Monsoon in India 2026: ఈ ఏడాది భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Monsoon for India | భారత్లో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అందుకు ఎల్ నినో కారణం అవుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.

Skymet Prediction | భారత్లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ వెల్లడించింది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగంలో ఎల్ నినో (El Nino) ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది. ఈ 4 నెలల నైరుతి రుతుపవన కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 868.6 మి.మీ కాగా, ఇందులో కేవలం 94 శాతం మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేయనున్న అంచనా వివరాలపై ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే వారం IMD తన తొలి ముందస్తు అంచనాలను విడుదల చేయనుందని తెలిసిందే. భారత్లో ఏడాదిలో నమోదయ్యే వర్షపాతంలో దాదాపు 70 శాతం వరకు నైరుతి రుతుపవనాల ద్వారా సాధ్యమవుతుంది. భారత జిడిపికి వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు అత్యంత కీలకమని తెలిసిందే. దేశంలోని మొత్తం జనాభాలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది.
రైతులకు అతిముఖ్యమైనది ఖరీఫ్ సీజన్ సీజన్. ఈ సాగు ప్రధానంగా జూన్, జూలై నెలల్లో మొదలవుతుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవనాలు సమయానికి రావడం, అవి దేశ వ్యాప్తంగా త్వరగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా జూన్ 1న లేదా తొలి వారంలో కేరళను తాకే రుతుపవనాలు, జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశమంతటా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాయి.
ఎల్ నినో ప్రభావంతో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం
పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడాన్ని ఎల్ నినో అని వ్యవహరిస్తారు. ఈ ఎల్ నినో రావడం సాధారణంగా రుతుపవనాలను బలహీనపరుస్తుంది. అందుకు భిన్నంగా సముద్ర ఉపరితలం చల్లగా మారితే దాన్ని లా నినా (La Nina) అని అంటారు. లా నినా ఏర్పడితే వర్షపాతం పెరుగుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కనిపిస్తుండటంతో ఈ ఏడాది భారత వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న నెలకొంది. అయితే వచ్చే వారం భారత వాతావరణ శాఖ విడుదల చేయనున్న అంచనా నివేదిక కోసం అటు వ్యవసాయ రంగంతో పాటు దానిపై ఆధారపడిన రంగాల వారు, కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
























