Banakacharla Update: బనకచర్లపై కేంద్రం సంచలన నిర్ణయం - 12 మందితో నిపుణుల కమిటీ !
Banakacharla expert committee: బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఐదుగురి చొప్పున పేర్లు పంపాలని ఏపీ, తెలంగాణకు లేఖలు రాసింది.

Central Govt to form an expert committee on Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర జలశక్తి శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. అందుకే సాంకేతిక, ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడానికి 12 మంది సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కమిటీలో ఏపీ , తెలంగాణ నుంచి ఐదుగురు నిపుణుల చొప్పున పేర్లను పంపాలని కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్రాలను కోరింది. అదనంగా, కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులను ఈ కమిటీలో నియమించనుంది.
గోదావరి నది వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు కొత్త ఆయకట్టు, 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గోదావరి నదిలో తమకు కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను హరిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు 1980 గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు , ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ఆరోపిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి బోర్డు, , CWCకు లేఖలు రాశారు. జనవరి 22, 2025న రాసిన లేఖలో, ఏపీ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సమర్పించకుండా నిలువరించాలని కోరారు. తర్వాత కేంద్రమంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బనకచర్ల వివాదాన్ని పరిశీలించడానికి, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక , ఆర్థిక అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ 12 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ఏపీ , తెలంగాణ నుంచి సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉంటారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)ను సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కు సమర్పించింది. ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఏపీ కేంద్రానికి తెలిపింది. తెలంగాణ అభ్యంతరాల కారణంగా కేంద్ర జలశక్తి శాఖ గోదావరి , కృష్ణా నదీ యాజమాన్య బోర్డులతో సంప్రదించి, తెలంగాణ అభిప్రాయాలను సేకరించిన తర్వాత మాత్రమే సాంకేతిక , ఆర్థిక అంచనాలపై ముందుకెళ్తామని స్పష్టం చేసింది
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (TOR)ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు చెందిన పర్వేష్ వెబ్సైట్లో నమోదు చేసింది. అయితే, ఎక్స్పర్ట్స్ అప్రైసల్ కమిటీ (EAC) ఈ ప్రతిపాదనలను పరిశీలించి వెనక్కి పంపినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో తెలిపారు.





















