Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
TVK vs Rajini Fans: రజనీకాంత్ పై టీవీకే నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రజనీ ఫ్యాన్స్ అంతా కలిసి టీవీకేపై యుద్దం ప్రకటించారు.

Aadhav Arjuna comments on Rajinikanth create a stir: విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన ప్రముఖ నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార డీఎంకే , సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
డీఎంకే బెదిరింపుల ఆరోపణ
విజయ్ పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ఆధవ్ అర్జున ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి డీఎంకే ఇచ్చిన బెదిరింపులే కారణమని సంచలన ఆరోపణ చేశారు. రజనీకాంత్ రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్న తరుణంలో, డీఎంకేకు చెందిన కీలక వ్యక్తులు ఆయనను భయభ్రాంతులకు గురిచేశారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని అర్జున పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేరుగా అధికార పక్షంపై దాడి చేయడంతో పాటు రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉండటంతో దుమారం రేగింది.
రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం
ఆధవ్ అర్జున చేసిన ఈ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. రజనీకాంత్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదు, కేవలం తన ఆరోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని ఆయనే స్వయంగా ప్రకటించారు అని వారు గుర్తు చేస్తున్నారు. రజనీకాంత్ను ఒక పిరికివాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు టీవీకే నేత తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
డీఎంకే స్పందన
డీఎంకే నాయకత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమపై బురద చల్లడమే లక్ష్యంగా టీవీకే నేతలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రజనీకాంత్ , ఎం.కె. స్టాలిన్ కుటుంబం మధ్య ఎప్పుడూ గౌరవప్రదమైన సంబంధాలే ఉన్నాయని, మధ్యలో మూడో వ్యక్తికి అనవసరమైన ఆరోపణలు చేసే హక్కు లేదని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికిని చాటుకోవడానికే టీవీకే ఇలాంటి వివాదాలను సృష్టిస్తోందని వారు విమర్శించారు.
టీవీకే అంతర్గత పరిణామాలు
పార్టీ కార్యకర్తలలో, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతో టీవీకే నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఆధవ్ అర్జున చేసినవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, పార్టీకి వాటితో సంబంధం లేదని కొందరు నేతలు సమర్థించుకుంటున్నప్పటికీ, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటంపై విజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ వివాదం కారణంగా రజనీకాంత్ అభిమానుల మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Posters of actor #Rajinikanth were put up along the roads on #AnnaSalai, drawing the attention of passers-by. The posters presumably put up by his fans are a reaction to #TVK's #AadhavArjuna's recent comment implying that Rajini succumbed to DMK pressure and gave up politics. pic.twitter.com/8ZeDrjYd5D
— DT Next (@dt_next) March 15, 2026
తమిళనాడులో అగ్ర హీరోలైన రజనీకాంత్ , విజయ్ అభిమానుల మధ్య ఎప్పుడూ ఒక రకమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్, రజనీ మద్దతును కూడగట్టుకోవాల్సింది పోయి, తన నేతల ద్వారా ఇలాంటి వివాదాలు కొనితెచ్చుకోవడం రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.























