Venu Udugula: రానా సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్... కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!
Venu Udugula New Movie: విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సినిమాలు తీశారు దర్శకుడు వేణు ఊడుగుల. రానా సినిమా తీశాక మూడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు.

దర్శకుడిగా వేణు ఊడుగుల (Venu Udugula)ది విభిన్న శైలి. విమర్శకులతో పాటు ప్రేక్షకులు ప్రశంసించిన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 'నాదీ నీదీ ఒకే కథ' సినిమాలో తల్లిదండ్రుల అంచనాల మేరకు చదవలేని ఎంతో మంది మానసిక సంఘర్షణకు దృశ్య రూపం ఇచ్చారు. నక్సలిజం నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరు స్పృశించని అటువంటి కొత్త తరహా ప్రేమ కథను 'విరాట పర్వం'లో చూపించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను అనౌన్స్ చేశారు.
యువి క్రియేషన్స్ సంస్థలో మూడో సినిమా!
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా దర్శకత్వం వహించిన 'విరాట పర్వం' సినిమా విడుదలై మూడేళ్లు దాటింది. మొదటి సినిమాకు, ఆ చిత్రానికి కూడా కొంత గ్యాప్ ఉంది. మూడేళ్ల విరామం తర్వాత తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు వేణు ఉడుగుల.
రెబల్ స్టార్ ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ లాంటి యువి క్రియేషన్స్లో తన తదుపరి సినిమా ఉంటుందని వేణు ఊడుగుల స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. వేణు ఊడుగుల ఓ నిర్మాతగా చేసిన 'రాజు వెడ్స్ రాంబాయి' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్మీట్లో ఆయన ఈ విషయం చెప్పారు.
Also Read: వేణు ఊడుగుల కాన్ఫిడెన్స్ ఏంటో... ప్రేమిస్తే, ఆర్ఎక్స్100, బేబీతో కంపేరిజన్!
'విరాట పర్వం' తర్వాత దర్శకుడిగా వేణు ఊడుగులకు విరామం వచ్చింది. అయితే సినిమాలకు ఆయన విరామం ఇవ్వలేదు. ఈ సమయంలో నిర్మాతగా బిజీ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన వెబ్ సిరీస్ '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'కు ఆయన నిర్మాత. నవంబర్ 21న థియేటర్లలోకి రానున్న రాజు వెడ్స్ రాంబాయి చిత్ర నిర్మాతలలో ఆయన ఒకరు. ఒకవైపు తన దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి కథ సిద్ధం చేస్తూ మరొకవైపు యువ దర్శకులను నిర్మాతగా ప్రోత్సహిస్తున్నారు.
Also Read: అప్పుడు అమ్మను రానివ్వలేదు... ఇప్పుడు కూతుర్ని మహేష్ ఫ్యాన్స్ వద్దంటారా?





















