Balakrishna Nandamuri: బాలయ్యకు జరిగింది అవమానమా? అన్యాయమా? 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్ ఫీలింగ్ ఏమిటి?
Akhanda 2 Thaandavam: విడుదలకు కొన్ని గంటల ముందు స్టార్ హీరో సినిమా వాయిదా పడటం కాదు... కనీసం ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి బహుశా 'అఖండ 2' విషయంలో జరిగింది. అసలు దీనికి కారకులు ఎవరు?

సకాలంలో సినిమాలు విడుదల కాకపోవడం కొత్త కాదు. ముందు ఓ తేదీ అనుకోవడం, విడుదల దగ్గరకు వచ్చేసరికి కాపీ రెడీ కాకపోవడం, దాంతో వాయిదా వేయడం వంటివి కొంత కాలంలో పెద్ద / పాన్ ఇండియా సినిమాల విషయంలో చూస్తున్నాం. కానీ, సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు ప్రీమియర్లు క్యాన్సిల్ కావడం, ఆ తర్వాత వాయిదా పడటం... కనీసం ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి బహుశా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ 2 తాండవం' విషయంలో జరిగింది. దీనికి కారకులు ఎవరు?
అవమానం బాలయ్యకు కాదు...
'అఖండ 2 తాండవం' సినిమాకు!
'అఖండ 2' వాయిదా పడటంతో నందమూరి బాలకృష్ణకు అవమానం జరిగిందని, పరువు పోయిందని సోషల్ మీడియాలో కొంత మంది అవాకులు - చెవాకులు పలుకుతున్నారు. ఇక్కడ అవమానం జరిగింది బాలకృష్ణకు కాదు... 'అఖండ 2 తాండవం' సినిమాకు. ఇక్కడ తప్పు సినిమాలో నటీనటులది కాదు... నిర్మాతలది. వాళ్ళు చేసిన పనుల వల్ల విడుదల వాయిదా పడితే హీరో ఏం చేస్తారు? తలకు మించిన భారం మోయడం ఎవరి వల్ల అవుతుంది?
పది పదిహేను కోట్లు లేదా పాతిక కోట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తే... బాలకృష్ణ చేసే వీలు ఉంటుంది. ఆయన ఓ మాట చెబితే, ఓ హామీ ఇస్తే సినిమా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే... ఎరోస్ సంస్థకు 14 రీల్స్ ప్లస్ సంస్థ కట్టాల్సినది 27.8 కోట్ల రూపాయలు కాదు. ఆ మొత్తంతో పాటు ఆరేళ్ళ పాటు 14 శాతం వడ్డీ కూడా! ఆ ఒక్క అమౌంట్ మాత్రమే కాదు... లోకల్ ఫైనాన్షియల్ ఇష్యూలు ఉన్నాయి. మొత్తం మీద సుమారు 70, 80 కోట్ల వరకు కట్టాల్సి ఉందని ఫిల్మ్ నగర్ టాక్. దాదాపు ఓ సినిమా బడ్జెట్ అది. అందుకే సినిమా వాయిదా పడింది.
ముమ్మాటికీ బాలకృష్ణకు మోసం...
బాలయ్య అభిమానులకు వంచన!
విడుదల విషయంలో 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట హీరో బాలకృష్ణను మోసం చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరోస్ కేసు ఇవాళ్టిది కాదు. కొన్నేళ్ల నుంచి నలుగుతున్నది అయినప్పటికీ... అక్టోబర్ 2025లో సమస్య మరింత జఠిలం అయ్యింది. మద్రాస్ హైకోర్టులో వాదనలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఈ సమస్యను బాలకృష్ణకు చెప్పకుండా నిర్మాతలు ఒక విధంగా మోసం చేశారని ఇండస్ట్రీ టాక్.
Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?
'అఖండ 2 తాండవం' విడుదల అయ్యే పరిస్థితి లేదని నిర్మాతలకు బుధవారం (డిసెంబర్ 3వ తేదీన) స్పష్టత వచ్చింది. మద్రాస్ హైకోర్టు నుంచి విడుదలపై స్టే వచ్చింది. అయితే ఆ విషయాన్ని నిర్మాతలు బయటకు రాకుండా మ్యానేజ్ చేశారు. అసలు విషయాన్ని తొక్కి పెట్టారు. చివరి నిమిషం వరకు అందరినీ మభ్యపెడుతూ వచ్చారు.
ఇండియాలో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసిన సమయంలో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు తప్ప ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని వివరణ ఇవ్వలేదు. పైపెచ్చు ఓవర్సీస్ ప్రీమియర్స్ షెడ్యూల్ ప్రకారం ఉంటాయని చెప్పారు. మరికొన్ని గంటల్లో సమస్యలు క్లియర్ అవుతాయని, శుక్రవారం ఉదయం ఇండియాలో సినిమా విడుదల అవుతుందని ప్రొడక్షన్ హౌస్ నుంచి లీక్స్ వచ్చాయి.
అభిమానుల మనోభావాలతో 'అఖండ 2 తాండవం' నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ ఆడుకుంది. బాలకృష్ణను మోసం చేయడం కాదు... అభిమానులను పూర్తిగా వంచనకు గురి చేసింది. ఒక్క ఎరోస్ ప్రాబ్లమ్ కాదు, ఈ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సైతం వాయిదాకు దారి తీశాయని ఇండస్ట్రీలో జనాలు చెబుతున్న మాట. ఒక్కటి మాత్రం నిజం... ఈ 'అఖండ 2 తాండవం' విడుదల వాయిదా విషయంలో బాలకృష్ణకు అన్యాయం జరిగింది. అది తలుచుకుని బాధ పడుతున్న అభిమానుల మనోవేదనను అయితే మాటల్లో వర్ణించలేం. సమస్యల నుంచి త్వరగా బయటపడి సినిమా విడుదలకు 14 రీల్స్ ప్లస్ కృషి చేస్తోంది. అయితే నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట మీద నందమూరి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ నందమూరి అభిమానుల నమ్మకాన్ని వాళ్ళు సంపాదించడం కష్టంగా కనబడుతోంది.





















