Nayab Singh Saini: హరియాణా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
Nayab Singh: హరియాణా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Nayab Singh Saini Oath As Haryana New CM: లోక్ సభ ఎన్నికల ముందు హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఛండీగడ్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ, జేజేపీల మధ్య ఇబ్బందులు తలెత్తగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయనతో పాటు మంత్రి వర్గం సైతం ఒకేసారి గవర్నర్ కు రాజీనామాలు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేఎల్పీ సమావేశంలో నాయబ్ సింగ్ సైనీని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. పలువురు కీలక నేతల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. చివరకు నాయబ్ సైనీ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఈయన ఖట్టర్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పటివరకూ.. జననాయక్ జనతా పార్టీ (JJP)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ.. ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోక్ సభ సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలతో జేజేపీకి స్వస్తి పలికింది.
ఇదీ రాజకీయ నేపథ్యం
ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సైనీ 1996లో బీజేపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పార్టీలో పలు పదవులు చేపట్టి సేవలందించారు. 2005లో బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2014లో నారాయణ్ గడ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83 లక్షల మెజార్టీతో గెలుపొందారు. గతేడాది అక్టోబర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హరియాణా ఓబీసీల్లో సైనీల జనాభా దాదాపు 8 శాతంగా ఉంది. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడీ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్ కు సీఎం పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు, ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ, జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) కూటమిలో ఇబ్బందులు తలెత్తడంతో ఖట్టర్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ దుష్యంత్ చౌతాలా, మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖట్టర్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కర్నాల్ ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
Also Read: CAA: సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ - అమలుకు విరామం ఇవ్వాలని విజ్ఞప్తి
Before You Go
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
ట్రెండింగ్ వార్తలు






















