Dharmendra Political Career: ప్రభుత్వం నా మాట వినకపోతే పార్లమెంటు బిల్డింగ్ పైనుంచి దూకుతా.. అప్పట్లో ధర్మేంద్ర సంచలనం
Dharmendra Death News: లోక్ సభకు వెళ్ళాక పరిస్థితులు మారాయని ధర్మేంద్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ బికనీర్ నుంచి భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు, నవంబర్ 12న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోసం ఇంట్లో ఐసియు వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. బాలీవుడ్ హీ మ్యాన్గా పేరుగాంచిన ధర్మేంద్ర కన్నుమూశారన్న వార్త సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
ధర్మేంద్ర జీవితానికి సంబంధించి, ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన ఒక సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయింది. 2004 లోక్ సభ ఎన్నికల్లో భారత రాజకీయాల్లో షోలే చిత్రం ఛాయలు కనిపించాయి. ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ 'హీ మ్యాన్' ధర్మేంద్ర ఉత్సాహంగా మాట్లాడుతూ - 'ఒకవేళ ప్రభుత్వం నా మాట వినకపోతే, నేను పార్లమెంటు బిల్డింగ్ పైనుంచి దూకుతాను!' అని వ్యాఖ్యానించారు. ధర్మేంద్ర ఈ సినిమా తరహా వార్నింగ్ ఎన్నికల సమయంలో దుమారం రేపింది. కానీ రీల్ లైఫ్ లాంటి ఫలితాలు రాజకీయాల్లో కనిపించలేదు. ఘన విజయంతో పార్లమెంటుకు వెళ్లిన ధర్మేంద్ర కొన్ని సంవత్సరాలలోనే రాజకీయాలతో విసిగిపోయి పాలిటిక్స్కు గుడ్ బై చెప్పారు.
బిజెపికి ప్రచారంతో రాజకీయాల్లోకి ప్రవేశం
2004లో బిజెపి షైనింగ్ ఇండియా ప్రచారం ధర్మేంద్రను బాగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆయన శతృఘ్న సిన్హాతో కలిసి లాల్ కృష్ణ అద్వానీ (LK Advani)ని కలిశారు. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బిజెపి ధర్మేంద్రను రాజస్థాన్ లోని బికనీర్ సీటు నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. ప్రజాదరణ ఉన్న ధర్మేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్వర్ లాల్ దూడిని దాదాపు 60 వేల ఓట్ల తేడాతో ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు.
ఎన్నికల బరిలో షోలే స్టైల్
ఎన్నికల సమయంలో ధర్మేంద్ర తన షోలే సినిమాలోని డైలాగ్స్ చెబుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. 'ప్రభుత్వం నా మాట వినకపోతే, నేను పార్లమెంటు పైనుంచి దూకుతాను!' అని చెప్పడంతో అప్పట్లో సంచలనం. ఇది విన్న మద్దతుదారుల్లో రాజకీయాల్లో ఆయన గట్టిగా నిలబడతారని ఉత్సాహం కనిపించింది.
విజయం తర్వాత ఆరోపణలు
లోక్ సభకు చేరుకున్న ఆయన రాజకీయాలను తట్టుకోలేకపోయారు. ధర్మేంద్ర బికనీర్ లో ప్రజలను కలవడానికి తక్కువగా వెళ్తున్నారని, పార్లమెంటులో హాజరుశాతం చాలా తక్కువగా ఉందని, సినిమాల షూటింగ్ లేదా ఫామ్హౌస్లో బిజీగా ఉంటారని ఆరోపణలు రావడంతో నొచ్చుకున్నారు. కొంతమంది ఆయనను సమర్థిస్తూ, ఆయన ప్రత్యక్షంగా రాకపోయినా, వెనుక నుంచి పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారని సపోర్ట్ చేశారు. మొత్తంమీద ఆయన ఇన్ యాక్టివ్ ఎంపీగా విమర్శలు ఎదుర్కొన్నారు.
రాజకీయాలపై విరక్తి
2009లో పదవీకాలం ముగియగానే ధర్మేంద్ర రాజకీయాలను స్వస్తి పలికారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. రాజకీయాలు తనకి సరైన వేదిక కాదని అంగీకరించారు. 'నేను పని చేసేవాడిని, క్రెడిట్ మరొకరు తీసుకునేవారు. బహుశా పాలిటిక్స్ నాకు సరికాదు.. అన్నారు. ఆయన కుమారుడు సన్నీ డియోల్ కూడా తండ్రికి రాజకీయాలు నచ్చలేదని, ఎన్నికల్లో పోటీ చేయడంపై పశ్చాత్తాపం ఉందన్నారు.
ట్రెండింగ్ వార్తలు























