చిక్కుల్లో పడ్డ ఉదయనిధి స్టాలిన్, మనోభావాలు దెబ్బ తీశారంటూ కేసు పెట్టిన లాయర్లు
Sanatan Dharma Row: యూపీలోని రాంపూర్లో ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదైంది.
Sanatan Dharma Row:
ఉదయనిధి స్టాలిన్పై కేసు..
సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదైంది. ఆయన వ్యాఖ్యల్ని సమర్థించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేపైనా కేసు నమోదు చేశారు. మతాన్ని కించపరిచినందుకు, మనోభావాలు దెబ్బ తీసినందుకు యూపీలోని రామ్పూర్లో కేసులు నమోదయ్యాయి. లాయర్లు హర్ష్ గుప్త, రామ్ సింగ్ లోధి వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కంప్లెయింట్ ఇచ్చారు. తమ మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారని అన్నారు. ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గే...ఈ ఇద్దరు నేతలూ I.N.D.I.A కూటమిలో ఉన్న వాళ్లే. అందుకే రాజకీయంగానూ ఇది దుమారం రేపింది. స్టాలిన్ వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్ర స్థాయిలో మండి పడింది. కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా స్టాలిన్పై మండి పడ్డారు. ఇలాంటి కామెంట్స్ చేయడం వాళ్లకు ఇదేం మొదటి సారి కాదని విమర్శించారు.
Udhayanidhi Stalin, Priyank Kharge booked in UP's Rampur over Sanatan Dharma remarks at lawyers' complaint
— Press Trust of India (@PTI_News) September 6, 2023
ఇదీ జరిగింది..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చి చిక్కుల్లో పడ్డారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని...పూర్తిగా సమాజంలో నుంచి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి ఈ ధర్మం వ్యతిరేకం అని తేల్చి చెప్పారు. Sanatana Abolition Conference లో మాట్లాడిన సందర్భంలో ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు వరుస పెట్టి ట్వీట్లతో విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్పై కాంగ్రెస్ మౌనంగా ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. I.N.D.I.A కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకమే అని మండి పడుతున్నారు.
"కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. పూర్తిగా సమాజం నుంచి తొలగించాలి. డెంగ్యూ. మలేరియా, కరోనాను ఎలాగైతే నిర్మూలిస్తున్నామో...అదే విధంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతనం అనేది సంస్కృత పదం. సామాజిక న్యాయానికి ఇది పూర్తిగా విరుద్ధం"
- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి