![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Prabhas Adipurush : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్పై టీజీ విశ్వప్రసాద్
TG Vishwa Prasad : 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కొన్న సంగతి తెలిసిందే. అయితే... ఆ సినిమా కొనమని ప్రభాస్ తమను అడగలేదని ఆయన తెలిపారు.
![Prabhas Adipurush : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్పై టీజీ విశ్వప్రసాద్ Adipurush Telugu Rights We discussed with Prabhas But he hasn't approached us People Media Factory TG Vishwa Prasad Prabhas Adipurush : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్పై టీజీ విశ్వప్రసాద్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/13/5f41ef9d3332a73068ec75218ae9e9531686645862845313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, అధికారికంగా ప్రకటించలేదు అంతే! ప్రభాస్ చేస్తున్న మరో సినిమాను అనూహ్యంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.
పీపుల్స్ మీడియాకు 'ఆదిపురుష్'
శ్రీరామ చంద్రుని పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. హిందీలో టీ సిరీస్ సంస్థ నిర్మించింది. ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ పేరు సైతం నిర్మాణ సంస్థల్లో ఉంది. పైగా, యువికి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. అందువల్ల, వాళ్ళే సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తారని భావించారంతా! అయితే, 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. దీని వెనుక ప్రభాస్ ఉన్నారని, యువిని అప్పుల నుంచి గట్టెక్కించడం కోసం తెలుగు థియేట్రికల్ రైట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొనేలా చేశారని గుసగుసలు వినిపించాయి.
ప్రభాస్ అడగలేదు... మేమే కొన్నాం!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)కు అగ్ర రాజ్యం అమెరికాలో వ్యాపారాలు ఉన్నాయి. సినిమా విడుదలకు సమస్యల్లో మాత్రమే ఇండియాలో ఉంటారు. లేదంటే అమెరికా వెళతారు. మంగళవారం (జూన్ 13 రాత్రి) ఆయన అమెరికా వెళుతూ వెళుతూ మీడియాతో మాట్లాడారు. రూ. 165 కోట్లు ప్లస్ జీఎస్టీకి 'ఆదిపురుష్' తెలుగు రైట్స్ కొన్నది నిజమేనని ఆయన అంగీకరించారు.
'ఆదిపురుష్' రైట్స్ (Adipurush Telugu Rights) తీసుకోమని ప్రభాస్ మిమ్మల్ని అడిగారా? అని మీడియా ప్రశ్నించగా... ''లేదండీ! ప్రభాస్ గారు మమ్మల్ని ఏమీ అడగలేదు. టీ సిరీస్ సంస్థ ఇతర భాషల్లో సినిమాలు విడుదల చేసేటప్పుడు లోకల్ నిర్మాతలకు సినిమా ఇస్తుంది. ప్రాంతీయ భాషల్లో అక్కడి నిర్మాతలు సినిమా కొని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 'ఆదిపురుష్' సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. అందుకని, తీసుకున్నాం. అయితే, తీసుకునే ముందు ప్రభాస్ గారితో డిస్కస్ చేశాం'' అని విశ్వప్రసాద్ వివరించారు. 'ఆదిపురుష్' తెలుగు రైట్స్ తీసుకోవడానికి ప్రభాస్ (Prabhas)తో ఉన్న సన్నిహిత సంబంధాలు ప్రధాన కారణమని, ఆ తర్వాత వ్యాపారమని ఆయన తెలిపారు. 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ఫ్యామిలీ అని చెప్పడం సంతోషంగా ఉందన్నారు.
తెలుగులో ప్రభాస్ 'స్పిరిట్' కూడా!
ప్రభాస్ కథానాయకుడిగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టీ సిరీస్ సంస్థ 'స్పిరిట్' నిర్మించనున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆ సినిమానూ విడుదల చేయనున్నట్లు టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. టీ సిరీస్ సంస్థతో లాంగ్ అసోసియేషన్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : ఏపీలో షూటింగులు - దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా!
జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున 'ఆదిపురుష్' థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
Also Read : మరో మెగా హీరో సినిమాలో 'ఏజెంట్' భామ సాక్షి వైద్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)