న తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు సహకరించాలని కోరారు. వివాదాలు వీడి పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే అంతిమంగా రైతులకు మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy appealed to union minister for Jal Shakti CR Patil to find a permanent solution to the interstate water sharing issue of Tungabhadra river expeditiously
— Congress for Telangana (@Congress4TS) June 25, 2026
పంచాయితీ కావాలా...
సమస్య పరిష్కారం కావాలా అంటే... నేను పరిష్కారమే కోరుకుంటా
కర్ణాటకలోని మునీరాబాద్… pic.twitter.com/LtouiIPzfF
రైతాంగానికి రక్షణ కవచం.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హర్షం
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్యామ్ నిర్మించిన 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాత గేట్ల స్థానంలో హై-గ్రేడ్ స్టీల్ గేట్లను అమర్చామని తెలిపారు. గతేడాది ప్రమాదం జరిగినప్పుడు కేవలం పాత గేటుకు ప్యాచ్ వర్క్ చేయకుండా, భవిష్యత్ తరాల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం 33 గేట్లను మార్చేలా అంతరాష్ట్ర సమన్వయంతో బోర్డు నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ఈ నూతన గేట్ల ఏర్పాటుతో రాబోయే సీజన్లో పూర్తి స్థాయిలో 105 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు జలాశయం సురక్షితంగా సిద్ధమైందన్నారు. కర్ణాటకలో 9 లక్షల ఎకరాలు, ఏపీలో 6 లక్షల ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సుస్థిరమైన సాగునీరు అందుతుందని, నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పూడికతీత అంశాలపై కూడా మూడు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం శుభపరిణామమని వారు పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ఐక్యత దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ జల వనరుల నిర్వహణలోను, అంతరాష్ట్ర సమస్యల పరిష్కారంలోనూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చూపిన చొరవ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, యూపీ-ఎంపీల మధ్య ‘కెన్-బెత్వా’ ప్రాజెక్ట్ తరహాలోనే దక్షిణాదిలోనూ గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మూడు రాష్ట్రాల రైతుల నీటి హక్కులను కాపాడుతూ, తాగునీటి ఎద్దడిని నివారించడమే లక్ష్యంగా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాలకు పూర్తి సాంకేతిక, ఆర్థిక మద్దతును అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు






















