Saranga Dariya First Review: 'సారంగ దరియా' ఫస్ట్ రివ్యూ - ట్రాన్స్జెండర్స్ మీద సెన్సిటివ్ టాపిక్ టచ్ చేస్తూ...
Saranga Dariya Movie 2024: రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన 'సారంగ దరియా' జూలై 12న... అంటే ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఎలా ఉందో తెలుసా?
రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో రూపొందిన సందేశాత్మక కుటుంబ కథా చిత్రం 'సారంగ దరియా' (Saranga Dariya Movie). శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మహమ్మద్, మోహిత్ పేడాడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 12న (ఈ శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా. థియేటర్లలో విడుదలకు ముందు కొంత మందికి స్పెషల్ షో వేశారు. దాంతో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 'సారంగ దరియా' చూసిన జనాలు చెప్పిన మాటలను బట్టి సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
ట్రాన్స్జెండర్స్... సెన్సిటివ్ టాపిక్!
Saranga Dariya First Review: 'సారంగ దరియా' ట్రైలర్ చూస్తే... క్లాసు రూముల్లో పిల్లలకు పాఠాలు బోధించే ఓ ఉపాధ్యాయుడి భావోద్వేగం, కులాంతర ప్రేమ వంటి అంశాలు కనిపిస్తాయి. కానీ, కథలో అంతకు మించి సున్నితమైన అంశాన్ని చిత్ర దర్శకుడు పండు అలియాస్ పద్మారావు అబ్బిశెట్టి టచ్ చేశారని తెలిసింది.
ట్రాన్స్జెండర్స్... సమాజంలో భాగమే. అయితే... కొంత మంది వాళ్ళని కాస్త చిన్న చూపు చూస్తారు. సినిమాల్లోనూ వాళ్ళను గొప్పగా చూపించిన సందర్భాలు తక్కువ. అయితే... 'సారంగ దరియా'లో ట్రాన్స్జెండర్స్ గురించి ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయనటువంటి అంశాన్ని చూపించారని తెలిసింది. ఆ సన్నివేశాలు అన్నీ చాలా భావోద్వేగ భరితంగా ఉంటాయని, ప్రేక్షకులు కంటతడి పెట్టడం ఖాయమని ఫస్ట్ రిపోర్ట్స్ అందుతున్నాయి.
'సారంగ దరియా' ఫస్టాఫ్ కాస్త నిదానంగా ఉంటుందట. పాత్రల పరిచయం, అలాగే ప్రేమ వినోదాత్మక సన్నివేశాలతో సాగిందట. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు షాక్ ఇవ్వడం ఖాయమని తెలిసింది. ట్రాన్స్జెండర్ రోల్ ఎవరు చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక... ఇంటర్వెల్ తర్వాత కథలో ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ అవుతాయని, క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుందని సమాచారం. 'సారంగ దరియా' ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే... జూలై 12న 'భారతీయుడు 2' కూడా విడుదల అవుతోంది. మరి, ఈ పోటీలో ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.
Saaranga Dariya Cast And Crew: 'సారంగ దరియా'ను చల్లపల్లి చలపతి రావు ఆశీస్సులతో ఉమా దేవి, శరత్ చంద్ర ప్రొడ్యూస్ చేశారు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కింది. ఇందులో ఒక పాటను లెజెండరీ గాయని కెఎస్ చిత్ర ఆలపించారు. నీల ప్రియా, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంత బాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అరుణాచల మహేష్, మాటలు: వినయ్ కొట్టి, కూర్పు: రాకేష్ రెడ్డి, పాటలు: రాంబాబు గోశాల - కడలి సత్యనారాయణ, సంగీతం: ఎం ఎబెనెజర్ పాల్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ స్వయంభు.