NEET-UG: 'నీట్' ప్రవేశ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం, ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష నిర్వహణ
NEET-UG 2025: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్-పేపర్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

NEET UG: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ (NEET-UG) పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పెద్ద ఎత్తున దుమారం లేపిన నీట్ పేపర్ లీక్ యవ్వారం మళ్లీ రిపీట్ కాకూడదంటే ఆన్లైన్లో నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిన్నమొన్నటి వరకు ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. నీట్ పరీక్షను ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించడానికి మొగ్గు చూపింది. దీంతో ఈసారి కూడా పెన్-పేపర్ (OMR based) విధానంలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జనవరి 16న ఒక ప్రకటనలో తెలిపింది. నిర్ణీత తేదీలో దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
సుదీర్ఘ సంప్రదింపులు..
కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిర్ణయం మేరకు.. నీట్ యూజీ పరీక్ష పెన్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారి వెల్లడించారు.
ఆన్లైన్పై వెనక్కి..
దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్ యూజీ నిలుస్తోన్న సంగతి తెలిసిందే. నీట్ యూజీ పరీక్షకు గతేడాది 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్ తరహాలోనే ఈసారి (2025) కూడా నీట్ యూజీని ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ఎన్టీఏ భావిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ఛైర్మన్గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ - CBT)లో నీట్ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు.
నీట్ ఫలితాల ఆధారంగానే నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ (BHMS) కోర్సులో ప్రవేవాలు చేపడతారు. దీంతోపాటు ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్సీ నర్సింగ్ (BSc Nursing) కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది.
ALSO READ:
తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (కామన్ ఎంట్రెన్స్ టెస్టులు) షెడ్యూలును ఉన్నత విద్యామండలి జనవరి 15న ప్రకటించింది. అయితే ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించి.. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడతాయి.
ప్రవేశ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

