![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana Graduate MLC : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
TelanganaNews : తెలంగాణ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మే రెండో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ఖరారు చేశారు.
![Telangana Graduate MLC : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్ Notification for Telangana Graduate MLC election will be released on May 2nd Telangana Graduate MLC : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/4c45640279d5d7dcd715696d356a3ee31714046275027228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Graduate MLC election : నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మే 2వ తేదీన నోటిఫికేషన్, మే 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. జనగామా నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న
ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. యూత్, గ్రాడ్యుయేట్లలో మంచి ఫాలోయింగ్ ఉన్నందున తీన్మార్మల్లన్నకు చాన్స్ వచ్చింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ .. తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా పరిశీలించారు. అసెంబ్లీ టిక్కెట్ కోసం కూడా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆయనకు పాత అవకాశమే కొత్తగా వచ్చింది. అదే ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించారు.
గతంలో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న
నిజానికి ఈ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాంను కూడా దాటేసి రెండో స్థానంలో నిలిచారు. 2021లో జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత. ఆయన తన నెట్ వర్క్ను ఉపయోగించుకుని పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున ఎన్రోల్ చేయించారు. పకడ్బందీగా పోల్ చేయించుకోగలిగారు. అయినా రెండో స్థానంలో నిలిచారు నవీన్ కుమార్.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న మల్లన్న
రాజకీయంగా ఎదగాలనే ఆకాంక్ష ఉన్న ఆయన తరచూ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు. అంతకు ముందు హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే కనీస ప్రభావం కూడా చూపించలేదు. ఇ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి.. రెండో స్థానంలో ఉన్నారు. ఉద్యమ నేతగా అందరి ప్రశంసలు పొందిన కోదండరాం కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ మల్లన్న తర్వాత స్థానంలోనే ఉండిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నందున గెలుపొందుతామన్న నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ , బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. కోడ్ కారణంగా కౌంటింగ్ వాయిదా పడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)