Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్స్ట్రక్షన్తో..
Meerpet Murder Case: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళ హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు రక్తపు ఆనవాళ్లు గుర్తించారు.

Police Investigation Ongoing In Meerpet Woman Murder Case: హైదరాబాద్లోని మీర్పేట్ మహిళ మర్డర్ (Meerpet Murder Case) కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు రెండుసార్లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నిందితుడు గురుమూర్తి పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గురువారం పిల్లల స్టేట్మెంట్ను రికార్డు చేశారు. సంక్రాంతికి ఊరెళ్లి వచ్చిన తర్వాత కూతురు అమ్మ ఎక్కడ అని అడిగితే తన తండ్రి మౌనంగా ఉండిపోయినట్లు చెబుతోంది. ఇంట్లో భరించలేని దుర్వాసన వచ్చిందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అటు, గురుమూర్తి ఇంటిని పోలీసులు మరోసారి తనిఖీ చేశారు. గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లను గుర్తించారు. మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో దొరికాయి. వీటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా నేర నిరూపణ సాధ్యమని భావిస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు.
పూటకో మాట..
నిందితుడు గురుమూర్తి పూటకో మాట చెబుతూ పొంతన లేని సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు షాక్ అవుతున్నారు. తన భార్యను తానే చంపినట్లు నేరం అంగీకరించిన నిందితుడు.. ఆ తర్వాత ఆధారాలు ఏమైనా ఉన్నాయా.? అంటూ పోలీసులనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను కోర్టులో తేల్చుకుంటానంటూ వారికి సవాల్ చేసినట్లు సమాచారం. అటు, ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు కొందరు ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. వీరు రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పీఎస్ పరిధిలోని బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యను చంపడానికి ముందే పిల్లలను పండగ సెలవులకు హైదరాబాద్లోనే ఉంటున్న తాతగారి ఇంటికి పంపేశాడు. సంక్రాంతి రోజున భార్యను హత్య చేసిన అనంతరం మటన్ నరికే కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను కుక్కర్ లో ఉడికించాడు. అనంతరం వాటిని రోకలితో దంచి పొడి చేశాడు. ఆ పొడిని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. ఈ నెల 17న అత్తగారికి ఫోన్ చేసి భార్య కనిపించడం లేదని చెప్పాడు. కూతురు అదృశ్యంపై వారు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు భర్త గురుమూర్తిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిందితుడని తేలింది. భార్యను చంపడానికి ముందు ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ట్రయల్ వేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది.
అనుమానమా..? వివాహేతర సంబంధమా..?
అయితే, తొలుత అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు భావించిన పోలీసులకు విచారణలో మరిన్ని విషయాలు తెలిశాయి. నిందితునికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తన భార్యను చంపి ఉంటాడని భావిస్తున్నారు. గురుమూర్తి ఫోన్ చూసిన పోలీసులకు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.





















