Balakrishna: 'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
Jaat director Gopichand Malineni Next Movie: 'జాట్'తో హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఆయన తెలుగు హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్.

సన్నీ డియోల్ కథానాయకుడిగా నటించిన 'జాట్' సినిమా (Jatt Movie)తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఇటువంటి మాస్ కమర్షియల్ సినిమాను హిందీ దర్శకులు తీయలేరని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తనలో హీరోయిజాన్ని ఇప్పటి వరకు హిందీ దర్శకులు ఇలా గొప్పగా ఆవిష్కరించలేదని సన్నీ డియోల్ సైతం కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బాక్సాఫీస్ బరిలో ఆ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. మరి ఇప్పుడు గోపీచంద్ మలినేని ఎవరితో సినిమా చేయబోతున్నారంటే...
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని సినిమా...
బ్లాక్ బస్టర్ వీర సింహా రెడ్డి తర్వాత కాంబో రిపీట్!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా మరో సినిమా చేసేందుకు గోపీచంద్ మలినేని రెడీ అవుతున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వసనీయ వర్గాల సమాచారం.
బాలయ్య హీరోగా తీసిన 'వీర సింహా రెడ్డి' సినిమాతో గోపీచంద్ భారీ విజయం అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఆ తర్వాత 'జాట్' తీశారు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణకు సూటయ్యే కథతో గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... 'యమదొంగ' రీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఇక ఆ మూడు రోజులూ!
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2 శివ తాండవం' సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే అవకాశం ఉంది. మరో రెండు మూడు కథలు విన్నప్పటికీ గోపీచంద్ మలినేని కథ ఆయనకు బాగా నచ్చిందట.
మోక్షజ్ఞతో సినిమా తీయాలనుకున్న నిర్మాతకు ఛాన్స్!
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో తాజా సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలిసింది. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాలవల్ల ప్రారంభోత్సవానికి ఒక్క రోజు ముందు ఆ చిత్రాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది. అందుకని ఆ నిర్మాతకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాను చేయబోయే తాజా సినిమాను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చారట బాలకృష్ణ.





















