Congress Kharge: దమ్ముంటే రాజ్యాంగం నుంచి సెక్యూలర్, సోషలిస్ట్ పదాలను తీసేయాలి - హైదరాబాద్ నుంచి బీజేపీకి ఖర్గే సవాల్
Congress LB Nagar Meting: 11 ఏళ్లలో తెలంగాణకు మోదీ ఏమీ ఇవ్వలేదని.. కాంగ్రెస్ పార్టీ యాభైకిపైగా కేంద్ర సంస్థలను ఇచ్చిందని ఖర్గే అన్నారు. ఎల్బీనగర్ లో నిర్వహించిన సభలో ప్రసంగించారు.

Congress President Kharge: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ లేదా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ కాంగ్రెస్ ఆ రెండు పార్టీలను ఓడించి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో కర్గే ప్రసంగంచారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నుంచి ప్రతి కార్యకర్త కలిసిగట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" అనే కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ సభను నిర్వహించారు.
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు 11ఏళ్లలో ఏమీ ఇచ్చారో చెప్పాలన్నారు. మోదీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. తెలంగాణలో కులగణన దేశానికి రోల్ మోడల్ అని ఖర్గే తెలిపారు. పేదలకు సన్నబియ్యం, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా కాంగ్రెస్ ఏం చెప్పిందో అది తప్పకుండా చేసిందని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు పోరాడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. మోదీ, అమిత్ షా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ వాళ్లు దేశానికి, తెలంగాణకు ఏమీ చేయలేదని.. నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలోనే దేశం చాలా అభివృద్ధి చెందిందని తెలిపారు.
పాకిస్తాన్ ను ఏమో చేశామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు, యుద్ధాన్ని ఎందుకు ఆపారో చెప్పాలని ఖర్గే సవాల్ చేశారు. అమెరికా యుద్ద నౌకల్ని పంపినా ఇందిరా బెదరలేదన్నారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేశారని, మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. 42 దేశాల్లో పర్యటించిన మోదీ ఇండియాలోని మణిపూర్ లో ఎందుకు పర్యటించడం లేదని నిలదీశారు. బీహార్ ఎన్నికల మీదున్న శ్రద్ధ దేశ భద్రత మీద లేదన్నారు. దేశం కోసం కాంగ్రెస్ లో చాలామంది ప్రాణాలు ఇచ్చారని, అలాంటివాళ్లు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో ఉంటే చూపించాలని సవాల్ చేశారు. రాజ్యాంగం నుంచి దమ్ముంటే సెక్యూలర్, సోషలిస్ట్ పదాలను తీసేయాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కార్యకర్తలేనన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే .
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) July 4, 2025
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడిన ఖర్గే . pic.twitter.com/nV5lQi1HJb
సభకు ముందు, ఖర్గే గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సమావేశాలలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికల సన్నాహాలు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 18 నెలల పనితీరును సమీక్షించారు.





















