Viral Girl Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు - ఇంత ఈజీగా దొరికిపోయాడా?
Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు అయింది. మోనాలిసా మైనర్ అని తేలడమే దీనికి కారణం.

POCSO case registered against viral girl Monalisa husband: కుంభమేళాలో వైరల్ అయిన పూసల అమ్మాయి మోనాలిసా బోస్లే వ్యవహారం మరోసారి చట్టపరమైన, సామాజిక వివాదంగా మారింది. మోనాలిసా భోసలే, ఫర్మాన్ ఖాన్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో మోనాలిసా మైనర్ అని, ఆమెను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. మోనాలిసా వయసుపై వివాదం ముదరడంతో, మధ్యప్రదేశ్ పోలీసులు ఆమె భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో (POCSO) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుంభమేళాలో వైరల్ అయిన సమయంలో మీడియా కథనాల ప్రకారం ఆమె వయసు 16 ఏళ్లుగా ఉండగా, పెళ్లి సమయానికి ఆమె మైనర్ అని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ జరిపిన విచారణలో తేలింది.
తెరపైకి అసలు వయసు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు!
నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య పర్యవేక్షణలో కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన లోతైన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 30, 2009 . అంటే 2026 మార్చి 11న కేరళలో పెళ్లి జరిగే సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల రెండు నెలలు మాత్రమే. పెళ్లి కోసం నకిలీ బర్త్ సర్టిఫికేట్లు సృష్టించి ఆమెను మేజర్గా చూపించారని దర్యాప్తులో తేలడంతో ఆ పత్రాలను అధికారులు రద్దు చేశారు.
పోక్సో కేసు.. సీరియస్ సెక్షన్లు
విచారణ నివేదిక ఆధారంగా మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా పోలీసులు ఫర్మాన్ ఖాన్పై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోక్సో చట్టంతో పాటు, భారతీయ న్యాయ సంహిత (BNS), మోనాలిసా గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా చార్జీలు నమోదు చేశారు. మైనర్ వివాహానికి సహకరించిన వారిని కూడా ఈ కేసులోకి లాగే అవకాశం కనిపిస్తోంది.
కేరళ టూ ఢిల్లీ.. విచారణ వేగం
ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో పాటు, చిత్ర నిర్మాత సనోజ్ మిశ్రా కూడా ఇందులో ప్రవేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా మోనాలిసా ఆయనపై అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేశారు. అయితే, చట్టపరంగా వయసు తక్కువని తేలడంతో ఇప్పుడు ఫర్మాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఎన్సీఎస్టీ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని, ఏప్రిల్ 22న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని కేరళ, మధ్యప్రదేశ్ డీజీపీలను ఆదేశించింది. షూటింగ్ కోసం కేరళ వెళ్లిన మోనాలిసా, తన తండ్రి అభ్యంతరాలను కాదని కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కే-స్మార్ట్ యాప్ ద్వారా పెళ్లిని రిజిస్టర్ చేసుకుంది. అయితే, అక్కడ సమర్పించిన ఆధార్, బర్త్ సర్టిఫికేట్లు అన్నీ ఫోర్జరీవని తేలడంతో ఈ వైరల్ ప్రేమకథ ఇప్పుడు కటకటాల దిశగా సాగుతోంది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా క్రేజ్ చట్టబద్ధమైన పకడ్బందీతనం ముందు ఎలా ఓడిపోతుందో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ.
వైరల్ పాపులారిటీ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది. డిజిటల్ యుగంలో ఒక సామాన్యమైన అంశం క్షణాల్లో దేశవ్యాప్త చర్చకు దారితీస్తుందని, అయితే అది చట్టం, గుర్తింపు, సామాజిక విలువలతో ముడిపడినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ఈ కేసు స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం వివిధ దర్యాప్తు సంస్థలు వాస్తవాలను వెలికితీసే పనిలో ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















