Gulf danger zone: జరుగుతున్నదంతా అతి ప్రచారమే - దుబాయ్, అబుదాబిల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..?
Gulf Indians: దుబాయ్, అబుదాబి, ఇతర గల్ఫ్ నగరాల్లో భారతీయులు ఎలా ఉన్నారోనని కుటంబసభ్యులు టెన్షన్ పడుతున్నారు. నిజానికి అక్కడ ఎలాంటి ముప్పూ ప్రజలకు లేదు.

Conditions are normal in Dubai and Abu Dhabi: ఇరాన్ దాడులతో దుబాయ్, అబుదాబిల్లోనూ ప్రజలకు ముప్పు ఉందని కొంత మంది కంగారు పడుతున్నారు. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న మాట వాస్తవమే కానీ, సామాన్య ప్రజలందరి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఎవరూ చెప్పడం లేదు. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 28 నుండి జరిగిన దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ పౌరులు మరణించారు. సుమారు 58 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లలో 90 శాతానికి పైగా యూఏఈ రక్షణ వ్యవస్థలు గాలిలోనే అడ్డుకున్నాయి. అయితే, కూల్చివేసిన క్షిపణుల శకలాలు నివాస ప్రాంతాలపై పడటం వల్ల కొద్దిపాటి నష్టం జరిగింది. కొంత మందికి గాయాలయ్యాయి.
అక్కడ అసలేం జరుగుతోంది?
ఇరాన్ తన దేశంపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను, చమురు క్షేత్రాలను, కొన్ని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జెబెల్ అలీ పోర్ట్ , అబుదాబిలోని జాయెద్ ఎయిర్పోర్ట్ వంటి ప్రాంతాల సమీపంలో పేలుళ్లు సంభవించాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయడం, స్టాక్ మార్కెట్లను నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టారు. దీనివల్ల నిత్య జీవితానికి కొంత ఆటంకం కలిగినా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయి.
ప్రచారం జరుగుతున్నంత దారుణంగా ఉందా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు , వార్తలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా రిపోర్టుల ప్రకారం.. ప్రధాన నగరాల్లో సైరన్లు మోగడం, ప్రజలు షెల్టర్లలోకి వెళ్లడం వంటివి జరిగినప్పటికీ, జనజీవనం పూర్తిగా స్తంభించలేదు. దుబాయ్ మాల్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు సాధారణంగానే తిరుగుతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, అమెరికా స్థావరాలు ఉన్న ప్రాంతాలు , చమురు శుద్ధి కర్మాగారాల సమీపంలో ఉండేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ప్రవాస భారతీయుల పరిస్థితి
గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు నివసిస్తున్నారు. ప్రస్తుతానికి నివాస ప్రాంతాల్లో పెద్దగా దాడులు జరగలేదని, రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అక్కడి వారు చెబుతున్నారు. అయినప్పటికీ, పాఠశాలలకు సెలవులు ప్రకటించడం , వర్క్ ఫ్రమ్ హోమ్ సూచించడంతో కొంత అనిశ్చితి నెలకొంది. భారత రాయబార కార్యాలయం కూడా పౌరులను అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
మొత్తంగా చూస్తే, గల్ఫ్ దేశాలు యుద్ధ వాతావరణంలో ఉన్నా.. అక్కడి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు పౌరులకు రక్షణగా నిలుస్తున్నాయి. బయట దేశాల్లో జరుగుతున్న ప్రచారం కొంత వరకు అతిశయోక్తిగా ఉన్నప్పటికీ, క్షిపణి దాడులు , డ్రోన్ల బెడద ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. స్థానిక ప్రభుత్వాలు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లను చూసి ఆందోళన చెందవద్దని నిపుణులు సూచిస్తున్నారు.























