Bengal BJP Manifesto 2026: యువత మహిళలకు నగదు బదిలీ హామీలు - వరాల వర్షం కురిపించిన బీజేపీ - బెంగాల్పైనే గురి!
Bengal: బీజేపీ బెంగాల్ మేనిఫెస్టో 2026 ను అమిత్ షా విడుదల చేశారు. యువత, మహిళలకు నగదు బదిలీ హామీలను బీజేపీ ఇచ్చింది.

Bengal BJP Manifesto: బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తన 'సంకల్ప పత్రాన్ని' విడుదల చేసింది. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఈ మేనిఫెస్టోను నమ్మకానికి చిహ్నంగా అభివర్ణించారు. గత 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రం చీకటి యుగంలోకి వెళ్లిందని, ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని ఆయన ఆరోపించారు. బెంగాల్ను నిరాశ నుండి బయటకు తీసుకువచ్చి, ప్రధాని మోదీ ఆశించిన అభివృద్ధి చెందిన భారత్ దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు ఈ పత్రం ఒక రోడ్మ్యాప్గా పనిచేస్తుందని పేర్కొన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే ప్రతి మహిళా లబ్ధిదారు ఖాతాలో నెలకు 3000 రూపాయలు జమ చేస్తామని పార్టీ వాగ్దానం చేసింది. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని, గర్భిణీలకు 21 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. సుమారు 75 లక్షల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడమే తమ లక్ష్యమని, వారి భద్రత కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.
ప్రభుత్వ ఉద్యోగులు, యువతకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని, పెండింగ్లో ఉన్న డీఏను చెల్లిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయల భృతి కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తక్షణమే అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతికి (UCC) శ్రీకారం చుడతామని పార్టీ స్పష్టం చేసింది.
శాంతిభద్రతలు మరియు చొరబాట్ల అంశంపై బీజేపీ కఠిన వైఖరిని చాటింది. అక్రమ చొరబాటుదారుల గుర్తింపు, తొలగింపు మరియు బహిష్కరణ ప్రక్రియలో 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తామని తెలిపింది. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని, రాజకీయ హింసపై విచారణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. టీఎంసీ హయాంలో జరిగిన అవినీతి, రాజకీయ హింసపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అమిత్ షా హెచ్చరించారు.
కోల్కతా నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో విస్తరణ, నౌకాశ్రయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ పేర్కొంది. ఉత్తర బెంగాల్లో ఐఐటీ, ఎయిమ్స్, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని, టీ తోటల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. వందేమాతరం మ్యూజియం ద్వారా బెంగాల్ సంస్కృతిని కాపాడుతామని, సిండికేట్ వ్యవస్థను రద్దు చేసి పారదర్శక పాలన అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ట్రెండింగ్ వార్తలు





















